కాగజ్నగర్, మార్చి 27: కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్నగర్ మున్సిపాలిటీ పన్నుల వసూలులో లక్ష్యం చేరుకోవడం కష్టంగానే కనిపిస్తున్నది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆస్తి పన్ను 58.52 శాతం మాత్రమే వసూలు చేశారు. ఈ ఆర్థిక సంవత్సరం ముగియడానికి నాలుగు రోజులు మాత్రమే మిగిలి ఉండడంతో పూర్తి స్థాయిలో పన్నులు వసూలవడం కష్టంగానే కనిపిస్తున్నది. రోజూ రూ. 30 లక్షలకు పైగా వసూలు చేస్తే తప్ప, వంద శాతం చేరుకోవడం అ సాధ్యం.
కాగజ్నగర్ మున్సిపాలిటీ పరిధిలో 30 వార్డు లు ఉండగా, 15 వేల నివాసాలు ఉన్నాయి. పట్టణంలో 7 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి జనవరి నుంచి స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. సకాలంలో పన్నులు చెల్లించని వారికి రెడ్ నోటీసులు జారీ చేయడంతో పాటు సామగ్రి జప్తు చేస్తామని హెచ్చరిస్తున్నారు. కాగజ్నగర్ మున్సిపాలిటీ ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో కొట్టు మిట్టాడుతుంటే, పన్నులు వసూలు కాకపోవడం మరింత ఇబ్బందుల్లోకి నెడుతున్నది.
కాగజ్నగర్ మున్సిపాలిటీ పరిధిలో రూ.3.66 కోట్లు ఆస్తి పన్ను వసూలు లక్ష్యంగా ఉంది. ఇందు లో ఈ నెల 26 వరకు రూ.2.14 కోట్లు వసూలు చేయగా, రూ.1.52 కోట్ల బకాయిలు ఉన్నాయి. ఆస్తి పన్ను వడ్డీపై 90 శాతం రాయితీ కల్పించినప్పటికీ వంద శాతం లక్ష్యం చేరుకోవడం అసాధ్యంగానే కనిపిస్తున్నది.
కాగజ్నగర్ మున్సిపాలిటీ పరిధిలో 150 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు మూడు నెలలుగా వేతనాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. వాటర్ సప్లయ్, విద్యుత్ సరఫరా, శానిటేషన్, బిల్ కలెక్టర్, తదితర విభాగాల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పట్టణ ప్రగతి నిధులు రావడంతో, అందులోంచి వేతనాలు చెల్లించారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడంతో జీతాలు చెల్లించలేని దుస్థితిలో కాగజ్నగర్ మున్సిపాలిటీ ఉంది.
ప్రజలు సకాలంలో పన్నులు చెల్లించి మున్సిపాలిటీ అభివృద్ధికి సహకరించాలి. ఇప్పటికే పట్టణంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాం. మున్సిపాలిటీ పరిధిలోని 30 వార్డుల్లో 7 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి పన్నుల వసూలు చేపడుతున్నాం. ఆస్తి పన్ను వసూలు లక్ష్య ం చేరుకునేందుకు కృషి చేస్తున్నాం.
-అంజయ్య, మున్సిపల్ కమిషనర్, కాగజ్నగర్