ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపం వద్ద ఆదివాసీ గిరిజనులు స్వేచ్ఛగా నివాళులర్పించారు. గురువారం ఉదయం నుంచే వివిధ ప్రాంతాల నుంచి వందలాది మంది తరలివచ్చారు. గోండ్గూడ నుంచి స్తూపం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అమరవీరుల పేరిట జెండాను ఆవిష్కరించి, సంప్రదాయబద్ధంగా పూజలు చేశారు. ఆదివాసులతోపాటు ప్రముఖులు కూడా శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆదివాసీ హక్కుల కోసం పోరాడి మృతి చెందిన తొడసం ఖట్టికి కూడా నివాళులర్పించారు. తుమ్మగూడ గ్రామస్తుల ఆధ్వర్యంలో సమక ఎక్స్రోడ్డు వద్ద ఖట్టి స్మారకార్థం ఏర్పాటు చేసిన జెండాను ఆవిష్కరించారు. సంస్మరణాన్ని పురస్కరించుకొని ఉట్నూర్ డీఎస్పీ నాగేందర్ ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు.
ఇంద్రవెల్లి, ఏప్రిల్ 20 : ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని హీరాపూర్ గ్రామ సమీపంలో గల అమరవీరుల స్తూపం వద్ద ఆదివాసీ గిరిజనులు స్వేచ్ఛగా నివాళులర్పించారు. 42 ఏండ్ల తర్వాత సంప్రదాయబద్ధంగా ప్రత్యేక పూజలు చేసి, శ్రద్ధాంజలి ఘటించారు. రగల్ జెండా అమరవీరుల ఆశయ సాధన కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేయగా.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి గిరిజనులు ఉదయం 10 గంటలకే తరలివచ్చారు. గోండ్గూడ నుంచి స్తూపం వరకు ర్యాలీ నిర్వహించి అమరవీరుల పేరిట జెండాను ఆవిష్కరించారు. అనంతరం సంప్రదాయ పూజా కార్యక్రమాలు ప్రారంభించారు. అమరవీరుల స్తూపంతోపాటు జెండాల వద్ద అమరవీరుల కుటుంబ సభ్యులతోపాటు ఆదివాసులు పూజలు నిర్వహించి, ఘనంగా నివాళులర్పించారు.
తొడసం ఖట్టికి నివాళి..
ఆదివాసీ గిరిజన హక్కుల కోసం పోరాడి మృతి చెందిన తొడసం ఖట్టికి ఆదివాసీ గిరిజనులు ఘనంగా నివాళులర్పించారు. తుమ్మగూడ గ్రామస్తుల ఆధ్వర్యంలో సమక ఎక్స్రోడ్డు వద్ద ఖట్టి స్మారకార్థం ఏర్పాటు చేసిన జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పలువురు ఆదివాసీ గిరిజనులు మాట్లాడుతూ.. ఆదివాసీల కోసం అనేక ఉద్యమాలు చేశారన్నారు. తొడసం ఖట్టిని అప్పటి పోలీసులు హైద్రాబాద్లోని చంచల్గూడ జైలులో ఆరేండ్లు నిర్భందం చేశారన్నారు. యేటా ఏప్రిల్ 20న సంస్మరణ దినంగా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.
నివాళులర్పించిన ప్రముఖులు
ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపం వద్ద పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. ఇందులో వైఎస్సార్ తెలంగాణ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల, ఆదిలాబాద్ ఎంపీ బాపురావ్, ఎమ్మెల్యే ఆత్రం సక్కు, రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు ఈశ్వరీబాయి, పీఏసీఎస్ చైర్మన్ మారుతిపటేల్డోంగ్రె, జడ్పీ కో-ఆప్షన్ సభ్యులు మహ్మద్ అబ్దుల్ అంజద్, తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు బుర్స పోచయ్య, ప్రజాగాయకుడు ఏపూరి సోమన్న, మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్సాగర్రావ్, బీఎస్పీ ఖానాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి బన్సిలాల్, మానవహక్కుల వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆత్రం భుజంగ్రావ్, ఆదివాసీ గిరిజన మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు ఆత్రం సుగుణ, జడ్పీటీసీలు ఆర్కా పుష్పలత, తుడుందెబ్బ మహిళా సంఘం అధ్యక్షురాలు పెందూర్ పుష్పరాణి, ఆదివాసీ గిరిజన ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు సీడాం భీంరావ్, తుడుందెబ్బ గౌరవ అధ్యక్షుడు ఆర్కా ఖమ్ము, జిల్లా నాయకులు గండ్రత్ సుజాత, వేడ్మ బొజ్జు, పుర్కా బాపురావ్, రగల్ జెండా ఆశయ సాధన కమిటీ అధ్యక్షుడు తొడసం నాగోరావ్, ప్రధాన కార్యదర్శి మెస్రం నాగ్నాథ్, తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు కొడప గోడం గణేశ్, తుడుం దెబ్బ మండలాధ్యక్ష డుజుగ్నాక్ భారత్, ఆదివాసీ పురోహిత్ ప్రధాన్ సమాజ్ మండల అధ్యక్షుడు సోయం రామ్దాస్, మాజీ ఎంపీపీ కనక తుకారామ్, ఎంపీటీసీ కోవ రాజేశ్వర్, మాజీ సర్పంచ్ కోరెంగా సుంకట్రావ్, ఆదివాసీ సంఘాల నాయకులు ఉన్నారు. కాగా.. సంస్మరణ దినాన్ని పురస్కరించుకొని ఉట్నూర్ డీఎస్పీ నాగేందర్, ఉట్నూర్ సీఐ సైదారావ్, ఇంద్రవెల్లి ఎస్ఐ సునీల్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.