ఎదులాపురం, నవంబర్ 26 : తాను ఐటీ అధికారినంటూ నమ్మించి దాడిచేసి ఓ వ్యాపారి నుంచి సొమ్ము తీసుకుని ఉడాయించాడు. ఈ కేసులో పోలీసులు వేగంగా స్పందించారు. నిందితుడిని అరెస్ట్చేసి సొమ్ము రికవరీ చేశారు. మావల పోలీస్ స్టేషన్లో ఎస్పీ ఉదయ్కుమార్రెడ్డి శనివారం విలేకరుల సమావేశం ఏర్పాటుచేసి, వివరాలు వెల్లడించారు. ఉట్నూర్ మండలం యందా గ్రామానికి చెందిన శివకరణ్ కాగ్నే పంజాబ్ రాష్ట్రంలోని జలంధర్లో ఎల్పీ యూనివర్సిటీలో సైబర్ సెక్యూరిటీ బీటెక్ చేస్తున్న క్రమంలో జల్సాలకు అలవాటుపడ్డాడు.
ఈయన ఒకసారి ఆదిలాబాద్లోని వరసిద్ధి బట్టలదుకాణంలో షాపింగ్కు వచ్చాడు. ఈ క్రమంలో షాపు యజమాని వివరాలు ఆన్లైన్ ద్వారా తీసుకున్నాడు. గత నెల 16న తాను జీఎస్టీ, ఏటీఎస్, ఐటీ అధికారినని ఫోన్లో యజమానికి చెప్పాడు. దీంతో శివకరణ్ జిల్లాకేంద్రంలోని ఒక లాడ్జిలో రూమ్ తీసుకున్నాడు. సదరు యజమానిని లాడ్జికి పిలిపించాడు. సుత్తితో తలపై కొట్టి తాడుతో చేతులు, కాళ్లు కట్టేసి భయభ్రాంతులకు గురిచేశాడు. ఆ తర్వాత అదే నెల 31న ఈ యజమానికి మళ్లీ ఫోన్చేసి కుటుంబ సభ్యులను చంపుతానని బెదిరించాడు.
రూ.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. భయపడిన యజమాని శివకరణ్కు వెంటనే డబ్బులు సర్దుబాటు చేశాడు. దీంతో సదరు యువకుడు ఆ డ బ్బులు తీసుకొని పరారయ్యాడు. భయపడిన ఈ వ్యాపారి ఈ నెల 1న మావల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు విచారణ చేపట్టిన పోలీసులు.. సాంకేతిక పరిజ్ఞానం, సీసీ ఫుటేజీల ఆధారంగా గాలింపు చేపట్టారు. డీఎస్పీ ఉమేందర్ పర్యవేక్షలో సీసీఎస్, రూరల్ సీఐలతో ప్రత్యేక టీం ఏర్పాటు చేశారు. పంజాబ్ రాష్ట్రం జలంధర్లో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి రూ.3.35 లక్షలు, తాడు, సుత్తి, కత్తి, సిమ్కార్డులు, యాపిల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. డీఎస్పీ వీ ఉమేందర్, రూరల్ సీఐ రఘుపతి, ఎస్ఐ విష్ణువర్ధన్ పాల్గొన్నారు.