నిర్మల్ అర్బన్, జనవరి 30 : అమరవీరుల త్యాగాలు వెలకట్ట లేనివని, వారి త్యాగఫలమే నేటి మన స్వాతంత్య్రం అని ఎస్పీ జానకి షర్మిల ఉద్ఘాటించారు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతి భారతీయుడి హృదయంలో స్వదేశీ, స్వభాష, స్వరాజ్ అనే స్ఫూర్తిని గాంధీ నింపారని పేర్కొన్నారు.
దేశం కోసం వేలాది మంది స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొని ప్రాణాలను అర్పించారని గుర్తు చేశారు. అలాంటి త్యాగధనులను స్మరించుకోవడం దేశ పౌరులుగా మనందరి బాధ్యత అన్నారు. ఈ కార్యక్రమంలో డీసీఆర్బీ డీఎస్పీ రవీందర్రెడ్డి, డీపీవో సూపరింటెండెంట్ నర్సమ్మ, ఆర్ఐ రాంనిరంజన్ పాల్గొన్నారు.