ఆదిలాబాద్ టౌన్, ఫిబ్రవరి 24 : విద్యార్థుల ఉజ్వల భవితకు పాలిటెక్నిక్ బాటలు వేస్తున్నది. రాష్ట ప్రభుత్వం ఈ విద్యకు అధిక ప్రాధాన్యమిస్తుండగా, నైపుణ్యం ఉంటే చాలు.. స్వయం ఉపాధితో పాటు ఉద్యోగాలు పొందేందుకు సరైన అవకాశాలు కల్పిస్తున్నది. కొలువులో త్వరగా స్థిరపడాలన్నా.., ఇంజినీర్గా ఎదగాలన్నా ఈ కోర్సులకు మించిన ప్రతాయమ్నాయం మరోటి లేకుండాపోయింది. విద్యార్థులకు నైపుణ్యాలు మెరుగ్గా ఉండడంతో అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయనేందుకు ఆదిలాబాద్ పాలిటెక్నిక్ కళాశాల సాక్ష్యంగా నిలుస్తున్నది. దశాబ్దాల చరిత్ర గల ఈ కళాశాలపై ‘నమస్తే’ ప్రత్యేక కథనం..
రాష్ట్ర ప్రభుత్వం సాంకేతిక విద్యకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నది. సాంకేతిక కళాశాల విద్యను రాష్ట్రంలో ప్రత్యేకంగా కమిషనర్ పర్యవేక్షిస్తుండడంతో విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంపొందుతున్నాయి. ఆధునిక టెక్నాలజీకి అనుగుణంగా సిలబస్ మారుస్తూ విద్యార్థులకు మంచి భవిష్యత్ అందిస్తున్నారు. పాలిటెక్నిక్లో చదివే సబ్జెక్టులే ఇంజినీరింగ్లో కూడా ఉంటాయి. కాబట్టి పాలిటెక్నిక్ తర్వాత ఇంజినీరింగ్ చేస్తే చాలా సులువుగా సబ్జెక్ట్పై పట్టు సాధించవచ్చు. ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ల కంటే కూడా పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తి చేసిన వారికి కంపెనీలు అధిక ప్రాధ్యానమిస్తున్నాయి. పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సు పూర్తయ్యాక ఈ-సెట్ రాసి.. నేరుగా ఇంజినీరింగ్ రెండో సంవత్సరంలో చేరొచ్చు. తక్కువ ఖర్చుతో ఇంజినీరింగ్ వైపు అడుగులు వేసేందుకు వీలు కల్పించే అద్భుత అవకాశం. పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తిచేసిన వారు స్వయం ఉపాధి ద్వారా కూడా స్థిరపడొచ్చు. ఇందుకు ఆర్థిక సంస్థల సహకారం పొందవచ్చు.
భవిష్యత్లో మరింత ప్రయోజనం..
నూతన విద్యా విధానం ప్రకారంగా భవిష్యత్లో పాలిటెక్నిక్ సెకండియర్ తర్వాత 90 క్రెడిట్లు పొందినా, లేదా మూడేండ్ల కోర్సులో ఫెయిల్ అయి 90 క్రెడిట్లు సాధించినా ఆ విద్యార్థికి సర్టిఫికెట్ ఇంజినీరింగ్ను జారీ చేసే అవకాశం ఉంది. ఈ సర్టిఫికెట్తో ఎంసెట్తో ఇంజినీరింగ్లో చేరడం సహా బీఏ, బీఎస్సీ, బీకాం వంటి డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకూ అవకాశమిస్తారు.
సీసీ కెమెరాలు, బయోమెట్రిక్..
ఆదిలాబాద్ పాలిటెక్నిక్ కళాశాలలో విద్యార్థుల సంరక్షణకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. అలాగే అధ్యాపకులు, విద్యార్థుల హాజరు నమోదుకు బయోమెట్రిక్ విధానాన్ని అమలుచేస్తున్నారు. విద్యార్థుల ప్రగతిపై ప్రిన్సిపాల్, లెక్చరర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. దీంతో ఇక్కడ మెరుగైన ఫలితాలు వస్తున్నాయి.
పాలిటెక్నిక్ దరఖాస్తు విధానం ..
రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలల్లో ఇంజినీరింగ్, నాన్- ఇంజినీరింగ్ కోర్సుల్లో 2023-24 విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు పాలీసెట్-2023 ప్రకటనను రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణ బోర్డు సెక్రెటరీ విడుదల చేస్తారు. పదో తరగతి పూర్తయిన/చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. పాలీసెట్-2023 ఆన్లైన్ రిజిస్ట్రేషన్కు ఏప్రిల్ 24 గడువు. మే 17న పాలిసెట్ ప్రవేశ పరీక్ష ఉంటుంది. అందుకు సంబంధించిన పూర్తి వివరాలు, సమాచార పుస్తకాన్ని POLYCET.SBTET.TELAN GANA.GOV.IN వెబ్సైట్లో పొందవచ్చని తెలిపారు.
ఆదిలాబాద్ పాలిటెక్నిక్ ప్రస్థానం ..
జిల్లాలోని సంజయ్గాంధీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల 1980లో ప్రారంభమైంది. ఉమ్మడి జిల్లాలో స్థాపించబడిన మొట్టమొదటి కళాశాల ఇదే కావడం విశేషం. ఈ కళాశాలలో ఉమ్మడి రాష్ట్రంలోని వివిధ జిల్లాల విద్యార్థులు చదివారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాల విద్యార్థులు ఇక్కడ చదువుతున్నారు. మెరుగైన ఫలితాలు సాధిస్తున్నారు.
కళాశాలలో సీట్ల వివరాలు ..
ఆదిలాబాద్ సంజయ్ గాంధీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో సివిల్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజినీరింగ్ కోర్సుల్లో 60 సీట్ల చొప్పున మొత్తం 240 సీట్లు ఉన్నాయి. జిల్లాలోని ప్రభుత్వ ఆదర్శ రెసిడెన్షియల్ పాలిటెక్నిక్ ఇంజినీరింగ్ విభాగాల్లో 60 సీట్ల చొప్పున మొత్తం 120 ఉన్నాయి. పాలిసెట్ ప్రవేశ పరీక్షల్లో వచ్చిన ర్యాంక్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
పాలీసెట్ సిలబస్, ర్యాంకుల జారీ..
గణితం, భౌతిక, రసాయన, జీవశాస్ర్తాల్లో పదోతరగతి స్థాయిలో మల్టిపుల్ ఆప్షన్ ప్రశ్నలతో పాలీసెట్ పరీక్ష ఉంటుంది. మొత్తం 150 ప్రశ్నలకు 150 మార్కులు ఉంటాయి. గణితంలో 60 మార్కులకు 60 ప్రశ్నలు, మిగతావి భౌతిక, రసాయన, జీవ శాస్ర్తాల్లో ఒక్కో సబ్జెక్టులో 30 మార్కుల చొప్పున 30 ప్రశ్నలు ఉంటాయి. పాలీసెట్-2023 పరీక్ష రాసిన విద్యార్థులకు ఒకటి ఎంపీసీ ర్యాంక్, మరోటి ఎంబీఐపీసీ ర్యాంకులు ఇవ్వనున్నారు. వ్యవసాయ, వెటర్నరీ, హార్టికల్చర్, యానిమల్ హస్బెండ్రి, ఫిషరీష్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు కూడా పాలీసెట్-2023 ర్యాంక్ ఆధారంగానే ఉంటాయి. ఈ కోర్సులు చేయదలచుకున్న విద్యార్థులు తప్పనిసరిగా జీవశ్రాస్తానికి సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది.
పాలిటెక్నిక్ విద్యతో పయోజనం..
త్వరగా ఉపాధి, అతి తక్కువ ఖర్చుతో ఉన్న విద్య, ఉద్యోగ అవకాశాలను స్వయం ఉపాధి చేపట్టేందుకు పాలిటెక్నిక్ విద్య ఉత్తమ మార్గం. ఇంటర్ ద్వారా ఇంజినీరింగ్ చేసిన విద్యార్థులకంటే పాలిటెక్నిక్ ద్వారా ఇంజినీరింగ్ చేసిన విద్యార్థుల్లో థియరీ, ప్రాక్టికల్స్ పరిజ్ఞానం, భావ వ్యక్తీకరణ నైపుణ్యాలు ఎక్కువగా ఉండడం వల్ల ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉంటున్నాయి. అలాగే డిప్లొమా చివరి సంవత్సరంలో 6 నెలల పారిశ్రామిక శిక్షణ ద్వారా విద్యార్థుల సాంకేతిక నైపుణ్యం మరింత మెరుగుపడుతుంది. ఆదిలాబాద్లోని పాలిటెక్నిక్ కళాశాలకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి గుర్తింపుతోపాటు, ఐఎస్వో నాణ్యత ధ్రువీకరణ పత్రం ఉంది. మా కళాశాలలో చదువుకున్న విద్యార్థులు ఇప్పటికే ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో స్థిరపడ్డారు. నాలుగు కోర్సులకు పాలిసెట్ ర్యాంక్ ఆధారంగా ప్రవేశాలు జరుగుతాయి. గడువులోగా దరఖాస్తు చేసుకోవాలి.
– పీ భరద్వాజ, ప్రిన్సిపాల్, పాలీసెట్ జిల్లా సమన్వయకర్త
పాలిటెక్నిక్తో ఉద్యోగావకాశాలు..
పాలిటెక్నిక్ చదవడం ద్వారా ఆయా కోర్సులను బట్టి ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థల్లో ఉద్యోగాలతోపాటు, ఉన్నత విద్య, స్వయం ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయి. డిప్లొమా చదువు సమయంలో పారిశ్రామిక శిక్షణ ద్వారా విద్యార్థుల నైపుణ్యాలు మెరుగుపడతాయి. కానీ, కఠినమైందనుకొని ఈ వైపు రావడానికి ప్రయత్నించరు. లెక్చరర్లు చెప్పిన పాఠాలను శ్రద్ధగా వింటూ క్రమశిక్షణతో ప్రాక్టీస్ చేస్తే అందరూ రాణించవచ్చు.
– ఎస్ రాజ్కుమార్, మెకానికల్ ఇంజినీరింగ్ విభాగ అధిపతి
ఈ విద్యతో మంచి భవిష్యత్..
నేను మెకానికల్ ఇంజినీరింగ్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నా. ఈ కోర్సు ద్వారా వివిధ ప్రభుత్వ, ప్రైవేటు పరిశ్రమల్లో ఉద్యోగ అవకాశాలు చాలా ఉన్నాయి. అలాగే ఉన్నత విద్య అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయి. ప్రస్తుతం ఈ కోర్సుకు డిమాండ్ బాగా ఉంది. మంచి జీతభత్యాలు ఉన్న ఉద్యోగంలో స్థిరపడాలని అనుకుంటున్నా. తప్పకుండా మెకానికల్ ఇంజినీర్గా ఉద్యోగం సాధించాలన్న లక్ష్యంతో చదువుకుంటున్న.
– జీ విగ్నేశ్, వరంగల్
ఇంజినీర్ కావడమే లక్ష్యం..
నేను సివిల్ ఇంఇనీరింగ్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నా. కళాశాలలో సౌకర్యాలు సంతృప్తికరంగా ఉన్నాయి. చదువుతోపాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉంటాయి. భవిష్యత్లో భవన నిర్మాణ రంగంలో స్థిరపడాలని అనుకుంటున్నా. సివిల్ ఇంజినీర్ కావడమే నా లక్ష్యం. అందుకు తగ్గట్లుగా ప్రిపేర్ అవుతున్నా. మంచి జీతం, మంచి ఉద్యోగం దొరికితే అందులోనే స్థిరపడాలని ఉంది. అందుకు నా ప్రయత్నం నేను చేస్తున్న.
– టీ అక్షయ, ఆదిలాబాద్