నిర్మల్ అర్బన్, సెప్టెంబర్ 12 : దర్యాప్తులో ఉన్న కేసుల్లో సమగ్ర విచారణ చేపట్టి చట్టపరంగా నేరస్తులకు శిక్ష పడేలా సంబంధిత పోలీసులు చర్యలు తీసుకోవాలని నిర్మల్ ఎస్పీ ప్రవీణ్ కుమార్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, అన్ని పోలీస్ స్టేషన్ల ఎస్ఐలతో నెలవారీ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో నమోదైన కేసుల్లో అధికారులు పకడ్బందీగా, పారదర్శకంగా విచారణ చేపట్టాలని, అందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం విరివిగా ఉపయోగించుకోవాలని తెలిపారు. ఆయా పోలీస్ స్టేషన్లలో పెండింగ్లో ఉన్న కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. వాటిని సత్వరమే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. మహిళలకు వ్యతిరేకంగా జరిగే నేరాల్లో పకడ్బందీగా విచారణ చేసి నిందితులపై తగిన చర్యలు తీసుకోవాలని, కేసుల విచారణలో నిర్లక్ష్యం చేస్తే ఉపేక్షించేది లేదన్నారు. ప్రతి కేసులో సమగ్ర విచారణ చేపట్టి బాధితులకు న్యాయం చేయాలని తెలిపారు.
జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన అన్ని రకాల చర్యలను ఇతర శాఖల అధికారులతో సంప్రదించి పటిష్టంగా అమలు చేయాలన్నారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు పాటించేలా కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు. ఈ నెల 18వ తేదీ నుంచి ప్రారంభం కానున్న గణేశ్ ఉత్సవాలకు సంబంధించి వేడుకలను శాంతియుతంగా జరుపుకోవాలన్నారు. గణేశ్ నిమజ్జనం ప్రణాళిక ప్రకారం జరగాలని, ఎక్కడా ఏ పొరపాటు లేకుండా విగ్రహాల ప్రతిష్ఠాపన సమయంలో సీఐలు, ఎస్ఐలు ముందుగానే సమావేశాలు నిర్వహించుకొని శాంతి భద్రతల సమస్య రాకుండా చూడాలన్నారు. రాబోయే శాసనసభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ముందస్తుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన నియమాలు, చేపట్టాల్సిన చర్యలపై జిల్లా పోలీసు అధికారులు, సిబ్బందితో చర్చించారు. అప్రమత్తంగా విధులు నిర్వహించాలని, ఎన్నికల ముందు మద్యం, నగదు సరఫరా నియంత్రణ కోసం సరిహద్దు ప్రాంతాల్లో చెక్ పోస్టులను ఏర్పాటు చేసి నిఘా పటిష్టం చేస్తామన్నారు. సమావేశంలో భైంసా ఏఎస్పీ కాంతిలాల్ పాటిల్, డీఎస్పీ రాంరెడ్డి, డీసీఆర్బీ రవీందర్ రెడ్డి, ఎస్బీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, కాశీనాథ్, రవీందర్ నాయక్, సీఐలు పురుషోత్తంచారి, శ్రీనివాస్, మోహన్, వినోద్, నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.