నిర్మల్ అర్బన్, జనవరి 30 : రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు నిర్మల్ జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతా మాసోత్సవాలు ఈనెల 17వ తేదీన ప్రారంభం కాగా.. వచ్చే నెల 14 వరకు కొనసాగనున్నాయి. ఇందులో భాగంగా రోడ్డు ప్రమాదాలు పునరావృతం కాకుండా ఉండేందుకు వాహనదారులకు అవగాహన సదస్సులను నిర్వహించనున్నారు. నిర్మల్, ఖానాపూర్, భైంసా, ముథోల్ ప్రాంతాల్లోని డ్రైవర్స్కు నిబంధనలు, ప్రమాదాలు జరుగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించనున్నారు. గత ఐదేళ్లలో 1,259 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఇందులో 571 మంది మృతి చెందగా.. 1,313 మంది గాయపడ్డారు. గత శనివారం విద్యార్థులు, ఆటో డ్రైవర్లు, వాహనాల డీలర్లు స్థానిక ఎన్టీఆర్ మినీ స్టేడియం నుంచి ర్యాలీ నిర్వహించారు.
నిర్మల్ జిల్లా రవాణ శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న రోడ్డు భద్రతా మాసోత్సవాలను వాహనదారులు సద్వినియోగం చేసుకోవాలి. రోడ్డు భద్రతపై వాహనదారులకు ఫిబ్రవరి 14వ తేదీ వరకు అవగాహన కార్యక్రమాలను చేపడుతాం. ప్రతి వాహనదారుడు రోడ్డు నిబంధనలు పాటించి, ప్రమాదాల నివారణకు పాటు పడాలి.