ఖానాపూర్ రూరల్, మే 22 : ఆదివాసుల అభ్యున్నతికి తెలంగాణ సర్కారు కృషిచేస్తున్నదని, అందుకు అనేక సంక్షేమ పథకాలను పకడ్బందీగా అమలుచేస్తున్నదని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అనారు. మండలంలోని అడవిసారంగాపూర్ పంచాయతీ పరిధిలోని రాజులమడుగు గ్రామంలో ఐటీడీఏ ద్వారా ఆదివాసుల కోసం నిర్మించిన 15 ఇండ్లను ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్, నిర్మల్ కలెక్టర్ వరుణ్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. విద్య, వైద్య, వ్యవసాయ, ఉద్యోగ, ఉపాధి, వంటి అన్ని రంగాల్లో మెరుగైన సేవలు అందించి అదివాసులను ప్రగతి బాటలో నిలుపాలన్నదే తమ ధ్యేయమన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రధానంగా భూ సమస్యలు అధికంగా ఉన్నాయని, వాటిని విడుతల వారీగా పరిష్కరించే దిశగా చర్యలు చేపడుతున్నామని చెప్పారు.
అవినీతి రహితంగా రైతులకు న్యాయం చేకూర్చే లక్ష్యంతో ప్రభుత్వ నూతన రెవెన్యూ చట్టం అమలులోకి తీసుకొచ్చిందన్నారు. అనంతరం ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ మాట్లాడుతూ.. అదివాసీ బిడ్డలు చదువులో రాణించి ఐఏఎస్, ఐపీఎస్ వంటి ఉన్నత పోస్టులు సాదించేలా తమ వంతు ప్రోత్సాహం కల్పిస్తామని స్పష్టం చేశారు. గ్రామంలో 15 ఇండ్ల నిర్మాణాన్ని సుమారు రూలు 45 లక్షలతో మంజూరు చేసి, పనులను పూర్తి చేశామన్నారు. అనంతరం మంత్రి ఇంట్లో పనిచేసే సీతారాం పెండ్లికి హాజరై, నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ గంగాధర్, మున్సిపల్ చైర్మన్ అంకం రాజేందర్, ఏఎంసీ మాజీ చైర్మన్ పుప్పాల శంకర్, ఎంపీపీ మోహిద్, నాయకులు రాంకిషన్, తూము చరణ్, కొక్కుల ప్రదీప్, రాము నాయక్, మడావి లింగు, ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
ఆలయాల నిర్మాణానికి ప్రాధాన్యం..
మామడ, మే 22 : రాష్ట్ర సర్కారు ఆలయాల నిర్మాణానికి ప్రాధాన్యమిస్తున్నదని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. మండలంలోని కప్పన్పెల్లి గ్రామంలో రూ.10 లక్షలతో నిర్మించిన హనుమాన్ ఆలయం, రూ.10 లక్షలతో నిర్మించిన జనరల్ కమ్యూనిటీ హాల్ను ఆయన ప్రారంభించారు. ఆధ్యాత్మిక చింతనతో మనసుకు ప్రశాంతత చేకూరుతున్నదన్నారు. ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ పథకాలు ఇక్కడ అమలవుతున్నాయని పేర్కొన్నారు. రైతు బీమా, రైతు బంధు, ఉచిత విద్యుత్తో రైతులకు ప్రభుత్వం అండగా నిలుస్తున్నదని తెలిపారు. అనంతరం హనుమాన్ దీక్షాపరులు మంత్రిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సుంచు బాపులక్ష్మి, జడ్పీ చైర్పర్సన్ విజయలక్ష్మీరాంకిషన్రెడ్డి, వైస్ ఎంపీపీ లింగారెడ్డి, బీఆర్ఎస్ పార్టీ యువ నాయకుడు, మంత్రి తనయుడు గౌతంరెడ్డి, బీఆర్ఎస్ మండల కన్వీనర్ చంద్రశేఖర్గౌడ్, రైతు బంధు సమితి మండల కన్వీనర్ గంగారెడ్డి, నాయకులు భూషణ్రెడ్డి, సురేందర్రెడ్డి, కృష్ణారెడ్డి, రాందాస్, సుభాష్రావు, సాయిరాంరెడ్డి, వికాస్రెడ్డి, నల్ల లింగారెడ్డి, ముత్యంరెడ్డి, భూమన్న, శశికాంత్రెడ్డి, అశోక్ తదితరులున్నారు.