రామవరం, సెప్టెంబర్ 2 : ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బదిలీ వర్కర్ల కల నెరవేరింది.. టీబీజీకేఎస్ నేతల కృషి ఫలించింది.. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు సింగరేణి సంస్థ కార్మికులకు తీపికబురు అందించింది.. తాజాగా సీఎండీ శ్రీధర్కు ఆదేశాలు ఇవ్వడంతో జనరల్ మజ్దూర్లుగా అప్గ్రేడ్ చేసింది. ఈ మేరకు యాజమాన్యం గురువారం ఉత్తర్వులు జారీ చేయగా, సింగరేణి వ్యాప్తంగా 2,321 మందికి ఉద్యోగోన్నతి లభించింది. దీంతో కార్మిక కుటుంబాలు హర్షం వ్యక్తం చేశాయి. ముఖ్యమంత్రికి రుణపడి ఉంటామంటూ కృతజ్ఞతలు చెబుతున్నాయి.
గతంలో బదిలీ వర్కర్ జనరల్ మజ్దూర్గా మారాలంటే అదో పెద్ద ప్రహసనం. కనీసం ఆరేడేండ్లు పట్టేది. అది కూడా పైరవీలతోనే నడిచేది. టీబీజీకేఎస్ గుర్తింపు సంఘంగా ఎన్నికైన తర్వాత బదిలీ వర్కర్ల పరిస్థితిని నేతలు, సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఆయన సంస్థ నిబంధనలు అనుసరించి జనరల్ మజ్దూర్లుగా ప్రమోషన్ ఇవ్వాలని సీఎం డీ శ్రీధర్ను ఆదేశించారు. దీంతో అర్హత ఉన్న కార్మికులకు జనరల్ మజ్దూర్లుగా ఉద్యోగోన్నతి లభించింది. దీంతో సింగరేణిలో ప్రస్తుతం బదిలీ వర్కర్లుగా పనిచేస్తున్న కార్మికులను జనరల్ మజ్దూర్లుగా ప్రమోషన్ ఇస్తూ యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో 2,321 మంది బదిలీ వర్కర్లకు లబ్ధిచేకూరనున్నది.
టీబీజీకేఎస్ గుర్తింపు సంఘంగా ఎన్నికైన నాటి నుంచి ఇప్పటివరకు సుమారు 10వేల మందికి జనరల్ మజ్దూర్ ప్రమోషన్ ఇచ్చింది. నియమ నిబంధనల ప్రకారం వందలోపు మస్టర్లు మాత్రమే చేస్తే మూడేండ్లు వరుసగా అదే పద్ధతిలో కొనసాగితే డిస్మిస్ అయ్యే ప్రమాదం ఉంది. విధులకు ఎక్కువగా గైర్హాజరవుతున్న వారిని గుర్తించి, యాజమాన్యం మూడు నెలలకోసారి కుటుంబ సభ్యులను పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నది. దీంతో కొంత హాజరుశాతం పెరుగుతున్నది. కౌన్సెలింగ్లో పారిశ్రామిక నిబంధనలు వివరించడంతో పాటు క్రమంగా విధులకు హాజరయ్యేలా సంక్షేమాధికారులు, పర్సనల్ డిపార్ట్మెంట్ సిబ్బంది కృషి చేస్తున్నారు. యాజమాన్య నిబంధనల ప్రకారం 2021, డిసెంబర్ 31 వరకు ఉద్యోగం పొంది ఏదైనా ఒక ఏడాదిలో అండర్ గ్రౌండ్లో 190 మస్టర్లు, 240 సర్ఫేస్ మస్టర్లు పూర్తి చేసుకున్న వారికి జనరల్ మజ్దూర్ నియామక పత్రాలు అందనున్నాయి.
సీఎం సార్కు రుణపడి ఉంటా..
సీసీసీ నస్పూర్, సెప్టెంబర్ 2 : సీసీసీ కార్నర్లో నివాసముంటున్న నేను, శ్రీరాంపూర్ ఏరియాలోని ఎస్సార్పీ-3గనిలో బదిలీ వర్కర్గా పనిచేస్తున్న. మా నాన్న రాయమల్లు ఆర్కే-5బీ గనిలో సపోర్ట్మన్గా పనిచేసి, 2019లో మెడికల్ ఇన్వాలిడేషన్ అయ్యారు. కారుణ్యం కింద నాకు ఉద్యోగం రాగా, 2020, నవంబర్ 11న ఉద్యోగంలో చేరిన. ఇప్పటి వరకు 257 మస్టర్లు పూర్తి చేసిన. బదిలీ వర్కర్ నుంచి జనరల్ మజ్దూర్గా ఉద్యోగోన్నతి లభించింది. సీఎం కేసీఆర్ ఆదేశాలు, టీబీజీకేఎస్ యూనియన్ నేతల కృషితోనే అది సాధ్యమైంది. సీఎం కేసీఆర్కు, టీబీజీకేఎస్ నాయకులకు రుణపడి ఉంటా. – పొట్టాల రాజశేఖర్, ఎస్సార్పీ-3
ఏడాదిన్నరలోనే రావడం అదృష్టం..
మందమర్రి రూరల్, సెప్టెంబర్ 2 : కేకే-1 గనిలో 2021, జనవరిలో బదిలీ ఫిల్లర్గా ఉద్యోగంలో చేరాను. నేను అపాయింట్ అయిన కొద్ది కాలంలోనే జనరల్ మజ్దూర్గా ప్రమోషన్ రావడం సంతోషంగా ఉంది. కేవలం ఏడాదిన్నరలోనే ప్రమోషన్ రావడం నా అదృష్టంగా భావిస్తున్న. గతంలో ఏండ్లు గడిచినా ప్రమోషన్లు రాక కార్మికులు ఇబ్బందిపడేవారు. నిరసనలు చేసిన సంఘటనలు కూడా ఉన్నాయి. రాష్ట్ర ఏర్పాటు తర్వాత సింగరేణిలో అనేక మార్పులు వచ్చాయి. కష్టపడే వారికి పెద్దపీట వేస్తున్నారు. అనుకున్న సమయానికి ఉద్యోగోన్నతి కల్పిస్తున్నారు.
– మాసాడి విజయ్ కుమార్, (కేకే 1, మందమర్రి ఏరియా)
టీఆర్ఎస్, టీబీజీకేఎస్దే ఘనత..
తాండూర్, సెప్టెంబర్ 2 : సింగరేణి కార్మికులకు ప్రమోషన్లు ఇప్పించిన ఘనత కేవలం టీబీజీకేఎస్, టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుంది. సింగరేణి చరిత్రలో 190/240 మస్టర్లు పూర్తిచేసిన బదిలీ పిల్లర్లను రెండేండ్లలోపు జనరల్ మజ్దూర్గా ప్రమోషన్ ఇప్పించిన సీఎం కేసీఆర్కు కార్మికులు రుణపడి ఉంటారు. జాతీయ సంఘాలు పని చేసిన కాలంలో ఏండ్ల తరబడి బదిలీ పిల్లర్గా, బదిలీ వర్కర్లుగా పనిచేసేవారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక తూచా తప్పకుండా ప్రమోషన్స్ ఇప్పిస్తూ కార్మికులకు న్యాయం చేస్తున్నారు.
– మల్రాజు శ్రీనివాసరావు, (టీబీజీకేఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు, బెల్లంపల్లి)