నిర్మల్ అర్బన్, అక్టోబర్ 16 : టీఆర్ఎస్(బీఆర్ఎస్) జాతీయ పార్టీ ప్రకటనతో ప్రతిపక్షాల్లో వణుకు మొదలైందని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఆదివారం నిర్మల్ పట్టణానికి చెందిన 27వ వార్డు కౌన్సిలర్ దంపతులు అయేషా రఫ్పుస్, 39 వార్డు కౌన్సిలర్ చెందిన తౌమీద్ ఉద్దీన్ (కాంగ్రెస్ పార్టీ), ఇండిపెండెంట్గా గెలిచిన 5వ వార్డు కౌన్సిలర్ గుంజాల లక్ష్మితో పాటు మరో 20 మంది నాయకులు మంత్రి క్యాంపు కార్యాలయంలో టీఆర్ఎస్(బీఆర్ఎస్) పార్టీలో చేరారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పార్టీ కండువాలు కప్పి వారిని ఆహ్వానించారు. టీఆర్ఎస్(బీఆర్ఎస్) చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నట్లు వారు ప్రకటించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని అన్ని రాష్ర్టాల ప్రజలు కోరుకుంటున్నారన్నారు.
రానున్న రోజుల్లో అన్ని రాష్ర్టాల ప్రజలు టీఆర్ఎస్(బీఆర్ఎస్) పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారని తెలిపారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ర్టాల ప్రజలు తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై అక్కడి రాష్ర్టాల్లో ఈ తరహా పథకాలను అమలు చేయాలని కోరుతున్నారని చెప్పారు. దేశ ప్రజల కన్నీళ్లు తుడవడానికే సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటించారని గుర్తు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కనుమరుగైందని, బీజేపీకి కేంద్రంలో టీఆర్ఎస్(బీఆర్ఎస్) పార్టీయే పోటీ అని స్పష్టం చేశారు. మునుగోడులో టీఆర్ఎస్ పార్టీ భారీ మెజార్టీతో గెలుస్తుందని అన్నారు. అంతకుముందు స్థానిక గుల్జార్ మార్కెట్ నుంచి మంత్రి నివాసం వరకు కార్యకర్తలు, పార్టీ నాయకులు పెద్దఎత్తున బైక్ ర్యాలీ తీశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, టీఆర్ఎస్(బీఆర్ఎస్) పట్టణ అధ్యక్షుడు మారుగొండ రాము, ఎఫ్ఎస్సీఎస్ చైర్మన్ ధర్మాజీ రాజేందర్, కౌన్సిలర్లు వేణు, శ్రీకాంత్, ఎస్పీ రాజు, కోటగిరి అశోక్ రిజ్వాన్, సయ్యద్ ముషీర్ ఉద్దీన్ పాల్గొన్నారు.
ఆరేండ్లలో ఎంతో అభివృద్ధి చేశాం
నిర్మల్ అర్బన్, అక్టోబర్ 16 : రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుతో ఆరేండ్లలో ఎంతో అభివృద్ధి చేశామని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పేర్కొన్నారు. నిర్మల్లో పలు అభివృద్ధి పనులకు ఆదివారం ఆయన శంకుస్థాపన చేశారు. పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రూ.52.50 లక్షలతో వాకింగ్ లాఫింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సభ్యులతో కలిసి ప్రహరీ నిర్మాణానికి భూమిపూజ చేసి పనులు ప్రారంభించారు. సభ్యులతో కలిసి సరదాగా క్రికెట్ ఆడారు. అనంతరం కలెక్టర్ కార్యాలయం పక్కన రూ.50 లక్షలతో క్లాక్ టవర్, కబూతర్ కమాన్ స్వాగత తోరణం, నాయుడివాడలో మారెమ్మ మందిరం, జాబిలమ్మ సంఘ భవన నిర్మాణానికి భూమిపూజ చేశారు. అనంతరం పట్టణంలోని ధర్మసాగర్ పక్కన గల నూతన భవనంలో ఏర్పాటు చేసిన మహాత్మా జ్యోతి బాఫూలే పాఠశాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్య రంగాల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నదని అన్నారు. నిర్మల్ జిల్లాకు మెడికల్ కళాశాల మంజూరు కావడంతో వైద్య రంగం మరింత మెరుగుపడుతుందన్నారు. నిర్మల్కు నవోదయ విద్యాలయం కావాలని కేంద్ర ప్రభుత్వానికి 100సార్లు ఉత్తరం రాసిన ఇప్పటి వరకు స్పందన లేదన్నారు. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో 1000 రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేశారని అన్నారు. కళాశాలలో ప్రహరీ నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన మంత్రిని వాకింగ్ లాఫింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు నాలం శ్రీనివాస్ శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎర్రవోతు రాజేందర్, ఎంపీపీ రామేశ్వర్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు మారుగొండ రాము, కౌన్సిలర్లు వేణు, నవీన్, రాజేందర్, శ్రీకాంత్, పూదరి రాజేశ్వర్, నరహరి, జహీర్, నాయకులు సయ్యద్ ముషీర్ ఉద్దీన్, సల్మాన్, రిజ్వాన్ పాల్గొన్నారు.