ఆదిలాబాద్, జూలై 17 (నమస్తే తెలంగాణ) : ఆదిలాబాద్ జిల్లాలో యాసంగిలో రైతులు పండించిన జొన్న పంటను మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేసింది. పంట డబ్బులను ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నది. ఒక్కొక్కరికీ 50 కిలోలకు సంబంధించి డబ్బులను కోత విధించడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా యాసంగిలో 1.12 లక్షల ఎకరాల్లో రైతులు జొన్న పంటను సాగు చేశారు. ప్రభుత్వం మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లాలోని 26 కేంద్రాలను ఏర్పాటు చేసి పంట కొనుగోళ్లను చేపట్టింది.
ప్రాథమిక సహకార సంఘాల, ఇతర సంస్థలు, రైతు సంఘాల ద్వారా పంటను సేకరించారు. కొనుగోళ్ల కేంద్రాల నిర్వాహకులు పంట కొనుగోళ్లకు సంబంధించిన తక్పట్టీలు రైతులకు అందించారు. జిల్లాలో 26591 మంది రైతుల వద్ద నుంచి 7.31 లక్షల క్వింటాళ్లను కొన్నారు. క్వింటాలుకు మద్దతు ధర రూ. 3669 చొప్పున రూ. 270.59 కోట్ల విలువైన పంటను సేకరించారు. రైతుల వద్ద సేకరించిన పంట డబ్బులను వారి బ్యాంకు ఖాతాల్లో విడుతల వారీగా జమ చేస్తున్నది.
రైతులు తమ పంటకు సంబంధించిన డబ్బులు బ్యాంకుల్లో జమవుతుండగా పంట విక్రయానికి సరిపడా డబ్బులు రాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ఒక్కొక్కరికీ 50 కిలోల చొప్పున పంటకు సంబంధించిన డబ్బులు తక్కువగా వస్తున్నాయని రైతులంటున్నారు. ఎంతో కష్టపడి పండించిన పంట విక్రయానికి మార్కెట్ యార్డుల్లో పడిగాపులు కాయాల్సి వచ్చిందని, తీరా తమకు రావాల్సిన డబ్బుల్లో సైతం కోత విధిస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తక్పట్టీల్లో సూచించిన విధంగా పంట విక్రయానికి సరిపడా డబ్బులు రావడం లేదన్నారు. 50 కిలోల పైసలు ఎందుకు కట్ చేశారో తెలియడం లేదంటున్నారు. ఈ విషయంలో కొనుగోలు కేంద్రాల నిర్వాహకులను అడిగితే కట్ అయిన పైసలు త్వరలో జమ చేస్తామని అంటున్నారని రైతులు తెలిపారు. రైతులకు సంబంధించిన డబ్బుల కోత విషయంలో మార్క్ఫెడ్ మేనేజర్ మహేశ్కుమార్ను వివరణ కోరగా కోత విధించిన డబ్బులను రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని తెలిపారు.