ఎదులాపురం, జూన్ 3 : కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ(స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్-ఎస్ఐఆర్) ప్రక్రియను పకాగా నిర్వహించాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా స్పష్టం చేశారు. బుధవారం ఆదిలాబాద్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో ప్రత్యేక అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కేంద్ర ఎన్నికల సంఘం రూపొందించిన ప్రత్యేక షెడ్యూల్ ప్రకారం ఓటర్ల వివరాల మ్యాపింగ్ కీలకమన్నారు. ప్రస్తుతం జాబితాలో ఉన్న ఓటర్లందరూ, గతంలో (1-1-2002 నాటి) ఎస్ఐఆర్ జాబితాలో ఉన్న తమ వివరాలతో ప్రస్తుత వివరాలను తప్పనిసరిగా సరిపోల్చుకోవాలని సూచించారు.
ఒకవేళ 2002 నాటి ఓటర్ల జాబితా అందుబాటులో లేకుంటే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఓటర్ల సౌకర్యార్థం ఆ పాత జాబితాను భారత ఎన్నికల సంఘం, సీఈవో తెలంగాణ అధికారిక వెబ్ సైట్లలో తమ వివరాలను సులభంగా వెతుకునే సదుపాయాన్ని కల్పించినట్లు వివరించారు. ఈనెల 25 నుంచి బీఎల్వోలు ఇంటింటికీ తిరిగే సమయంలో ఏజెంట్లు సహకరించాలని, బూత్స్థాయి అధికారులు ఇంటికి వచ్చినప్పుడు వారికి పూర్తి వివరాలు అందించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ చిత్రు, డీఆర్వో స్రవంతి, ఆర్డీవో జగదీశ్వర్ రావు, పట్టణ తహసీల్దార్ శ్రీనివాస్, ఎన్నికల విభాగం పర్యవేక్షురాలు నలంద ప్రియ, మున్సిపల్ వైస్ చైర్మన్ రోహిత్ పాల్గొన్నారు.