ఆదిలాబాద్లో రైల్వే వంతెన నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఆదిలాబాద్ పట్టణంలోని తాంసి బస్టాండ్ వద్ద నిర్మిస్తుండగా.. కేసీఆర్ సర్కారు ఇప్పటికే రూ.57.71 కోట్లు మంజూరు చేసింది. మాజీ మంత్రి జోగు రామన్న వంతెన నిర్మాణానికి ఎనలేని కృషి చేశారు. ఈ బ్రిడ్జితో ఆదిలాబాద్ పట్టణంలోని ఖుర్షిద్నగర్, సందరయ్యనగర్, గాంధీనగర్, తాటిగూడ, రణదేవనగర్, హమాలీవాడ, భాగ్యనగర్, క్రాంతినగర్, జై జవాన్నగర్ వాసులు.. తాంసి, తలమడుగు మండలవాసులకు సౌకర్యవంతంగా ఉంటుంది. పట్టణానికి వచ్చేవారికి, వ్యవసాయ ఉత్పత్తులను అమ్ముకోవడానికి మార్కెట్కు వచ్చేవారికి అనుకూలంగా ఉంటుంది. ఖర్చులు తప్పడంతోపాటు సమయం కూడా కలిసొస్తుందని వాహనదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
– ఆదిలాబాద్, డిసెంబర్ 18(నమస్తే తెలంగాణ)
ఆదిలాబాద్, డిసెంబర్ 18(నమస్తే తెలంగాణ) : ఆదిలాబాద్ పట్టణవాసులతోపాటు తాంసి, తలమడుగు మండలాల్లోని గ్రామాలకు చెందిన ప్రజలు ఆదిలాబాద్కు రావాలంటే రైల్వే ట్రాక్ దాటాలి. తాం సి బస్టాండ్తోపాటు స్పిన్నింగ్ మిల్ ప్రాంతంలో రైల్వేట్రాక్లు ఉండడంతో రైళ్లరాకపోకల సమయంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నా రు. పట్టణంలోని ఖుర్షిద్నగర్, సందరయ్యనగర్, గాంధీనగర్, తాటిగూడ రణదేవనగర్, హమాలీవాడ, భాగ్యనగర్, క్రాంతినగర్, జై జవాన్నగర్ ప్రాంతాల నుంచి వాహనదారులు రైళ్లువచ్చే సమయంలో గేట్లు మూసివేయడంతో అవస్థలు పడుతున్నారు.
ఆదిలాబాద్ మార్కె ట్ యార్డుకు రైతులు తమ పంటను అమ్ముకునేందుకు తాంసి బస్టాం డ్ వద్ద రైల్వే ట్రాక్ దాటాలి. ప్రస్తుతం పత్తి కొనుగోళ్లు జరుగుతుండడంతో రోజు వందలాది వాహనాల్లో రైతులు పత్తిని విక్రయించడానికి మార్కెట్కు తీసుకొస్తున్నారు. తాంసి బస్టాండ్ నుంచి మహారాష్ట్రకు వెళ్లే అంతర్రాష్ట్ర రహదారి ఉండడంతో ఈ ప్రాంతంలో వాహనాల రాకపోకలు అధికంగా ఉంటాయి. రైల్వే గేట్ పడడంతో వాహనాలు భారీ సంఖ్యలో నిలిచిపోయి ట్రాఫిక్ సమస్యలు తలెత్తున్నాయి. దీం తో రైల్వే వంతెన నిర్మాణం జరపాలని పట్టణవాసులు కోరుతున్నారు.
రైల్వే బ్రిడ్జి నిర్మించాలని పట్టణ ప్రజలు ఏళ్లుగా కోరుతున్నారు. మాజీ ఎమ్మెల్యే జోగు రామన్న వంతెన నిర్మాణానికి ప్రత్యేక శ్రద్ధ వహించారు. ప్రయోజనాలను వివరిస్తూ గత ప్రభుత్వానికి సూచనలు చేశారు. స్పందించిన కేసీఆర్ ప్రభుత్వం బ్రిడ్జి నిర్మాణానికి రూ.57.71 కోట్లు మంజూరు చేసింది. టెండర్ ప్రక్రియ పూర్తికాగా నాలుగు నెలల కిందట పనులు ప్రారంభమయ్యాయి. పిల్లర్ల పనులు వేగంగా జరుగుతున్నాయి. తాంసి బస్టాండ్ వద్ద రైల్వే అండర్ బ్రిడ్జి పట్టణ ప్రజలు వ్యవసాయ మార్కెట్ యార్డుకు పోయేందుకు సౌకర్యంగా ఉంది.
నిర్మాణం తర్వాత కింది నుంచి వాహనాల రాకపోకలు కొనసాగుతాయి. స్పిన్నింగ్ మిల్ ప్రాంతంలో రైల్వేపై వంతెన నిర్మిస్తారు. కలెక్టర్ చౌక్ నుంచి ఎల్ఐసీ కార్యాలయం నుంచి వాహనాలు తాంసి, తలమడుగు మండలాలతోపాటు పట్టణంలోని పలు కాలనీలు, మార్కెట్యార్డుకు పోవడానికి ఈ బ్రిడ్జి ఉపయోగపడుతుంది. కేసీఆర్ ప్రభుత్వం నిధులు మంజూరు చేసినందునా వంతెన నిర్మాణం జరుగుతుండటంపై ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.