కుమ్రం భీం ఆసిఫాబాద్, జనవరి 6 (నమస్తే తెలంగాణ) : హరితహారంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం పల్లెల్లో పచ్చదనం పెంచేందుకు ఊరూరా నర్సరీలు ఏర్పాటు చేసి మొక్కలు పెంచుతున్నది. తొమ్మిదో విడుతలో భాగంగా (వచ్చే వానకాలం) జిల్లా వ్యాప్తంగా 50 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకోగా, అందుకనుగుణంగా చర్యలు చేపడుతున్నది. గ్రామీణాభివృద్ధి, రెవెన్యూ, అటవీ, ఎక్సైజ్, విద్యా, తదితర ప్రభుత్వ శాఖల సమన్వయంతో హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రణాళికలు రూపొందించింది. గతంలో జిల్లా కేంద్రం, మండల కేంద్రాల్లోని నర్సరీల్లో మొక్కలు పెంచి గ్రామాలకు తరలించే వారు. దీంతో నిర్వహణ భారం భారీగా పెరిగేది. దీంతో ఊరికో నర్సరీ ఏర్పాటు చేసి స్థానికంగా పంపిణీ చేయాలని అధికారులు నిర్ణయించిన విషయం విదితమే. 15 మండలాల్లో 335 గ్రామ పంచాయతీలుండగా, ఒక్కో పంచాయతీలో అర ఎకరంలో నర్సరీలు ఏర్పాటు చేసి మొక్కలు పెంచుతున్నారు.
ఎనిమిది విడుతల్లో 4కోట్లకు పైగా..
జిల్లాలో ఎనిమిది విడుతల్లో నిర్వహించి హరితహారంలో వివిధ శాఖల ద్వారా నాలుగు కోట్లకు పైగా మొక్కలు నాటారు. యేటా గ్రామీణాభివృద్ధి, అటవీ శాఖ, ఎక్సైజ్, సింగరేణి, ఇతరల శాఖల ద్వారా మొక్కలు నాటి పెంచుతున్నారు. గ్రామీణ అభివృద్ధి శాఖ ద్వారా పల్లెలు, చేలు, రోడ్లకిరువైపులా నాటుతున్నారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో అటవీ జాతి మొక్కలు పెంచుతున్నారు. ఇక తొమ్మిదో విడుతలో నాటేందుకు నర్సరీల్లో మొక్కలు సిద్ధం చేస్తున్నారు.
తొమ్మిదో విడుత విజయవంతం చేసే లక్ష్యంతో..
తొమ్మిదో విడుత విజయవంతం చేసే లక్ష్యంతో జిల్లా అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి గ్రామ పంచాయతీలో లక్ష్యానికి అనుగుణంగా మొక్కలు నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ప్రతి పంచాయతీకి ట్రాక్టర్తో పాటు ట్రాలీ, వాటర్ ట్యాంకర్లు అందుబాటులో ఉండడంతో మొక్కల పెంపకం సులువవుతున్నది. నీటితో పాటు మట్టి ఇతర వనరులు సమకూర్చుకుంటున్నారు. గ్రామాలను శుభ్రపరిచి చెత్తను డంప్ యార్డ్కు తరలించడంతో పాటు మొక్కలకు నీరు పోయడంలో ఇవి ఎంతో ఉపయోగపడుతున్నాయి. నాటిన మొక్కలన్నీ బతికేలా ప్రత్యేక దృష్టి పెడుతున్నారు.