సింగరేణి ప్రైవేటీకరణ, బొగ్గు బ్లాకుల వేలాన్ని నిరసిస్తూ సింగరేణి ప్రాంత ప్రజాప్రతినిధులు బుధవారం సామూహిక నిరాహార దీక్షకు పూనుకున్నారు. చెన్నూర్ నియోజకవర్గంలోని మందమర్రి మార్కెట్ ప్రాంతంలో ప్రభుత్వ విప్ బాల్క సుమన్, సీసీసీ నస్పూర్ చౌరస్తాలో మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు, బెల్లంపల్లిలోని కాంటా చౌరస్తాలో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పాల్గొననున్నారు. ఇప్పటికే వారం రోజులుగా గనులు, ఓసీపీలు, డిపార్ట్మెంట్లపై టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మల శవయాత్ర, మోదీ దిష్టిబొమ్మల దహనాలు, సంతకాల సేకరణ, కరపత్రాల పంపిణీ చేపట్టారు. మంగళవారం గేట్ మీటింగ్ నిర్వహించి.. టీఆర్ఎస్, టీబీజీకేఎస్, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, సింగరేణి కార్మికులు, ఉద్యోగులు భారీ సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
– మంచిర్యాల, ఫిబ్రవరి 8(నమస్తే తెలంగాణ)
లాభాల బాటలో పయనిస్తున్న సింగరేణిని ప్రైవేటీకరణ చేయాలని బీజేపీ ప్రభుత్వం చేస్తున్న కుటిల ప్రయత్నాన్ని టీఆర్ఎస్ పార్టీ ఎండగడుతున్నది. సింగరేణిలోని నాలుగు కోల్ బ్లాకులను వేలం వేసి కార్పొరేట్లకు ధారాదత్తం చేసే కుట్రకు తెరలేపడాన్ని అడుగడుగునా అడ్డుకుంటున్నది. ఈ మేరకు వారం రోజులకుపైగా సింగరేణి వ్యాప్తంగా టీఆర్ఎస్, టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో ఆందోళనలు ఉధృతంగా కొనసాగుతుండగా.. బుధవారం సామూహిక నిరాహార దీక్షలు చేపట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు శ్రేణులను సమయాత్తం చేసింది. విజయవంతం చేసేందుకు టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో మంగళవారం గేట్ మీటింగ్ కూడా ఏర్పాటు చేశారు. సింగరేణి బచావో.. అంటూ అవగాహన కల్పిస్తూ పలువార్డుల్లో కరపత్రాలు పంపిణీ చేశారు. అన్ని గనులు, ఓపెన్ కాస్టులు, డిపార్ట్మెంట్లు, కార్మిక ప్రాంతాల్లో నేడు(బుధవారం) దీక్షలకు సన్నాహాలు చేశారు. చెన్నూర్ నియోజకవర్గంలోని మందమర్రి మార్కెట్ ప్రాంతంలో ప్రభుత్వ విప్ బాల్క సుమన్, సీసీసీ చౌరస్తాలో మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు, బెల్లంపల్లిలోని కాంటా చౌరస్తాలో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పాల్గొననున్నారు. టీఆర్ఎస్, టీబీజీకేఎస్, అనుబంధ సంఘాల నాయకులు, సభ్యులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, సింగరేణి కార్మికులు, ఉద్యోగులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఎమ్మెల్యేలు పిలుపునిచ్చారు.
సింగరేణి ప్రైవేటీకరణ నిర్ణయాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు, ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఇటీవల పలు ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. బొగ్గు బ్లాక్ల వేలాన్ని అడ్డుకునేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు. ఢిల్లీకి సెగ తగిలేలా నిరసన కార్యక్రమాలు ఉధృతం చేశారు. ఇందులో భాగంగా టీఆర్ఎస్, టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో ఈ నెల 2న బుధవారం అన్ని గనుల వద్ద కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మ దహనాలు, శవయాత్రలు నిర్వహించారు. 3న సింగరేణి ఉద్యోగులు, కార్మికులతో సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టా రు. శుక్రవారం అన్ని గనుల వద్ద కార్మికులు, ఉ ద్యోగులకు కరపత్రాలు పంపిణీ చేశారు. బీజేపీ హఠావో.. సింగరేణి బచావో.. అంటూ నినాదా లు చేశారు. మంగళవారం గేట్ మీటింగ్లు ఏ ర్పాటు చేశారు. నాలుగు బ్లాకుల వేలం, సింగరే ణి ప్రైవేటీకరణతో కలిగే నష్టాలను వివరించారు. బొగ్గు బ్లాక్ల వేలం, సింగరేణి ప్రైవేటీకరణ ఆలోచన ఉపసంహరించుకునే వరకు తగ్గేది లేదని టీ ఆర్ఎస్, టీబీజీకేఎస్ నాయకులు స్ప ష్టం చేస్తున్నారు. సింగరేణి సంస్థ రక్షణ కోసం ఎలాంటి త్యాగాలకైనా సిద్ధమని హెచ్చరిస్తున్నారు.