గ్యాస్ ధరల పెంపుపై రెండోరోజు శుక్రవారం కూడా నిరసనలు కొనసాగాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఖాళీ సిలిండర్లు, కట్టెల పొయ్యిలతో నిరసన వ్యక్తం చేశారు. రోడ్లపైనే వంటావార్పు చేసుకొని భోజనాలు చేశారు. కేంద్రం, మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో పాటు దిష్టిబొమ్మలు దహనం చేశారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని, కేంద్రం తీరుపై మండిపడ్డారు. ఆయా చోట్ల ఎమ్మెల్యేలు జోగురామన్న, రేఖానాయక్, రాథోడ్ బాపురావ్, కోనేరు కోనప్ప, దివాకర్రావు, దుర్గం చిన్నయ్య, ఐడీసీ చైర్మన్ వేణుగోపాలా చారి, జడ్పీ చైర్మన్లు రాథోడ్ బాపురావ్, కోవ లక్ష్మి పాల్గొన్నారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు తీరును ఎండగట్టారు. ధరలు తగ్గిస్తామని అధికారంలోకి వచ్చి, పేదల కడుపుకొట్టి, కార్పొరేట్లకు దోచిపెడుతున్నదని విమర్శించారు.
ఆదిలాబాద్/నిర్మల్,మార్చి 3 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ ధరల పెంపుపై ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా శుక్రవారం నిరసనలు వెల్లువెత్తాయి. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన మహాధర్నాల్లో ప్రజలు, శ్రేణులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని నినాదాలతో హోరెత్తించారు. ఖాళీ సిలిండర్లు, ప్లకార్డులు ప్రదర్శిస్తూ.. కట్టెల పొయ్యిలపై వంటావార్పు నిర్వహించారు. ఆదిలాబాద్ పట్టణంలోని తెలంగాణచౌక్లో నిర్వహించిన ఆందోళనలో ఎమ్మెల్యే జోగు రామన్న, మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్, వైస్ చైర్మన్ జహీర్ రంజానీ, మహిళలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. ఎమ్మెల్యేతో పాటు నాయకులు కట్టెలపొయ్యిలపై వంటలు చేశారు. ఖాళీ సిలిండర్తో నిరసన తెలిపారు. ఎమ్మెల్యే జోగు రామన్న మాట్లాడుతూ కేంద్రంలోని మోదీ ప్రభుత్వ పాలనలో పేదలు, మధ్యతరగతి ప్రజలపై ఆర్థిక భారం పెరుగుతున్నదన్నారు. 2014లో రూ.410 ఉన్న సిలిండర్ ధర ఇప్పుడు రూ.1180కి చేరిందన్నారు. పెట్రోల్ లీటర్కు రూ.70 ఉండగా ఇప్పుడు రూ.112, డీజిల్ రూ.50 ఉండగా ప్రస్తుతం రూ. 98కి చేరిందని గుర్తు చేశారు. గుడిహత్నూర్ మండలంలోని జాతీయ రహదారిపై నిర్వహించిన ధర్నాలో ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ పాల్గొన్నారు. ధర్నాలో టీఆర్ఎస్ పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు అలాల్ అజయ్, అశ్రఫ్, మహిళా నాయకులు స్వరూపారాణి, బొడగం మమత, కస్తాల ప్రేమల, నాయకులు బండారి సతీశ్, వేణు, అశోక్ స్వామి, మెట్టు ప్రహ్లాద్ తదితరులు పాల్గొన్నారు. నార్నూర్లో జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ పాల్గొన్నారు. కట్టెలమోపుతో వచ్చి ఆయన నిరసన తెలిపారు. ఉట్నూర్, తాంసి, జైనథ్, నేరడిగొండ, ఇచ్చోడ, ఇంద్రవెల్లి మండలాల్లో గ్యాస్ ధరలను వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేపట్టారు.
నిర్మల్ జిల్లాలో..
రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు నిర్మల్ జిల్లాలో శుక్రవారం అన్ని మండల కేంద్రాల్లో బీఆర్ఎస్ నాయకులు ధర్నా, రాస్తారోకో చేశారు. కొన్ని చోట్ల వామపక్ష పార్టీల నాయకులు ఆందోళనకు దిగారు. స్థానిక ప్రజలతో పాటు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ, ప్రధాని దిష్టిబొమ్మలను దహనం చేశారు. మహిళలు ఖాళీ సిలిండర్లతో బైఠాయించారు. రోడ్లపైనే కట్టెల పొయ్యిని వెలిగించి తమ నిరసన తెలియజేశారు. ఖానాపూర్ పట్టణంలోని తెలంగాణ చౌక్లో జరిగిన ధర్నాలో ఎమ్మెల్యే రేఖానాయక్ పాల్గొన్నారు. పేదల నడ్డి విరిచేలా రోజురోజుకూ నిత్యావసర ధరలను పెంచుతూ పోతున్న కేంద్రంపై విరుచుకుపడ్డారు. కడెం మండల కేంద్రంలో సీపీఐ నాయకులు కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ రాస్తారోకో చేశారు. సోన్ మండల కేంద్రంలో జరిగిన నిరసనలో స్థానిక నాయకులు మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. సారంగాపూర్, లక్ష్మణచాంద, మామడ, నర్సాపూర్(జి), కుంటాల, బాసర, దస్తురాబాద్ మండల కేంద్రాల్లో నిరసనలు హోరెత్తాయి.
పేదలు బతికేటట్లు లేదు..
కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వస్తువుల ధరలు బాగా పెరిగిపోయాయి. తొమ్మిదేళ్లలో పెరిగినంత నిత్యావసరాలు, వంటగ్యాస్, ఇతర వస్తువుల ధరలు ఎప్పుడూ పెరగలేదు. ప్రస్తుత పరిస్థితి చూస్తే పేదలు బతికేటట్లు లేదు. దుకాణంలో ఏ వస్తువు కొందామన్న ధరలను చూసి భయమవుతున్నది. ధరలు తగ్గిస్తామని అధికారంలోకి వచ్చిన మోదీ, సామాన్యులను ఇబ్బంది పెట్టుడే పనిగా పెట్టుకున్నడు. పెంచిన సిలిండర్ ధరను వెంటనే తగ్గించాలి.
– బొడగం మమత, ఆదిలాబాద్
ఏం కొనేటట్లు లేదు..
ప్రధాని నరేంద్రమోదీ తొమ్మిదేళ్ల పాలనలో పెరుగుతున్న ధరలతో పేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నరు. ఉప్పు దగ్గర నుంచి సిలిండర్ వరకు ఏ వస్తువు కొందామన్నా ధరలు భగ్గుమంటున్నయి. 2014లో ఉన్న నిత్యావసర వస్తువుల ధరలు ఇప్పడు రెండింతలయ్యాయి. సిలిండర్ ధర మూడింతలు పెరిగింది. రోజురోజుకూ ధరలు పెంచుతున్న బీజేపీ ప్రభుత్వం పేదల కడుపు కొడుతున్నది. వచ్చే ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వానికి గుణపాఠం ఖాయం. – స్వరూపారాణి, ఆదిలాబాద్