శాంతి భద్రతల పరిరక్షణలో అసువులు బాసిన పోలీసు అమర వీరుల త్యాగాలను అధికారులు, ప్రజాప్రతినిధులు స్మరించుకున్నారు. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లా కేంద్రాల్లో పోలీసు అమర వీరుల సంస్మరణ దినాన్ని ఘనంగా నిర్వహించగా, ఆయా చోట్ల మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, కలెక్టర్లు సిక్తా పట్నాయక్, ముషారఫ్ అలీ ఫారూఖీ, ఎస్పీలు ప్రవీణ్ కుమార్, ఉదయ్ కుమార్ రెడ్డి,తదితరులు పాల్గొన్నారు. స్తూపాల వద్ద నివాళులర్పించారు. వీరులకు జోహార్లు అంటూ నినాదాలు చేశారు. అమరుల కుటుంబ సభ్యులను సన్మానించి, అండగా ఉంటామని భరోసానిచ్చారు. పలుచోట్ల రక్తదాన శిబిరాలు నిర్వహించగా, పోలీసులతో పాటు యువకులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేశారు.
నిర్మల్ అర్బన్, అక్టోబర్ 21: పోలీస్ అమరుల త్యాగాలు చిరస్మరణీయమని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన పోలీస్ అమర వీరుల సంస్మరణ దినోత్సవంలో పా ల్గొన్నారు. అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించి, అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు. అనంతరం ఆయన మా ట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణలో ప్రాణాలొడ్డిన అమర వీరులను స్మరించుకోవడం మనందరి బాధ్యతని పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి అండగా నిలుస్తున్నదని చెప్పారు. స్వరాష్ట్రంలోనే పోలీస్ వ్యవస్థ పటిష్టంగా మారిందని పేర్కొన్నారు.
ఆలంపల్లి అటవీ ప్రాంతంలో 1987లో మావోయిస్టులు దాడి చేసి పది మంది పోలీసులను హతమార్చిన సమయంలో తాను జడ్పీ చైర్మన్ హోదాలో ఉట్నూర్లో ఉన్నట్లు గుర్తు చేశారు.శాంతిభద్రతల పరిరక్షణలో అమరుల త్యాగం భావితరాలకు స్ఫూర్తినిస్తుందని కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ అన్నారు. అనంతరం జిల్లా పోలీస్ కార్యాలయ ప్రాంగణంలో అమరవీరుల కుటుంబ సభ్యులతో కలిసి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎస్పీ ప్రవీణ్ కుమార్, జడ్పీ చైర్పర్సన్ విజయలక్ష్మి మొక్కలు నాటారు. అనంతరం మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. 75 మంది సిబ్బంది, యువత రక్తదానం చేశారు. పోలీ సు అమరులను స్మరించుకుంటూ పోలీస్అధికారులు, సిబ్బం ది, ఉన్నతాధికారులు, ఎన్సీసీ విద్యార్థుల ర్యాలీని ఎ స్పీ ప్రారంభించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, అదనపు ఎస్పీలు ప్రసాద్ రావు, వెంకటేశ్వర్లు, భైంసా ఏఎస్పీ కిరణ్ ఖారే, డీఎస్పీలు జీవన్ రెడ్డి, రవీందర్ రెడ్డి, ఎస్బీ ఇన్స్పెక్టర్ రమేశ్, సీఐలు శ్రీనివాస్, రాం నర్సింహారెడ్డి, వెంకటేశ్, ఆర్ఐలు అమర వీరుల కుటుంబ సభ్యులు, నాయకులు పాకాల రాంచందర్, రాంకిషన్ రెడ్డి, వైద్యులు దేవేందర్ రెడ్డి, వేణుగోపాల కృష్ణ, డాక్టర్ కృష్ణంరాజు ఉన్నారు.
ఆదిలాబాద్ జిల్లాలో..
ఎదులాపురం,అక్టోబర్21: దేశ రక్షణలో ప్రాణం కంటే విధి నిర్వహణ గొప్పదని చాటిన పోలీస్ అమరవీరుల త్యాగం చిరస్మరణీయమని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్లో అమరవీరుల స్తూపం వద్ద ఎస్పీ డీ ఉదయ్ కుమర్ రెడ్డి, ఐటీడీఏ పీవో వరుణ్ రెడ్డి, ఉట్నూర్ ఏఎస్పీ హర్షవర్ధన్ శ్రీవాస్తవ్, ఇతర పోలీసుల అధికారులు, అమరవీరుల కుటుంబ సభ్యులతో కలిసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ.. జిల్లాలో ఉన్న అమరవీరుల కుటుంబాలను ఆదుకుంటామన్నారు. ఎలాంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని తెలిపారు. ఎస్పీఉదయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ..శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు అప్రమత్తంగా ఉంటారని పేర్కొన్నారు.. అమరుల త్యాగాలకు వెలకట్టలేమని, వారిని స్మరించుకోవడం మన బాధ్యతని చెప్పారు. పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించగా, జెండా ఊపి కలెక్టర్ ప్రా రంభించారు. అదనపు ఎస్పీలు ఎస్.శ్రీనివాసరావు, సీ సమైజాన్రావు, డీఎస్పీలు వీ ఉమేందర్, ఉమామహేశ్వరరావు, డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్, రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథో డ్, డీపీఆర్వో భీమ్ కుమార్, టీఎస్ఎస్పీ అడిషనల్ కమాండెంట్స్ డీవీ నరసింహారాజు, కేవీవీ ప్రసాద్, పీ కృష్ణప్రసాద్, ఆర్ఐ సీఐలు బీ.శ్రీపాల్, బీ వెంకటి, ఎం వంశీకృష్ణ. జీ వేణు, సీసీ దుర్గం శ్రీనివాస్, పోలీస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పెంచాల వెంకటేశ్వర్లు స్థానిక సీఐలు పీ సురేందర్, కే శ్రీధర్, కే మల్లేశ్, జే కృష్ణమూర్తి, ఈ.చంద్రమౌళి, ఎస్ఐలు ఉన్నారు.
ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో శుక్రవారం పోలీసు అమర వీరుల సంస్మరణ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. పలుచోట్ల పాల్గొన్న ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీసు అమర వీరుల త్యాగాలను స్మరించుకున్నారు. స్తూపాల వద్ద నివాళులర్పించారు. వీరులకు జోహార్ అంటూ నినాదాలు చేశారు. పోలీసుల సేవలను కొనియాడుతూ, అమరుల కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని భరోసానిచ్చారు.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జడ్పీ చైర్పర్సన్ కోవ లక్ష్మి
ఎమ్మెల్యే సక్కు, కలెక్టర్ రాహుల్రాజ్, ఎస్పీ సురేశ్కుమార్తో కలిసి అమర వీరులకు నివాళి
ఆసిఫాబాద్, అక్టోబర్ 21 : విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరులను స్మరించుకుందామని కుమ్రం భీం ఆసిఫాబాద్ జడ్పీ చైర్పర్సన్ కోవ లక్ష్మి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని పరేడ్గ్రౌండ్లో నిర్వహించిన పోలీసు అమరవీరుల సంస్మరణ దినం కార్యక్రమానికి ఎమ్మెల్యే ఆత్రం సక్కు, కలెక్టర్ రాహుల్రాజ్, ఎస్పీ సురేశ్కుమార్తో కలసి హాజరయ్యారు. ముందుగా అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. అమరవీరుల కుటుంబ సభ్యులను శాలువాలతో ఘనంగా సన్మానించారు. ప్రభుత్వం తరఫున సాయమందేలా చూస్తామని వారికి హామీ ఇచ్చారు. అదనపు కలెక్టర్లు అచ్చేశ్వర్రావు, భీంరావు, డీఎస్పీ శ్రీనివాస్ పాల్గొన్నారు.
రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవండి : ఎస్పీ సురేశ్కుమార్
రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలని ఎస్పీ సురేశ్కుమార్ పిలుపునిచ్చారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా జిల్లా కేంద్రంలోని ప్రేమల గ్రార్డెన్లో జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలన్నారు. మెరుగైన సమాజ నిర్మాణమే లక్ష్యంగా పోలీసుశాఖ పని చేస్తుందని తెలిపారు. యేటా పోలీసు అమరులను స్మరిస్తూ ఫ్లాగ్ డే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కోవ లక్ష్మి యువసైన్యం ఆధ్వర్యంలో 60 మంది యువకులు రక్తదానం చేయగా, వారిని ఎస్పీ అభినందించారు. అదనపు ఎస్పీ అచ్చేశ్వర్రావు, డీఎస్పీ శ్రీనివాస్, సీఐ రాణాప్రతాప్, ఎస్ఐలు రమేశ్, గంగన్న, రాజేశ్వర్ పాల్గొన్నారు.
అండగా ఉంటాం..
రామగుండం సీపీ చంద్రశేఖర్రెడ్డి
గర్మిళ్ల, అక్టోబర్ 21 : అమర వీరుల త్యాగాలు చిరస్మరణీయమని రామగుండం పోలీస్ కమిషనర్ చంద్రశేఖర్రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆర్ముడ్ రిజర్వుడ్ హెడ్ క్వార్టర్స్లో పోలీస్ అమర వీరుల సంస్మరణ దినం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమర వీరుల స్తూపం వద్ద పుష్పగుచ్ఛం పెట్టి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అమరవీరుల త్యాగాల ఫలితంగానే ప్రజలంతా సుఖసంతోషాలతో ఉంటున్నారన్నారు. అనంతరం అమరవీరుల కుటుంబ సభ్యులతో మాట్లాడారు. వారి పరిస్థితులు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అధైర్య పడవద్దు.. అండగా ఉంటామని భరోసానిచ్చారు. అనంతరం వారికి జ్ఞాపికలను అందజేశారు. అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
కలెక్టర్ భారతీహోళికేరి
గుడిపేట బెటాలియన్లో అమరవీరులకు నివాళి
రక్తదానం చేసిన కమాండెంట్ రామకృష్ణ
హాజీపూర్, అక్టోబర్ 21 : అమరులైన పోలీసుల త్యాగాలు వెలకట్టలేనివని కలెక్టర్ భారతీ హోళికేరి అన్నారు. శుక్రవారం గుడిపేటలోని 13వ ప్రత్యేక తెలంగాణ పోలీస్ బెటాలియన్లో నిర్వహించిన పోలీసు అమర వీరుల సంస్మరణ దినం కార్యక్రమంలో బెటాలియన్ కమాండెంట్ రామకృష్ణతో కలిసి పాల్గొన్నారు. స్తూపం వద్ద పూలమాలలతో నివాళులర్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ భారత్-చైనా సరిహద్దుల్లోని అక్సయ్ చిన్ ప్రాంతంలో విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీసులను స్మరించుకోవడం అందరి బాధ్యత అన్నారు. నిత్యం పోలీసులు చేస్తున్న పోరాటాలు, వీరోచిత సాహస చర్యలను చూస్తున్నామని, ప్రజల కోసం తమ వ్యక్తిగత జీవితాలను అంకితం చేస్తున్నవారెందరో ఉన్నారని చెప్పుకొచ్చారు. అంతకు ముందు బెటాలియన్కు చేరుకున్న కలెక్టర్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. రక్తదాన శిబిరంలో కమాండెంట్ రామకృఫ్ణ రక్తదానం చేసి పలువురికి ఆదర్శంగా నిలిచారు. కార్యక్రమంలో అడిషనల్ కమాండెంట్ ఎంఐ సురేశ్, రఘునాథ్ చౌహాన్,గుడిపేట సర్పంచ్ లగిశెట్టి లక్ష్మి-రాజయ్య, ఎంపీటీసీ ఒడ్డె బాలరాజు, మినిస్టీరియల్ సిబ్బంది పాల్గొన్నారు.