గర్మిళ్ల, మార్చి 10 : రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పోలీస్ స్టేషన్లలో పెండింగ్ కేసుల పరిష్కారానికి కృషి చేయాలని అధికారులను రామగుండం పోలీస్ కమిషనర్ రెమా రాజేశ్వరి ఆదేశించారు.శుక్రవారం ఎన్టీపీసీలోని మిలీనియం హాల్లో పెద్దపల్లి జోన్, మంచిర్యాల జోన్లోని డీసీపీలు, ఏసీపీలు, ఇన్స్పెక్టర్లతో నేర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పీపుల్స్ ఫ్రెండ్లీ పోలీసింగ్లో భాగంగా పోలీస్ స్టేషన్లకు వచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించడంతో పాటు, చట్టపరమైన, న్యాయపరమైన ఫిర్యాదులపై అధికారులు కేసులు నమోదు చేస్తేనే పోలీసులపై నమ్మకం కలుగుతుందన్నారు. పెద్దపల్లి జోన్, మంచిర్యాల జోన్ల పరిధిలో ఉన్న కళాశాలల, పాఠశాలల లిస్టు తయారు చేయాలన్నారు.
సైబర్ క్రైమ్స్, ఉమెన్ సేఫ్టీ, విద్యార్థిని, విద్యార్థులకు యుక్త వయస్సులో తాత్కాలిక ఆనందాల కోసం ఆకర్షణ, ప్రలోభాలకు గురై భవిష్యత్ను నాశనం చేసుకోవద్దని అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని డీసీపీలను ఆదేశించారు. వేసవి కాలంలో పిల్లలకు స్కూళ్లు, కాలేజీలకు సెలవులు రావడంతో ప్రజలు దైవ దర్శనాలు, విహార యాత్రలు, బంధువుల ఊళ్లకు వెళ్తారని తెలిపారు. ఈ సమయంలో నేరాలు జరిగే అవకాశం ఉంటుందని, వీటి నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు. పాత నేరస్తులందరిపై నిఘా పెట్టాలన్నారు. శాంతి భద్రతల అంశాలపై, దొంగతనాలకు పాల్పడిన నేరస్తులను గుర్తించడంతోపాటు, నాన్ బెయిల్ వారెంట్లు, సైబర్క్రైమ్ నిందితులను పట్టుకోవడం కోసం లా అండ్ ఆర్డర్, సీసీఎస్ పోలీసులతో సమన్వయ పరుచుకుంటూ నిందితులను పట్టుకోవాలన్నారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్ప డే వ్యక్తులపై కఠినంగా వ్యవహరించాలన్నారు. 5ఎస్ అమలులో భాగంగా పోలీస్ స్టేషన్ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో పెద్దపల్లి జోన్, మంచిర్యాల జోన్ల పరిధిలోని డీసీపీలు, ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు, పోలీస్ అధికారులు, తదితరులున్నారు.