ములుగు, ఫిబ్రవరి,15 (నమస్తే తెలంగాణ) : వీరగడ్డ మేడారంలో ధైర్య పరాక్రమాలకు మారుపేరైన సమ్మక్క-సారలమ్మను తలుచుకుంటేనే ఒళ్లు పులకరిస్తుంది. రెండేళ్లకోసారి జరిగే ఈ తల్లుల జాతరలో ప్రతి ఘట్టం ఎంతో అత్యద్భుతంగా ఉంటుంది. మాఘశుద్ధ పౌర్ణమి రోజు సాయంత్రం కన్నెపల్లి నుంచి సారలమ్మ రాకతో మహాజాతర ప్రారంభమవుతుంది. మరునాడు సమ్మక్క రాక ఆద్యంతం ఉత్కంఠగా ఉంటుంది. మూడో రోజున భక్తుల మొక్కుల చెల్లింపులు, నాలుగో రోజున దేవతల వనప్రవేశం.. ఇలా ఆయా ఘట్టాలను చూడాలంటే రెండు కనులూ చాలవు.. ఆ నాలుగు రోజులు అటవీ ప్రాంతం మహానగరంగా మారుతుంది. ప్రపంచమంతా మేడారంవైపే ప్రణమిల్లుతుంది.
నేటి నుంచి 19 వరకు జారత బ్రహ్మాండంగా కొనసాగనున్నది. జాతరకు రెండు వారాల ముందే గిరిజన సంప్రదాయాల ప్రకారం పూజా కార్యక్రమాలు మొదలవుతాయి. రెండు వారాల ముందు గుడి మెలిగే (గుడులను శుభ్రం చేయడం), వారం ముందు మండ మెలిగే (తల్లుల గద్దెల ప్రాంతాల ఆవరణను శుద్ధి చేసి అలంకరించడం) పూర్తయింది. ఈ రెండు కార్యక్రమాలు తల్లుల వారంగా భావించే బుధవారాల్లోనే జరుగుతాయి. మండ మెలిగే మరుసటి రోజున గొర్రెను దేవతలకు బలిచ్చి పూజారులు(వడ్డెలు), గ్రామ పెద్దలు పండుగ చేస్తారు. ఇదే రోజున సమ్మక వారంగా భావించి భక్తులు తమ ఇళ్లను శుద్ధి చేసుకుంటారు.
గురువారం సాయంత్రం వేళ సమ్మక గద్దెపైకి వస్తుంది. ఆ రోజు ఉదయం ఆరు గంటల నుంచే కార్యక్రమం మొదలువుతుంది. మొదట వడ్డెలు మేడారానికి సమీపంలోని చిలుకలగుట్టకు వెళ్లి వనం (వెదురు కర్రలు) తెచ్చి గద్దెలపై పెట్టి ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం సమ్మక పూజా మందిరం నుంచి వడరాలు(పసిడి కుండలు) తెచ్చి గద్దెలపై నెలకొల్పుతారు. మళ్లీ చిలుకలగుట్టకు వెళ్తారు. మధ్యాహ్నం మూడు గంటల సమయంలో సమ్మకను గద్దెలపైకి తీసుకు వచ్చే ప్రక్రియ మొదలవుతుంది. చిలుకలగుట్టపై కుంకుమభరిణె రూపంలో ఉన్న సమ్మకను గద్దెపైకి తెచ్చేందుకు పూజారులు బయలుదేరుతారు. జాతర మొత్తానికి ప్రధానమైన ఘట్టం ఇదే. సమ్మక ఆగమనం కోసం లక్షలాదిమంది భక్తులు ఆసక్తిగా ఎదురుచూస్తారు. సమ్మక కొలువైన ప్రదేశానికి చేరుకున్న వడ్డెలు అకడ ప్రత్యేక పూజలు చేసి తల్లి రూపాన్ని చేతపట్టుకున్న మరుక్షణమే ప్రధాన వడ్డె తన్మయత్వంతో ఒక ఉదుటున పరుగులు తీస్తూ గుట్ట దిగుతాడు. వందల మంది పోలీసుల రక్షణ నడుమ.. శివసత్తుల పూనకాలతో భక్తి పారవశ్యం పొంగిపొర్లే తరుణాన సమ్మకను గద్దెలపైకి చేర్చుతారు. అప్పటి నుంచి తల్లీబిడ్డలను దర్శించుకునేందుకు లక్షలాది మంది భక్తులు బారులు తీరుతారు. మూడోరోజు శుక్రవారం తల్లులు అశేష భక్తజనానికి దర్శనమిస్తారు. భక్తులు మొక్కులు సమర్పించి తిరుగుబాట పడుతారు. నాలుగోరోజు సమ్మకను చిలుకలగుట్టకు, సారలమ్మను కన్నెపల్లికి, గోవిందరాజును కొండాయికి, పగిడిద్దరాజును పూనుగొండ్లకు చేర్చడంతో జాతర ముగుస్తుంది.
ములుగు రూరల్, ఫిబ్రవరి 15 : రాష్ట్ర నలుమూలల నుంచీ మేడారానికి వచ్చే భక్తులు పనిలో పనిగా ఈ దారుల్లో ఉన్న పర్యాటక, చారిత్రక ప్రదేశాలను చూసి మధురానుభూతి పొందవచ్చు. హైదరాబాద్ నుంచి వచ్చేవారు భువనగిరి సమీపంలో యాదాద్రి లక్ష్మీ నర్సింహస్వామి ఆలయాన్ని సందర్శించవచ్చు. ఇదే దారిలో 500ఫీట్ల ఎత్తయిన కొండపై భువనగిరి ఖిల్లా ఆకర్షణీయంగా ఉంటుంది. 40 ఎకరాల్లో విస్తరించిన శిలపై పశ్చిమ చాళుక్య రాజు త్రిభువనమల్ల విక్రమాదిత్యుడు దీనిని నిర్మించాడు. ఆలేరు నుంచి ఆరు కిలోమీటర్ల దూరంలో కొలనుపాక జైన దేవాలయం ఉన్నది. జనగామ నుంచి హనుమకొండకు చేరగానే మడికొండలో మెట్టు రామలింగేశ్వర స్వామి ఆలయం ఉంటుంది. సహజసిద్ధంగా ఏర్పడిన నిటారు కొండలపై కొలువైన ఈ ఆలయం నుంచి ప్రకృతి, నగర అందాలు కనువిందు చేస్తాయి. హనుమకొండ బస్ స్టేషన్ సమీపంలో కొండలపై పద్మాక్షి ఆలయం ఉన్నది. కాకతీయుల నిర్మాణశైలికి అద్దం పట్టే కట్టడాల్లో ఒకటైన వేయి స్తంభాల దేవాలయం హనుమకొండ నడిబొడ్డునే ఉంటుంది. వరంగల్ భద్రకాళీ ఆలయం, ఓరుగల్లు కోట అందాలను వీక్షించడం గొప్ప అనుభూతి. కాకతీయుల ఖ్యాతిని ప్రపంచానికి చాటిన రామప్ప రుద్రేశ్వరాలయం, ప్రకృతి ప్రసాదించిన లక్నవరం సరస్సు, మేడారంలో గిరిజన మ్యూజియం, తాడ్వాయి మండలంలోని వనకుటీరాలు, మంగపేట మండలంలోని మల్లూరు హేమాచల లక్ష్మీనర్సింహస్వామి ఆలయం పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి.
ములుగు, ఫిబ్రవరి 15 (నమస్తే తెలంగాణ) : అక్కడ గుడులు.. గోపురాలుండవు.. వేదమంత్రాల ఘోష వినిపించదు.. దేవతలకు హారతిపట్టడం కనిపించదు.. అర్చనలు, అభిషేకాలు అసలే ఉండవు. కేవలం గద్దెలనే సింహాసనాలుగా.. చెట్టుకొమ్మలనే స్వరూపాలుగా.. పసుపు, కుంకుమలనే ప్రతిరూపాలుగా చేసుకొని వనవాసీలే కాదు.. పేద, ధనిక తేడాలేకుండా కొలిచే సమ్మక్క-సారలమ్మ సమతా ప్రతీకలుగా నిలుస్తున్నారు. ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరైన మేడారానికి కోట్లాది మంది పోటెత్తి మొక్కులు చెల్లిస్తారు. వందల ఏళ్లుగా ఇక్కడ కొనసాగుతున్న గిరిజన పూజా విధానంలో ఎత్తు బంగారమే ( బెల్లం) అమ్మవార్లకు నైవేద్యంగా సమర్పిస్తున్నారు. జాతరకు రెండు నెలల ముందు నుంచే భక్తులు అమ్మవార్ల దర్శనానికి బారులు తీరుతారు. కుల, మత భేదం లేకుండా ప్రతి ఒకరూ ఇకడికి వస్తారు. దేవతలను దర్శించుకొని ఆనందంగా గడిపి తిరుగు ప్రయాణమవుతారు. లక్షలాది మంది ఒకేసారి మేడారం చేరుకోవడంతో ఇకడి అటవీ ప్రాంతాలు జనవనాన్ని తలపిస్తాయి. గద్దెల వద్ద శాస్ర్తోక్తమైన పూజా విధానం కాకుండా గిరిజనుల సంప్రదాయం ప్రకారం పూజలుంటాయి. గిరిజన భక్తులే కాకుండా గిరిజనేతరులు లక్షల్లో ఇక్కడికి వస్తుంటారు. కోరిన కోరికలు తీర్చితే ఎత్తుబంగారం ఇస్తామని మొక్కుకుంటారు. తీరినవారు మొక్కులు చెల్లించుకుంటారు. కుటుంబమంతా రావడం వీలు కాని వారు ఇంటికి ఒక్కరైనా వచ్చి ఇక్కడ కొంత బెల్లం సమర్పించి వెళ్తారు.
సమ్మక-సారలమ్మలకు అప్పజెప్పేందుకు గిరిజనేతర భక్తులు తమ ఇళ్ల నుంచే ఒడి బియ్యాన్ని నడుముకు కట్టుకొని జాతరకు వస్తారు. ఒడివాల బియ్యం సమ్మకకు ప్రీతిపాత్రమైనదని భావిస్తారు. కొత్త బట్టలో బియ్యం పోసి వాటితోపాటు రెండు కుడుకలు, రెండు రవిక ముకలు, రెండు వకలు, ఖర్జూరాలు, పసుపు, కుంకుమ వేసి ముడి బిగించి నడుముకు కట్టుకొని జాతరకు బయలుదేరుతారు. మొక్కుకున్నవారు ఎత్తుబెల్లం, చీరె, గాజులు, పూలు, ఇతర కానుకలు తెస్తారు. మేడారం చేరుకొని గద్దెల వద్ద రవిక ముక్కలు ఉంచి తల్లులకు ఒడిబియ్యం పోస్తారు. కొంత బియ్యాన్ని ఇంటికి తీసుకొచ్చి మిగిలిన బియ్యంలో కలిపి భోజనం వండి కుటుంబ సభ్యులకు ప్రసాదంలా పెడుతారు. ఈ సందర్భంలో సమ్మక తమ ఇంటికి వచ్చిందని భావిస్తారు.
గంగారం, ఫిబ్రవరి 15 : మహాజాతరలో మొక్కులందుకునేందుకు సమ్మక్క భర్త పగిడిద్దరాజు (పడిగె రూపంలో) మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పునుగొండ్ల నుంచి మేడారానికి బైలెల్లిండు. మూడు రోజులుగా ఉపవాసాలు, ప్రత్యేక పూజలతో పెనక వంశీయులు పగిడిద్దరాజును పెండ్లి కొడుకుగా ముస్తాబు చేసి మంగళవారం సాగనంపారు. ముందుగా పూజారి పెనక వెంకటయ్య ఇంట్లో పూజలు చేసి డప్పు వాయిద్యాల నడుమ శివసత్తులు న్యత్యాలు చేసుకుంటూ తీసుకెళ్లగా భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. బుధవారం సాయంత్రం 6 గంటల వరకు మేడారం పగిడిద్దరాజు చేరుకోనున్నాడు.
కన్నెపల్లి నుంచి సారలమ్మ బుధవారం సాయంత్రం మేడారంలో గద్ద్దెకు చేరుతుంది. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో కన్నెపల్లి నుంచి సారలమ్మ వడ్డెలు మేడారంలోని గద్దెలకు వచ్చి అకడ ముగ్గులు వేసి మళ్లీ కన్నెపల్లిలోని మందిరానికి చేరుకుంటారు. అకడ రెండు గంటల పాటు గోప్యంగా పూజలు చేసి సారలమ్మకు తీసుకువస్తారు. కడుపు పండాలని కోరుకునేవారు, దీర్ఘకాలిక రుగ్మతలతో బాధపడుతున్న వేలాది మంది భక్తులు తడి బట్టలతో గుడి ఎదుట సాష్టాంగ నమసారాలతో వరం పడతారు. దేవత రూపాన్ని చేతపట్టుకుని గుడి బయటకు వచ్చిన పూజారులు వరం పడుతున్న వారి పైనుంచి నడిచి వెళ్తారు. ఇదేరోజు సారలమ్మ రాకకు మునుపే ఏటూరునాగారం మండలం కొండాయి నుంచి గోవిందరాజును, కొత్తగూడ మండలం పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజును అటవీమార్గం మీదుగా కాలినడకన మేడారానికి తీసుకొచ్చి గద్దెలపై ప్రతిష్ఠిస్తారు.