నర్సంపేట, ఆగస్టు 10 : తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి విగ్రహ నిర్మాణ గద్దె కూల్చివేత తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఇటీవల ‘పెద్ది’ గుండెపోటుతో మృతిచెందగా, ఆయన స్మారకార్థం వరంగల్ జిల్లా నర్సంపేట ప్రభుత్వ మెడికల్ కళాశాల ఎదుట ప్రైవేట్ స్థలంలో విగ్రహం ఏర్పాటుచేయగా, ఆదివారం అర్ధరాత్రి మున్సిపల్ అధికారులు సిబ్బందితో కూల్చివేయించారు. అధికారుల తీరుపై బీఆర్ఎస్ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. కూల్చివేతకు నిరసనగా నర్సంపేటలోని అంబేదర్ సెంటర్లోబీఆర్ఎస్ నల్లబ్యాడ్జీలతో ధర్నాకు దిగారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల బీఆర్ఎస్ ముఖ్యనాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో శ్రేణులు తరలివచ్చి నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. గద్దె కూల్చివేసిన ప్రదేశాన్ని సోమవారం మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ పరిశీలించి.. నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.

పెద్ది సుదర్శన్రెడ్డి జ్ఞాపకార్థం విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు నిర్మించిన గద్దెను మున్సిపల్ అధికారులు కూల్చివేయడం దుర్మార్గమని మాజీ మంత్రి దయాకర్రావు, మాజీ ఎంపీ వినోద్కుమార్ ధ్వజమెత్తారు. విగ్రహావిష్కరణను అడ్డుకోవడం వెనుక కాంగ్రెస్ నాయకుల కుట్ర దాగి ఉన్నదని విమర్శించారు. కాంగ్రెస్ ఎన్ని ఆటంకాలు సృష్టించినా కచ్చితంగా విగ్రహం ఆవిషరించి తీరుతామని చెప్పారు. అధికారుల నుంచి ఎలాంటి నోటీసులు లేకుండానే గద్దెను కూల్చివేయడం దారుణమని మండిపడ్డారు. నర్సంపేట పట్టణంలో ఎన్ని విగ్రహాలు అనుమతితో పెట్టారో అధికారులు ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
పెద్ది సుదర్శన్రెడ్డి దశదిన కార్యక్రమం సందర్భంగా భారీ సంతాప సభ ఉన్నందున తాతాలికంగా ఈ ధర్నాను విరమించుకున్నట్టు స్పష్టంచేశారు. మరో రెండు రోజుల సమయం ఇస్తున్నామని, ఆ లోపు గద్దెను కూల్చిన వారిని కఠినంగా శిక్షించకపోతే రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపడుతామని హెచ్చరించారు. అదే స్థలంలో పెద్ది విగ్రహం ఏర్పాటుచేయాలని, లేకుంటే న్యాయపరంగా ముందుకు వెళ్తామని తేల్చిచెప్పారు. అనంతరం పోలీసులు ఎర్రబెల్లిని అదుపులోకి తీసుకునేందుకు యత్నించగా బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకున్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు తక్కళ్లపల్లి రవీందర్రావు, ఆకుల శ్రీనివాస్, నల్లా మనోహర్రెడ్డి, రాయిడి రవీందర్రెడ్డి, డాక్టర్ లెక్కల విద్యాసాగర్రెడ్డి, నాగెల్లి వెంకటనారాయణగౌడ్, నామాల సత్యనారాయణ, శ్రీధర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నర్సంపేటలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడం రాజ్యాంగ విరుద్ధమని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ధ్వజమెత్తారు. పోలీసులు చట్టబద్ధంగా నడుచుకోవాలని హితవు పలికారు. అరెస్టు చేసిన వారిని బేషరతుగా విడుదల చేసి, సుదర్శన్రెడ్డి విగ్రహావిషరణకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
పెద్ది సుదర్శన్రెడ్డి విగ్రహాన్ని మున్సిపల్ అధికారులు అకారణంగా కూల్చివేయడం దారుణమని మెదక్ మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల శశిధర్రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి కూల్చివేసిన విగ్రహాన్ని ప్రభుత్వ ఖర్చులతోనే తిరిగి పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.
తీవ్ర ఉద్రిక్తతల నడుమ వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఆధ్వర్యంలో పెద్ది సుదర్శన్రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. కూల్చిన చోటే మళ్లీ గద్దె కట్టి విగ్రహాన్ని పెట్టారు. ఈ సందర్భంగా పెద్ది విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రజాసేవకుడు సుదర్శన్రెడ్డి స్మారకార్థం విగ్రహాన్ని నర్సంపేటలో ఏర్పాటు చేయడం అభినందనీయమని నరేందర్ పేర్కొన్నారు.