ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నిరాదరణకు గురైన కులవృత్తులను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది. గతంలో ఉపాధి కోసం వలసబాట పట్టిన జనం.. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలతో సొంత గ్రామాలకు తిరిగొస్తున్నారు. ఇందులో భాగంగా గొల్ల, కుర్మలకు 75 శాతం సబ్సిడీపై గొర్రెలను పంపిణీ చేస్తున్నది. ఆదిలాబాద్ జిల్లాలో రెండో విడుత పంపిణీకి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. మొదటి విడుతలో 4,422 మందికి జీవాలు అందించగా.. లబ్ధిదారులు మెరుగైన ఉపాధి పొందుతున్నారు. రెండో విడుతలో 3,598 మందికి పంపిణీ చేయాలని నిర్ణయించగా.. ఇప్పటికే 2,013 మంది డీడీలు చెల్లించారు. జీవాల పంపిణీలో భాగంగా కోడ్ విధానం అమలు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
ఆదిలాబాద్, ఏప్రిల్ 3(నమస్తే తెలంగాణ) : ఉమ్మడి రాష్ట్రంలో కులవృత్తుల పరిస్థితి దారుణంగా ఉండేది. కులవృత్తులపై ఆధారపడి జీవించేవారు కుటుంబ పోషణ భారమై ఇతర రాష్ర్టాలు, పట్టణాలకు నెలల తరబడి వలస వెళ్లేది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కులవృత్తులకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నది. వారిని ఆదుకునేందుకు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నది. గొల్ల, కుర్మలకు 75 శాతం సబ్సిడీపై గొర్రెల పంపిణీ, మత్స్యకారులకు ఉచితంగా చేప పిల్లల అందజేత, మార్కెటింగ్కు వాహనాలు ఇస్తున్నది. గతంలో ఉపాధికి వలసబాట పట్టిన పల్లెవాసులు, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలతో సొంత గ్రామాలకు తిరిగొచ్చి ఉపాధి పొందుతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో గొల్ల, కుర్మలకు 75 శాతం సబ్సిడీపై గొర్రెల పంపిణీ ప్రయోజనకరంగా మారింది. ఇప్పటికే 4,422 మంది లబ్ధిదారులకు అధికారులు జీవాలను అందజేశారు. సర్కారు అందించిన సాయంతో లబ్ధిదారులు తమ ఉపాధిని మెరుగుపర్చుకున్నారు.
రెండో విడుత గొర్రెల పంపిణీలో భాగంగా ప్రభుత్వం ఆదిలాబాద్ జిల్లాలో 3,598 మంది లబ్ధిదారులకు గొర్రెల యూనిట్లు అందజేయన్నది. మొదటి విడుతలో ఒక్కో యూనిట్ ధర రూ.1.25 లక్షలు ఉండగా.. ఈసారి యూనిట్ విలువ రూ.1.75 లక్షలకు పెంచింది. ఇందులో నుంచి లబ్ధిదారుడు తన వాటా కింద విలువలో 25శాతం అంటే రూ.43,750 చెల్లించాలి. రూ.1,31,250 సబ్సిడీ కింద రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చే స్తుంది. జిల్లాలో ఇప్పటికే 2,013 మంది లబ్ధిదారులు డీడీలు చెల్లించారు. ఒక్కో యూనిట్లో 21 గొర్రెలు ఉంటాయి. రెండో విడుత పంపిణీకి సంబంధించిన అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పంపిణీ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించడానికి పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. ఈసారి లబ్ధిదారులకు ప్రత్యేక ఐడీ నంబరు కేటాయిస్తారు. ఐడీని బ్యాంకు ఖాతాతో అనుసంధానం చేస్తారు. ప్రభుత్వం నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో సబ్సిడీ డబ్బులు జమ చేస్తున్నది. లబ్ధిదారుడి బ్యాంకు ఖాతా నుంచి అమ్మకందారుడి బ్యాంకు ఖాతాకు డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తారు. ఆన్లైన్ విధానంలో పూర్తి పారదర్శకంగా గొర్రెల కొనుగోలు నిర్వహిస్తారు.
ఆదిలాబాద్ జిల్లాలో రెండో విడుత గొర్రెల పంపిణీకి ఏర్పాట్లు చేస్తు న్నాం. ఈసారి 3,598 యూనిట్లు అందించడనుండగా.. 2013 మంది డీడీలు చెల్లించారు. మిగతా వారు కూడా డీడీలు చెల్లించేలా చర్యలు తీసుకుంటున్నాం. పంపిణీ ప్రక్రియ పూర్తి పారదర్శకంగా ఉంటుంది. మొదటి విడుత పంపిణీతో లబ్ధిదారుల ఉపాధి మెరుగుపడింది. ఈసారి యూనిట్ విలువ రూ.1.75 లక్షలుగా నిర్ణయించారు.
– కిషన్, జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి, ఆదిలాబాద్