ఆదిలాబాద్, జూన్ 25(నమస్తే తెలంగాణ) : పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకోవడానికి అవకాశం లభించింది. ప్రాథమిక విద్య మొదలుకొని ఉన్నత విద్య వరకు ఉచితంగా చదువు అభ్యసించేలా చర్యలు తీసుకొన్నది. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యను అమలు చేయడంతోపాటు ప్రతి జిల్లాకు మెడికల్ కళాశాల మంజూరు చేసింది. పలు చోట్ల ఇంజినీరింగ్ కళాశాలలు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏర్పాటయ్యాయి. రెసిడెన్షియల్ స్కూళ్లలో పేద విద్యార్థులకు ఉచితంగా ఇంగ్లిషు మీడియం కార్పొరేట్ చదువులు, పౌష్టికాహారం అందజేసింది. దీంతో విద్యార్థులు గురుకుల పాఠశాలల్లో చేరడానికి పోటీ పడ్డారు. ఇంజినీరింగ్ చదువుకున్న విద్యార్థులు జిల్లాలోనే ఉపాధి పొందేలా బీఆర్ఎస్ ప్రభుత్వం చర్యలు తీసుకొన్నది. ఇందులో భాగంగా రెండు ఐటీ కంపెనీలను ఏర్పాటు చేయడంతోపాటు రూ.40 కోట్లతో ఐటీ టవర్ నిర్మాణం చేపట్టింది.
ఆదిలాబాద్ జిల్లాకు చెందిన పేద విద్యార్థులు స్థానికంగా ఉన్నత చదువులు అభ్యసించి, వారి ఉపాధి అవకాశాలను బీఆర్ఎస్ ప్రభుత్వం మెరుగుపర్చింది. జిల్లాకేంద్రానికి వ్యవసాయ కళాశాలతోపాటు జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలలను మంజూరు చేసింది. నాలుగు సంవత్సరాల కిందట మంజూరైన అగ్రికల్చర్ కళాశాలలో తరగతులు నిర్వహిస్తున్నారు. ఇందులో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 60 మంది విద్యార్థులు చదువుకుంటుండగా భవన నిర్మాణాలు లేకపోవడంతో ప్రాక్టికల్స్ కోసం ఇతర కళాశాలకు వెళ్లాల్సి వస్తున్నది.
బీఆర్ఎస్ ప్రభుత్వం మూడేండ్ల కిందట జిల్లా కేంద్రంలో జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలను మంజూరు చేసింది. అప్పుడు సాంకేతిక విద్యాశాఖ జీవో ఎమ్ఎస్ 67ను జారీ చేసింది. జేఎన్టీయూ రిజిస్ట్రార్, ఉన్నత విద్యాశాఖ కార్యదర్శులు కళాశాల ఏర్పాటులో భాగంగా తగిన చర్యలు తీసుకోవాలని అప్పటి ఉన్నత విద్యా శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. కళాశాల ఏర్పాటులో కోసం 20 ఎకరాల స్థలాన్ని సేకరించాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం జిల్లాకు మంజూరైన ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటుపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది.
మూడేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఏర్పాటు విషయంలో సందిగ్ధత నెలకొన్నది. రాష్ట్ర వ్యాప్తంగా ఇంజినీరింగ్ కళాశాలల్లో ఇటీవల అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. జిల్లాకు చెందిన విద్యార్థులకు ఇంజినీరింగ్ కళాశాల అందుబాటులోకి రాకపోవడంతో హైదరాబాద్ కళాశాలల్లో జిల్లాకు చెందిన పేద విద్యార్థులు అడ్మిషన్లు తీసుకోవాల్సి వచ్చింది. భారీగా ఫీజులు చెల్లించడంతోపాటు దూర ప్రాంతాలకు వెళ్లి చదువుకోవాల్సిన దుస్థితి నెలకొన్నది. ఆర్థిక సమస్యల కారణంగా విద్యార్థులు ఇంజినీరింగ్ విద్యను అభ్యసించే అవకాశం లేకుండా పోయింది.
బీఆర్ఎస్ ప్రభుత్వం 2023 ఆగస్టు 22న ఆదిలాబాద్కు జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలను మంజూరు చేసింది. కళాశాల ఏర్పాటు కోసం 20 ఎకరాల స్థలాన్ని సేకరించాలని సూచించారు. పేద విద్యార్థులకు ఉన్నత చదువులు అందేలా కాంగ్రెస్ ప్రభుత్వం ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటు దిశగా చర్యలు తీసుకోవాల్సి ఉండగా పట్టించుకోవడం లేదు. ప్రభుత్వం కళాశాల ఏర్పాటు సంబంధించిన అవసరమైన చర్యలు తీసుకుంటే పేద విద్యార్థులకు స్థానికంగా ఉన్నత చదువులు అభ్యసించేలా అవకాశం లభించేది. రాష్ట్ర ప్రభుత్వం ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటు చేయకపోవడంతో పేద, మధ్య తరగతి విద్యార్థులకు ఆర్థికంగా నష్టం జరుగుతున్నది. ఆదిలాబాద్లో ఇంజినీరింగ్ కళాశాల ప్రారంభమయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
– ధరణి రాజేశ్, విద్యార్థి సంఘం నాయకుడు