ఈ నెల 4వ తేదీన పర్యటన
నిర్మల్ అర్బన్, సెప్టెంబర్ 30 : బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఈ నెల 4వ తేదీన నిర్మల్ జిల్లాలో పర్యటించనున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో నిర్మల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నట్లు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి శనివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ మేరకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల అనంతరం పట్టణంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో మధ్యాహ్నం భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు.
రూ.1,157 కోట్లతో అభివృద్ధి పనులు..
జిల్లా పర్యటనలో భాగంగా ఈ నెల 4న మంత్రి కేటీఆర్ రూ.1157 కోట్లతో పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేయనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా రూ.714 కోట్లతో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఎత్తిపోతల పథకాన్ని (27వ ప్యాకేజ్) ప్రారంభించనున్నారు. మిషన్ భగీరథలో భాగంగా రూ.23.91 కోట్లతో ఇంటింటా నల్లా నీటి సరఫరా ప్రారంభిస్తారు. సోన్ మండలం పాత పోచంపాడ్లో 40 ఎకరాల విస్తీర్ణంలో రూ.250 కోట్లతో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. నిర్మల్ పట్టణంలోని తహసీల్ కార్యాలయ స్థలంలో 2 ఎకరాల 30 గుంటల్లో రూ.10.15 కోట్లతో అధునాతన హంగులతో నిర్మించనున్న సమీకృత మార్కెట్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు.
రూ.2 కోట్లతో టీయూఎఫ్ఐడీసీ నిధులతో నిర్మంచే దోబీఘాట్ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. రూ.4 కోట్లతో టీయూఎఫ్ఐడీసీ నిధులతో మౌలిక సదుపాయాల కల్పన కోసం చేపట్టే అభివృద్ధి పనులకు శంకుస్థాపన, అమృత్ పథకంలో భాగంగా మంచినీటి సరఫరా వ్యవస్థను మెరుగుపర్చేందుకు రూ.62.50 కోట్లతో శంకుస్థాపన, రూ.50 కోట్లతో టూయూఎఫ్ఐడీసీ అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రత్యేక అభివృద్ధి నిధులతో రూ.25 కోట్లతో మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా చేపట్టే అభివృద్ధి పనులకు శంకుస్థాన చేస్తారు.