రఘునాథపాలెం, జూలై 26: ఆరు గ్యారెంటీల పేరుతో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను నిలువునా వంచించిందని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ మండిపడ్డారు. దీంతో ఈ రేండున్నరేళ్ల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు పూర్తిగా నమ్మకం కోల్పోయారని అన్నారు.
రఘునాథపాలెం మండలం ఈర్లపూడి గ్రామంలో ఆదివారం ఏర్పాటుచేసిన బీఆర్ఎస్ ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం తథ్యమన్నారు. గడిచిన రెండున్నర ఏళ్ల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం తన మోసపు విధానాలను కొనసాగిస్తూనే ఉందని విమర్శించారు. దీంతో ఈ ప్రభుత్వాన్ని ప్రజలు నమ్మే పరిస్థితి లేకుండా పోయిందని అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో రేవంత్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే, బీఆర్ఎస్ బలోపేతంలో పార్టీ శ్రేణులు శక్తివంచన లేకుండా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు ఆర్జేసీ కృష్ణ, గుత్తా రవి, బచ్చు విజయ్కుమార్, మెంటం రామారావు, మాదంశెట్టి హరిప్రసాద్, మద్దినేని వెంకటరమణ, చెరుకూరి ప్రదీప్, భుక్యా లక్ష్మణ్నాయక్ తదితరులు పాల్గొన్నారు.