వానకాలం సీజన్లో సోయా పంట సాగు చేసిన రైతుకు ఈసారి ధర కలిసి వస్తున్నది. మద్దతు ధరకు మించి వ్యాపారులు కొనుగోలు చేస్తుండడంతో రైతుకు ఆర్థికంగా ప్రయోజనం చేకూరుతున్నది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రధానంగా సాగు చేసే పంటల్లో పత్తి, సోయా కీలకం. ఈసారి ఈ రెండు పంటలకూ మంచి ధర లభిస్తుండడంతో రైతాంగం హర్షం వ్యక్తం చేస్తున్నది.
నిర్మల్ టౌన్, అక్టోబర్ 31: ప్రభుత్వం ఈసారి సోయాకు మద్దతు ధర రూ. 4300 ప్రకటించగా. భైంసా మార్కెట్లో మూడు రోజుల నుంచి రూ.5,300కు పైగానే ధర పలుకుతోంది. ప్రస్తుతం సోయా పండించిన రైతులు పంట కళ్లాల్లోనే క్వింటాలుకు రూ. 5వేల చొప్పున విక్రయిస్తుండగా, మద్దతు ధర కంటే రూ. వెయ్యి అదనంగా పలకడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే సోయా పంటకు ఐదేళ్ల నుంచి రైతులు అధిక ప్రాధాన్యమిస్తున్నారు. ఈ పంట కాలం 95 రోజులు కాగా, వానకాలంలో మొదటి ఆదాయం ఇచ్చే పంటగా రైతులకు మేలు చేకూరుతున్నది. సోయా పంట సాగు చేసిన తర్వాత సాగునీటి బోర్లు, బావుల కింద చాలా మంది రైతులు మక్క పంటను సాగు చేయడంతో ఆ పంట కూడా యాసంగిలో మంచి లాభాలను తెచ్చిపెడుతోంది. మార్కెట్లో రెండు, మూడేళ్ల నుంచి ధర ఆశాజనకంగా ఉన్నప్పటికీ పత్తి ఏరేందుకు కూలీల కొరత, పెట్టుబడి అధికం, పంట కాలం కూడా మరో రెండు నెలలు ఎక్కువగా ఉండడంతో రైతులు సోయా పంట సాగు చేస్తున్నారు.
విక్రయించేందుకు సిద్ధంగా ఉన్న సోయా
రెండేళ్ల నుంచి మంచి ధరలే..
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్, నిర్మల్, కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలో సోయా పంటను సాగు చేస్తున్న రైతులకు రెండేళ్ల నుంచి ధరలు కలిసి వస్తున్నాయి. రైతులకు సెప్టెంబర్ చివరి మాసం నుంచే పంట చేతికి రావడంతో, దీని నుంచి వచ్చేఆదాయంతో రెండో పంటకు సిద్ధమవుతున్నారు. తక్కువ వర్షాలు కురిసినప్పటికీ పంట దిగుబడులపై ప్రభావం ఉండదు. ప్రస్తుతం సోయా సాగు చేసిన రైతులకు ఎకరానికి 6-8 క్వింటాళ్ల దిగుబడి వస్తోందని రైతులు పేర్కొంటున్నారు. సోయా పంటను భైంసా, కుభీర్, బోథ్, ఇచ్చోడ, ఆదిలాబాద్, తదితర మార్కెట్లో కొనుగోలు చేస్తుండగా క్వింటాలుకు రూ. 5300పైగానే ధర పలుకుతోంది. ప్రారంభంలో రూ.4800 మాత్రమే ధర పలుకగా..వారంల్లోనే రూ. 500 పెరగడంతో రైతులకు ఆర్థికంగా లాభం చేకూరుస్తోంది. ఈ సారి దక్షణాది రాష్ర్టాల్లో విస్తారంగా వర్షాలు పడడంతో ఆ ప్రాంతాల్లో పంట దెబ్బతినడంతో ఇక్కడ పండించిన సోయాకు డిమాండ్ ఉన్నట్లు వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి. బడా వ్యాపారులు గ్రామాల్లో ప్రత్యేకంగా ఏజెంట్లను నియమించుకొని పంట కళ్లాల్లోనే క్వింటాలుకు రూ. 5వేల వరకు చెల్లిస్తున్నారు. దీంతో పంటను మార్కెట్కు తరలించే అవసరం లేకుండా పోతున్నది. బిహార్ కూలీలు పెద్ద ఎత్తున గ్రామీణ పల్లెల్లో జీవనోపాధి కోసం వచ్చి రైతుల వద్ద నుంచి సోయా కొనుగోళ్లలో కూలీలుగా పని చేస్తుండడంతో రైతులకు ఇబ్బంది లేకుండా పోయింది.