ఎంపీ వెంకటేశ్ నేతకాని, ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య
రైల్వే జీఎం అరుణ్కుమార్జైన్కు వినతి
తాండూర్, జూన్ 30 : తాండూర్ మండలంలో రైల్వే అండర్ బ్రిడ్జిల నుంచి రాకపోకలకు ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, సమస్య పరిష్కరించాలని దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్కుమార్జైన్ను పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేశ్ నేతకాని, బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య కోరారు. గురువారం వారు తాండూర్ నాయకులతో కలిసి సికింద్రాబాద్లో జీఎంను కలిసి సమస్యను వివరించి వినతి పత్రాలు అందించారు. రైల్వే గేట్లు మూసి నిర్మించిన అండర్ బ్రిడ్జిల వద్ద నడులోతు నీళ్లు చేరి రాకపోకలు ఇబ్బందిగా మారిందన్నారు. అంబులెన్స్ కూడా దాటలేని పరిస్థితి ఉందని తెలిపారు. బ్రిడ్జిల వద్ద మోటర్లతో నీటిని ఎత్తిపోస్తున్నప్పటికీ సమస్య పరిష్కారం కావడం లేదన్నారు.
రైల్వే గేట్లు లేకపోవడంతో పాటు నాలుగు వరుసల రహదారి పనులు కొనసాగుతుండడంతో తాండూర్తో చుట్టుపక్కల గ్రామాలప్రజలు, విద్యార్థులకు రాకపోకలకు అవస్థలు పడుతున్నారని తెలిపారు. ద్వారకాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని కత్తెర్ల గ్రామస్థులు కొద్ది రోజులుగా గ్రామం నుంచి బయటకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. వీలైనంత త్వరగా ఈ సమస్యకు పరిష్కారం చూపాలని కోరారు. ఇక్కడ ఆర్వోబీ మంజూరు చేయాలని, ఇప్పుడు తాత్కాలికంగా మూసిన గేటును మళ్లీ తెరవాలని కోరారు. వీటితో పాటు బెల్లంపల్లిలో కొవిడ్ లాక్డౌన్ నిలుపుదల చేసిన దక్షిణ్, జీటీతో పాటు మరి కొన్ని రైళ్లకు ఇక్కడ ఆపాలని కోరారు. రైల్వే అధికారులతో సమస్యలపై విచారణ చేపట్టి అతి త్వరలో సమస్యను పరిష్కరిస్తానని తెలిపారు. వారి వెంట తాండూర్ జడ్పీటీసీ సాలిగామ బానయ్య, ఎంపీటీసీ సిరంగి శంకర్ ఉన్నారు.