Varanasi : యూపీ, వారణాసిలోని ఒక పాఠశాలలో దారుణం జరిగింది. క్లాస్రూమ్లోనే ఒక విద్యార్థి, దుస్తుల్లోనే మూత్రం పోయడంతో ఆగ్రహం చెందిన టీచర్.. ఆ బాలుడి మర్మాంగంపై వాతలు పెట్టారు. ఈ ఘటన ఈ నెల 24న వారణాసిలోని ఒక ప్రైవేటు స్కూల్లో జరిగింది. దీనిపై బాధిత విద్యార్థి కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రైవేటు పాఠశాలలో ఐదేళ్ల బాలుడు నర్సరీ చదువుతున్నాడు.
అతడికి ఈ నెల 24న మూత్రం రావడంతో వాష్ రూమ్కు వెళ్తానని టీచర్ను అడిగాడు. కానీ, బాలుడు వాష్ రూమ్కు వెళ్లేందుకు టీచర్ నిరాకరించాడు. దీంతో కొద్దిసేపటి తర్వాత చిన్నారి బాలుడు దుస్తుల్లోనే, క్లాస్ రూమ్లో మూత్రం పోసుకున్నాడు. దీనిపై ఆగ్రహం చెందిన టీచర్.. ఆ బాలుడిని ప్రత్యేక గదికి తీసుకెళ్లి, ఒక చిన్న కత్తిని వేడి చేసి, బాలుడి మర్మాంగాలపై వాతలు పెట్టారు. దీంతో బాలుడికి గాయాలయ్యాయి. ఈ విషయం తెలిసిన బాలుడి తండ్రి టీచర్పై, స్కూల్ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. స్థానిక లాల్పూర్-పాండేపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీంతో టీచర్పై, ప్రిన్సిపాల్పై, స్కూల్ మేనేజ్మెంట్పై పోలీసులు కేసు నమోదు చేశారు. బాలుడిని ఆస్పత్రికి తరలించారు.
వైద్య నివేదికల అనంతరం నిందితులపై చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం బాలుడికి చికిత్స అందుతోందని, వారు అందించే నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఇదే సమయంలో స్కూల్లోని సీసీటీవీ ఫుటేజ్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసుకు సంబంధించిన ఆధారాలు సేకరిస్తున్నారు.