నిర్మల్ టౌన్, జనవరి 23 : గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ఎస్పీ ప్రవీణ్కుమార్, అదనపు కలెక్టర్ రాంబాబుతో కలిసి గణతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణపై జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మినీస్టేడియంలో వేడుకలను నిర్వహించనున్నట్లు తెలిపారు. మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరవుతున్నట్లు తెలిపారు. ఎన్టీఆర్ స్టేడియంలో పరేడ్ను సిద్ధం చేయాలని, అవసరమైన స్టాళ్లను ఏర్పాటు చేసుకోవాలని, పోలీసు భద్రత చర్యలను చేపట్టాలని సూచించారు.
జంతు సంరక్షణపై చైతన్యం చేయాలి…
అటవీశాఖ ఆధ్వర్యంలో జంతు సంక్షేమం, సంరక్షణపై ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించేలా ప్రజలను చైతన్యం చేయాలని కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ అన్నారు. పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్లో సమావేశం నిర్వహించారు. జంతు సంక్షేమం, ప్రాధాన్యతను వివరించి, అడవులను సంరక్షించుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ‘జంతు సంక్షేమం పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత’ అనే అంశంపై రూపొందించిన కరపత్రాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో అటవీశాఖ అధికారులు పాల్గొన్నారు.
‘కంటి వెలుగు’ లోపాలు సరిదిద్దుకోవాలి..
జిల్లాలో అమలు చేస్తున్న ‘కంటి వెలుగు’ శిబిరంలో లోపాలు లేకుండా ఆన్లైన్లో అన్ని వివరాలను పక్కాగా నమోదు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కంటి వెలుగు పథకంపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ నెల 19 నుంచి నిర్మల్ జిల్లాలో కంటి వెలుగు శిబిరాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. శిబిరాల్లో ఇప్పటివరకు పరీక్షలు చేసుకున్న వారి సంఖ్య, కళ్లద్దాల పంపిణీ, క్యాంపుల నిర్వహణ, క్యాంపుల వద్ద మౌలిక సదుపాయలు, ఆన్లైన్ డేటా, తదితర అంశాలపై వైద్య సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి ధన్రాజ్, వైద్యులు డాక్టర్ శ్రీనివాస్ పాల్గొన్నారు.