అసెంబ్లీ ఎన్నికల వేళ పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఓటర్లను కానుకలు, మందు, నగదుతో ప్రలోభ పెట్టే అవకాశం ఉండడంతో విస్తృతంగా సోదాలు చేస్తున్నారు. ఐదు అంతర్ జిల్లా, మరో ఐదు అంతర్రాష్ట్ర చెక్పోస్టులు ఏర్పాటు చేసి నిరంతరం తనిఖీలు చేపడుతున్నారు. ఇప్పటివరకు రూ.15.76 లక్షల విలువ చేసే 2,764 లీటర్ల మద్యం, రూ.81.36 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. నిర్మల్ జిల్లా వ్యాప్తంగా 743 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. ఓటర్లు ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకోవడానికి విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు. నిర్మల్, భైంసా ప్రాంతాల్లో కవాతును కూడా నిర్వహించి ప్రజల్లో భయాన్ని తొలగిస్తున్నారు.
– నిర్మల్ అర్బన్, అక్టోబర్ 25
నిర్మల్ అర్బన్, అక్టోబర్ 25 : శాసనసభ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పోలీసు అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. నిర్మల్ ఎస్పీ ప్రవీణ్ కుమార్ ప్రత్యేక చెక్పోస్టులను ఏర్పాటు చేశారు. ఇతర జిల్లాలు, రాష్ర్టాల నుంచి జిల్లాకు వచ్చే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. ఎటువంటి రసీదులు, అనుమతి పత్రాలు లేకుండా ఇతర ప్రాంతాల నుంచి జిల్లాకు తరలిస్తున్న మద్యం, నగదును పట్టుకుని సీజ్ చేస్తూ జిల్లాలో ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా కృషి
చేస్తున్నారు.
నిర్మల్ జిల్లాలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఎస్పీ ప్రవీణ్ కుమార్ 10 చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. ఇందులో 5 అంతర్ జిల్లాల చెక్పోస్టులను సారంగాపూర్ మండలం చించోలి(బీ), నిర్మల్ రూరల్ మండలం కొండాపూర్, సోన్ మండలం గంజాల్ వద్ద, లోకేశ్వరం మండలం పంచగుడి వద్ద, బాసరలో చెక్పోస్టులను ఏర్పా టు చేశారు. ఇవి ఆయా ప్రాంతాల నుంచి జిల్లాకు అనుబంధమున్న చెక్పోస్టులు కాగా… మరో 5 అంతర్రాష్ట్ర చెక్పోస్టులు మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాలు, ఇతర జిల్లాల సరిహద్దు చెక్పోస్టులను బిద్రెల్లి, కుంటాల మండలం సిర్పెల్లి, నర్సాపూర్ మండలం సిర్పెల్లి, బెల్తరోడ, బాదన్కుర్తి (ఖానాపూర్)లోచెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. 24 గంటల పాటు తనిఖీలు చేపడుతున్నారు.
జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పది చెక్పోస్టులలో ఇప్పటి వరకు 2,764 లీటర్ల అక్రమ మద్యాన్ని పోలీసుల తనిఖీల్లో పట్టుకున్నారు. ఎన్నికల నేపథ్యంలో ఓటర్లను ప్రలోబపెట్టేందుకు ఆయా చోట్ల పోలీసులు ఈ మద్యాన్ని పట్టుకోగా..వీటి విలువ రూ.15,76,900 ఉంటుందని పోలీసు అధికారులు వెల్లడించారు. వీటితో పాటు ఎలాంటి రసీదులు లేకుండా పరిమితికి రూ.49000 మంచి నగదును తరలిస్తున్న ప్రజల నుంచి ఇప్పటి వరకు రూ.81,36,190 నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
రాబోయే శాసనసభ ఎన్నికల సందర్భంగా పోలీస్ శాఖ సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై దృష్టి సారించింది. నిర్మల్ జిల్లా వ్యాప్తంగా మొత్తం 743 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. వీటిని మూడు విభాగాలుగా విభజించి బందోబస్తును పర్యవేక్షిస్తున్నారు. మొదటి కేటగిరీలో నార్మల్ పోలింగ్ కేంద్రాలు 590, రెండో కేటగిరీలో క్రిటికల్ పోలింగ్ కేంద్రాలు 136, మూడో కేటగిరీలో మావోయిస్టు ప్రభావిత పోలింగ్ కేంద్రాలు 17 గుర్తించారు. వీటిపై నిత్యం పోలీసులు నిఘాను పటిష్టం చేసి ప్రజలు సేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకునేలా అవగాహన కల్పిస్తున్నారు. 18 సంవత్సరాలు నిండిన వయోజనులందరూ ఓటరుగా నమోదు చేసుకొని ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకోవాలని పిలుపునిస్తున్నారు. ఇందుకోసం నిర్మల్, భైంసా ప్రాంతాల్లో పోలీసుల ఫ్లాగ్మార్చ్ను సైతం నిర్వహించి ప్రజల్లో భయాన్ని తొలగిస్తున్నారు.
శాసనసభ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు మద్యం, డబ్బు అక్రమ రవాణా జరుగకుండా ఉండేందుకు ఏర్పాటు చేసిన చెక్పోస్టులను నిరంతరం ఎస్పీ తనిఖీ చేస్తున్నారు. 24 గంటల పాటు పటిష్ట నిఘాను ఉంచాలని ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసి అక్రమంగా మద్యం, నగదు, కానుకలు లేవని నిర్ధారించుకున్న తర్వాతనే వాహనాలను వదలాలని సూచిస్తున్నారు.