మంచిర్యాల ఏసీసీ, ఏప్రిల్ 4: మహిళలు, యువతులు ఎలాంటి సమస్యలున్నా నిర్భయంగా పోలీసులను సంప్రదించవచ్చునని, మహిళల రక్షణ కోసమే షీ టీంలు పనిచేస్తున్నాయని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం. శ్రీనివాస్ తెలిపారు. గురువారం రామగుండం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సీపీ కాఫీ విత్ షీ టీం మెంబర్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మహిళలు, చిన్న పిల్లల రక్షణ విషయంలో రామగుండం కమిషనరేట్ పోలీస్ శాఖ పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. మహిళలను, విద్యార్థినులను వేధిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
డయల్ 100, షీ టీం వాట్సప్ నంబర్ 6303923700లో ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ వేదికల మీదుగా కూడా ఫిర్యాదు చేస్తే వెంటనే చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ యేడాది 205 అవగాహన సదస్సులు, 690 హాట్ స్పాట్స్ విజిట్ నిర్వహించామన్నారు. 10వ తరగతి, ఇంటర్ పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థినులను ఇబ్బందులకు గురిచేస్తున్న 22 మందిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నామని, వారి వద్ద 10 బైక్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఇందులో 13 మంది మైనర్లు ఉండగా, వారి తల్లితండ్రులను పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించామని పేర్కొన్నారు. అనంతరం షీ టీం సభ్యులను అభినందించి ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలోమంచిర్యాల షీ టీం ఎస్ఐ హైమా, సభ్యులు పాల్గొన్నారు.
మంచిర్యాల ఏసీసీ, ఏప్రిల్ 4 : జిల్లాలో ఫైర్ సేఫ్టీ తనిఖీలు ఎప్పటికప్పుడు తప్పనిసరిగా నిర్వహించాలని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం. శ్రీనివాస్ ఆదేశించారు. గురువారం రామగుండం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో మంచిర్యాల జిల్లా పరిధిలోని ఫైర్ శాఖ అధికారులు, సింగరేణి, ఏన్టీపీసీ, ఆర్ఎఫ్సీఎల్, వివిధ పరిశ్రమల ఫైర్ సేఫ్టీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అగ్ని జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు.
ఆయన మాట్లాడుతూ అగ్ని ప్రమాదంపై సమాచారం తెలిసిన వెంటనే పరిధితో సంబంధం లేకుండా సిబ్బంది స్పందించాలన్నారు. భారీ భవనాలు, వ్యాపార, వాణిజ్య సముదాయాలు, హాస్పిటళ్లు, పాఠశాలలు, అపార్ట్మెంట్లలో తనిఖీలు చేయాలని సూచించారు. అపార్ట్మెంట్లలో, ఇండ్లలో ఉన్న స్థలాలకు అనుగుణంగా ఫైర్ రెసిస్టెన్స్ పరికరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. నిబంధనలు పాటించని వ్యాపార, వాణిజ్య సంస్థలపై ప్రత్యేక చర్యలు తీసుకొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. మంచిర్యాల జిల్లా ఫైర్ ఆఫీసర్ అజయ్కుమార్, స్టేషన్ ఫైర్ ఆఫీసర్ దేవేందర్, బెల్లంపల్లి ఫైర్ స్టేషన్ ఆఫీసర్ అనిల్ కుమార్, జైపూర్ ఎస్టీపీపీ ఆఫీసర్లు సురేశ్, రమేశ్కుమార్, శ్రవణ్కుమార్ పాల్గొన్నారు.