ఆదిలాబాద్, మార్చి 12(నమస్తే తెలంగాణ) : ఆదిలాబాద్ పట్టణంలోని రైల్వే క్రాసింగ్ల వద్ద వాహనదారుల ఇబ్బందులను తొలగించడంతోపాటు ట్రాఫిక్ సమస్య నివారణకు చేపట్టిన రైల్వే ఓవర్ బ్రిడ్జి పనుల్లో జాప్యం కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రైల్వే ఓవర్ బ్రిడ్జి(ఆర్వోబీ) పనులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.97.20 కోట్ల అంచనాతో చేపట్టారు. ఇందులో రాష్ట్రం వాటా రూ.57.20 కోట్లు కాగా, కేంద్రం వాటా రూ.39.4 కోట్లుగా నిర్ణయించారు. వంతెన పొడువు 931.825 మీటర్లు కాగా మూడున్నర సంవత్సరాల కిందట పనులు ప్రారంభమయ్యాయి. రైల్వే ట్రాక్ భాగంలోని పనులను రైల్వేశాఖ, మిగత పనులను రోడ్లు అండ్ భవనాల శాఖ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. పనులు సకాలంలో పూర్తి చేయాల్సి ఉండగా.. ప్రజాప్రతినిధులు, అధికారుల నిర్లక్ష్యం ఫలితంగా తీవ్ర జాప్యం జరుగుతున్నది. దీంతో ప్రజలు, వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారు.
తాంసి బస్టాండ్ వద్ద రైల్వే కింద వంతెనను రూ.20 కోట్లతో నిర్మాణ పనుల చేపట్టాల్సి ఉండగా.. రెండు నెలల కిందట తాంసి బస్టాండ్ వద్ద గేటును అధికారులు మూసివేశారు. అప్పటి నుంచి పనులు చేపట్టకపోవడంతో ప్రజలు, రైతులు, వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారు. రైల్వే గేటు సమీపంలో మార్కెట్ యార్డు ఉండడంతో రైతులు పంటలు విక్రయించడానికి వస్తుంటారు. ప్రస్తుతం మార్కెట్ యార్డులో కందుల కొనుగోలు జరుగుతుండడంతో రైతులు ఆర్టీవో కార్యాలయం మీదుగా ఐదు కిలోమీటర్ల దూరం నుంచి వెళ్లాల్సి వస్తుంది. గేటుకు అవతలి పక్కన భాగ్యనగర్, తాటిగూడ, క్రాంతినగర్, ఇంద్రనగర్, గడియార్ మహేల, గాంధీనగర్, అమన్కాలనీతోపాటు ఇతర ప్రాంతాలున్నాయి.
మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాలతోపాటు తాంసి, భీంపూర్ మండలాలకు వెళ్లాల్సిన వాహనాలు ఇక్కడి నుంచి వెళ్లాల్సి వస్తున్నది. రెండు నెలలుగా గేటు మూసివేయడంతో ఎలాంటి పనులు జరగకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మార్కెట్కు, ఇతర పనుల కోసం రావాలంటే రెండు ఆటో ఛార్జీలు చెల్లించాల్సి వస్తుందని అంటున్నారు. తాంసి బస్టాండ్ ప్రాంతంలో రెండు వందలకు పైగా వ్యాపారులు ఉపాధి పొందుతారు. గేటు మూసివేసిన ఫలితంగా జనాలు రాకపోవడంతో వారి వ్యాపారులు నిలిచిపోయి ఉపాధి నష్టపోతున్నారు. పనులను ప్రారంభించాలని లేదా గేటును ఓపెన్ చేయాలని ప్రజాప్రతినిధులు, అధికారులను పలుమార్లు కోరినా ఫలితం లేదని ప్రజలు అంటున్నారు. రైల్వే గేటూ మూసివేత విషయంలో స్థానిక ప్రజాప్రతినిధులపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధి పనుల పేరిట ప్రజలను ఇబ్బందులు పెట్టవద్దని కోరుతున్నారు.