కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ర్టాల్లో కరెంటు కోతలతో ప్రజలు అల్లాడుతున్నారు. పల్లె, పట్టణం, నగరం అనే తేడా లేకుండా 2 గంటల నుంచి 5 గంటల వరకు కట్ చేస్తున్నారు. మొన్నటికీ మొన్న కర్ణాటక ఎన్నికలకు ముందు 200 యూనిట్లు ఉచితంగా ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ హ్యాండిచ్చింది. ఉచితం దేవుడెరుగు అసలుకే కోతలు విధిస్తూ అంధకారంలోకి నెట్టేస్తున్నారు. ఇంకా.. కాంగ్రెస్ పాలిస్తున్న రాజస్థాన్, ఛత్తీస్గఢ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ర్టాల పరిస్థితి కూడా దుర్భరంగానే ఉంది. కాగా.. తెలంగాణ రాష్ట్రంలో మాత్రం అందుకు భిన్నంగా ఉంది. సీఎం కేసీఆర్ కృషితో నిరంతర విద్యుత్ వెలుగులు ప్రసరిస్తున్నాయి. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి రెప్పపాటు కూడా పోకుండా విద్యుత్ ఇస్తున్నాడు. నడివేసవిలో కూడా ఎంత కష్టమైనా సాగుకు ఉచితంగా కరెంటు ఇచ్చిన అపర భగీరథుడు మన కేసీఆర్. విద్యుత్ వినియోగం పెరిగినా.. సబ్బండ వర్గాలను దృష్టిలో పెట్టుకొని పంపిణీ చేస్తున్న కృషివలుడు. ఇక, కాంగ్రెస్కు ఓటేస్తే.. అధికారంలోకి వస్తే అంధకారంలో మగ్గాల్సి వస్తుందని ప్రజలు భావిస్తున్నారు.
– ఆదిలాబాద్, ఆగస్టు 19(నమస్తే తెలంగాణ)
ఆదిలాబాద్, ఆగస్టు 19(నమస్తే తెలంగాణ) : ఉమ్మడి రాష్ట్రంలో కరెంటు ఎప్పుడు ఉంటుందో, ఎప్పుడు ఉండదో తెలియని పరిస్థితి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం విద్యుత్ రంగానికి పెద్దపీట వేసింది. పదేళ్లుగా తెలంగాణ ప్రజలకు నిరంతరం 24 గంటల ఉచితంగా మెరుగైన విద్యుత్ను పంపిణీ చేస్తోంది. ప్రస్తుతం రెప్పపాటు కూడా కరెంటు పోవడం లేదు. విద్యుత్ డిమాండ్ పెరిగినా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం ప్రజలకు నాణ్యమైన విద్యుత్ను సరఫరా చేస్తోంది. గృహ, వ్యవసాయం, పరిశ్రమలకు 24 గంటలపాటు అందిస్తున్నది. గతంలో విద్యుత్ సరిగా ఉండకపోవడంతో రైతులు చేతికొచ్చిన పంటలను నష్టపోయేవారు. లో వోల్టేజీ కారణంగా ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయేవి. గత ప్రభుత్వాలు ఇచ్చే నాలుగైదు గంటల కోసం రాత్రి, పగలు తేడా లేకుండా బావుల వద్ద పడిగాపులు పడాల్సి వచ్చేది.
విద్యుత్ షాక్, విష కీటకాలు, ఇతర వ్యాధుల బారిన పడి చనిపోయేవారు. తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ సమస్యలను పరిష్కరించడంతో రైతులు రెండు పంటలు వేస్తూ లాభాలు గడిస్తున్నారు. జీవనోపాధిలో భాగంగా కరెంటుపై ఆధారపడి చిరువ్యాపారులు చేసేవారు విద్యుత్ సరఫరా సరిగా లేకపోవడంతో ఉపాధి కోల్పోవాల్సిన పరిస్థితి ఉండేది. ఇప్పుడు ప్రభుత్వం నిరంతరం విద్యుత్ సరఫరా చేయడంతో చిరువ్యాపారుల ఉపాధి మెరుగుపడింది. గతంలో ఎండాకాలంలో కరెంటు లేక ప్రజలు ఉక్కపోతతో ఇబ్బందులు పడాల్సి వచ్చింది. దోమలబారిన పడి జ్వరాలు వచ్చేవి. వేసవిలో విద్యుత్ వినియోగం రెండింతలు పెరిగినా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం కరెంటు సరఫరా చేస్తున్నది. కాగా.. కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లోనూ కరెంటు కోతలు కొనసాగుతున్నాయి. అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా గవర్నమెంట్ను ఏర్పాటు చేసిన కర్ణాటకలోనూ అంధకారమే కొనసాగుతున్నది. ఎన్నికలకు ముందు 200 యూనిట్లు ఉచితంగా ఇస్తామని చెప్పి మాట మార్చింది.
మూడు గంటలు కూడా కరెంటియ్యలె..
కోటపల్లి, ఆగస్టు 19 : నాపేరు కొత్తవడ్ల రమేశ్, మాది మంచిర్యాల జిల్లా మండలకేంద్రం. నేను పదిహేనేండ్ల సంది కిరాణ దుకాణంతో పాటు గిర్ని పెట్టుకొని ఉపాధి పొందుతున్న. అప్పట్లో కరెంట్ కోతలతో పడ్డ కష్టాలు గుర్తుకస్తనే దుఃఖం వస్తది. నాలుగు గంటలు కూడా సక్కగా కరంటు ఇయ్యకపోయేటోళ్లు. ఏ పని కాకపోయేది. కోతలు జెయ్యవట్టి జనం కూడా రెండు, మూడు రోజుల ముందే పిండి కోసం వచ్చి లైన్ల పెట్టి పోయేటోళ్లు. ఒక్కోసారి మూడు, నాలుగు రోజులైనా పిండి పట్టియ్యకపోయేది. గిప్పుడు ఆ తిప్పలు లేవు. ఎప్పుడు తెస్తే అప్పుడే పట్టిస్తున్నం. సీఎం కేసీఆర్తోనే ఇదంతా సాధ్యమైంది. నాటి పరిస్థితి గుర్తుకు తెచ్చుకుంటే ఒక్కలు కూడా కాంగ్రెస్ పార్టీ దిక్కు సూడరు. పక్క రాష్ట్రం కర్ణాటకలో కరెంట్ కష్టాలు వార్తల్లో చూస్తున్నం. అక్కడ కాంగ్రెస్ పార్టే ఉన్నది. ఇగ మళ్లా ఇక్కడ కాంగ్రెస్ను గెలిపిస్తే మళ్లీ అదే పరిస్థితి వస్తది. ఈ కరెంట్ గిట్లనే నిరంతరం ఉండాలంటే బీఆర్ఎస్ ప్రభుత్వమే ఉండాలే.
బిల్లు తక్వ చేసి ఆదుకున్నడు..
బెజ్జూర్, ఆగస్టు 19 : నా పేరు దుర్గం సుశీల. నాభర్త దుర్గం రాములు పేరిట మాకు కరెంట్ మీటరు ఉంది. మాది చిన్నపాటి గుడిసె. మా గుడిసెలో మాకు ఒక బుగ్గ (బల్బు), ఒక పంకా, టీవీ మాత్రమే కరెంట్తోని నడుస్తయ్. కరెంట్ ఎక్వ ఏమి కాలదు. రెండు నెలలకు ఒకసారి బిల్లుల కొట్టే అతను వస్తడు. రూ. 180 నుంచి రూ. 200 బిల్లు వస్తది. ఎస్సీలు, ఎస్టీలకు 100 యూనిట్ల వరకు కరెంట్ బిల్లు ప్రభుత్వమే కడుతదని చెప్పిన్రు. నేను కూడా ఐప్లె చేసుకున్న. అప్పటి నుంచి కరెంట్ బిల్లు తక్వ వస్తున్నది. మొన్న బెజ్జూర్ సబ్ స్టేషన్లో కరెంట్ అదాలత్ పెట్టిన్రు. నా భర్త అదాలత్లో పోయి మా బిల్లు చిట్టీ తీసుకపోయి సార్లకు చూపెట్టి బిల్లు గురించి అడిగిండు. సార్లు కంప్యూటర్లో చూసి మీకు మాఫీ అయినవని కరెంట్ను పొదుపుగా వాడుకోవాలని జెప్పిండ్రు. మేము గట్లనే కరెంట్ పని ఉన్నప్పుడే వాడుకొని లేనప్పుడు బంద్ పెడుతున్నం. ఇప్పుడు మాకు 100 యూనిట్ల లోపే కరెంట్ కాలుతున్నదని సార్లు కూడా చెప్పిండ్రు. గరీబోళ్ల కరెంట్ కష్టాలు తీర్చిన కేసీఆర్ సారుకు రుణపడి ఉంటం.
బిల్లు మాఫీ.. మా కష్టం తీరుస్తున్నది
బెజ్జూర్, ఆగస్టు 19: నా పేరు ఎర్మ బాబాజీ. నాది కుకుడ. మేము ఆదివాసీలం. నా పేరున కరెం ట్ మీటర్ ఉన్నది. మాకు రెండు నెలలకోసారి రూ. 200 వరకు బిల్లు వస్తది. కానీ గత మూడేళ్ల కింద మాకు ఒకేసారి రూ.11 వేల బిల్లు వచ్చింది. దీంతో కంగారు పడ్డ మేము బిల్లు రిసీప్టు పట్టుకొని సబ్ స్టేషన్ సారు దగ్గర కెళ్లి చూపించినం. పొరపాటుగా బిల్లు వచ్చింద ని చెప్పి, ఒక దరఖాస్తు పెట్టమన్నరు. అట్లనే నేను ఎస్టీ అని తెలుసుకున్న సారు. 100 యూనిట్ల లోపు కరెంట్ కాల్చితే మాఫీ కూడా వస్తుందని, దానికి కూడా దరఖాస్తు పెట్టుకోవాలని చెప్పిండు. దీంతో నేను రెండు దరఖాస్తులు రాసి సార్లకు ఇచ్చిన. ఎక్కువ బిల్లు వచ్చిన నా కరెంట్ మీటరును తొలగించి, కొత్తది పెట్టిన్రు. అదే విధంగా నాకు మాఫీ వచ్చిన రూపాయలు తీసేసి, మిగిలిన పైసలను మాత్రమే తీసుకుంటున్నరు. వంద యూనిట్లలోపు బిల్లును ప్రభుత్వమే కట్టుడు మంచిగున్నది. కేసీఆర్ సారుకు నేనెంతో రుణపడి ఉన్న.
నిరంతర కరెంట్తో పుష్కలంగా పంటలు
నిర్మల్ అర్బన్, ఆగస్టు 19: సీఎం కేసీఆర్ రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ అందించడంతో రైతుల జీవితాలు బాగుపడుతున్నాయి. గత ప్రభుత్వాలు రైతులను పట్టించుకోకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సీఎం కేసీఆర్ రైతులకు ఉపయోగపడే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాడు. పెట్టుబడి సాయం, రుణమాఫీ, రైతుబీమా, ఎరువులు, విత్తనా లు సకాలంలో అందిస్తు అండగా నిలుస్తున్నాడు. నాకు ఐదెకరాల భూమి ఉంది. రెండు పంటలు పండిస్తున్నా. పసుపు, మక్క, వరి వేశా. సీఎం కేసీఆర్ సహకారంతోనే పంటలు పండిస్తున్నా. ఇతర రాష్ర్టాల్లో కరెంట్ కోతలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని టీవీలో చూశా. కర్షకులను పట్టించుకున్న సర్కారుకే మనుగడ ఉంటుంది.
– పెద్దింటి చంద్రయ్య, పొన్కల్.
నాడు చీకట్లు.. నేడు వెలుగులు..
భైంసా, ఆగస్టు 19 : అప్పటి ప్రభుత్వాల పాలనలో విద్యుత్ కోతలతో అల్లాడిన ప్రజల జీవితాల్లో సీఎం కేసీఆర్ వెలుగులు నింపారు. తెలంగాణలో కాంగ్రెస్ హయాంలో 7,780 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరిగితే.. నేడు 18,568 మెగావాట్లకు చేరింది. భవిష్యత్ తరాలు బాగు పడాలన్న విజన్ ముఖ్యమంత్రి కేసీఆర్కు ఉంది. తెలంగాణ వస్తే లాంతర్లు పట్టుకొని తిరగాల్సి వస్తుందన్న ఆంధ్రా నాయకులే మన వద్ద కరెంటు చూసి ఆశ్చర్యపోతున్నారు. తెలంగాణ ఆవిర్భావం ఆదిలోనే సీఎం కేసీఆర్ దూరదృష్టితో విద్యుత్ కోతలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దారు. రైతులు బాగు పడితేనే దేశం అభివృద్ధి చెందుతున్న సంకల్పంతో కేసీఆర్ వ్యవసాయానికి నిరంతర ఉచిత విద్యుత్, నీటిని సరఫరా చేస్తున్నారు. నాణ్యమైన నిరంతర విద్యుత్ సరఫరా వల్ల చిన్న పరిశ్రమలలో యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి.
– సుమేర్ హైమద్, వెల్డింగ్ దుకాణా యజమాని, భైంసా.
ఉపాధి కల్పిస్తున్నా..
ఆదిలాబాద్ రూరల్, ఆగస్టు 19 : రాష్ట్ర ప్రభుత్వం 24 గంటలపాటు నిరంతరంగా విద్యుత్ సరఫరా చేస్తుండడంతో స్వయం ఉపాధితో కుటుంబాలు పోషించుకుంటున్నాం. మరో నలుగురు నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తు న్నాం. మేము ఆదిలాబాద్లో పుట్టిన రోజు, ప్రభుత్వ పథకాలు, అవగాహన కార్యక్రమాల ఫ్లెక్సీలు ప్రింట్ చేస్తాం. ఇలా కరెంట్ 24 గంటలు ఉండడంతోనే వినియోగదారులకు సేవలందించగలుగుతున్నాం. గతంలో విద్యుత్ అంతరాయంతో నష్టపోయే వాళ్లం. 24 గంటల విద్యుత్తోనే మా షాపులు, ప్రభుత్వ కార్యాలయాలు, రైతులు, సాధారణ వినియోగదారులకు ఆవశ్యకమైన వనరు. మేము కూడా ఆ విద్యుత్ వినియోగంతోనే ఉపాధి పొందుతున్నాం.
– భూరె సురేశ్, ఫ్లెక్సీ ప్రింటింగ్ నిర్వాహకుడు, ఆదిలాబాద్.
30 ఏండ్లుగా పిండిగిర్ని నడుపుతున్న..
తాంసి, ఆగస్టు 19 : తాంసి మండలంలోని పొన్నారి లో పిండి గిర్ని నడుపుతున్న. గతంలో కరెంట్ సమస్యతో నడిపించడానికి ఇబ్బందులు పడేది. తెలంగాణ సర్కారు అధికారంలోకి వచ్చినంక కరెంటు పోవడం లేదు. ముప్పై ఏళ్లుగా పిండిగిర్ని నడుపుతున్నా. ఇప్పటి వరకు ఏ సర్కారు 24 గంటల కరెంటు ఇయ్యలే. సీఎం కేసీఆర్కు రుణపడి ఉంట. కరెంటు కోతలు లేకపోవడంతో ఉన్న ఊర్లోనే ఇంటి దగ్గర గిర్ని నడపడంతో ఉపాధికి ఢోకా లేదు.
– డ్యాగం మోహన్, పిండి గిర్ని నిర్వాహకుడు, పొన్నారి.
సబ్బండ వర్గాలకు ప్రయోజనం
ఆదిలాబాద్ రూరల్, ఆగస్టు 19 : రాష్ట్ర ప్రభుత్వం నిరవధికంగా 24 గంటలపాటు విద్యుత్ సరఫరా ఇవ్వకపోతే మేము మీ సేవలో వినియోగదారులను సంతృప్తి పరిచేవారం కాదు. మా మీసేవ కేంద్రాన్ని నమ్ముకున్న గ్రామాలు, పట్టణానికి చెందిన ఎందరో వినియోగదారులు రోజు ఉదయం 9 నుంచి రాత్రి 9 గంటల వరకు కేంద్రానికి వచ్చి వారి వారి పనులు చేసుకుంటారు. మధ్యలో విద్యుత్ సరఫరా అంతరాయం అనేది ఉండడం లేదు. దీంతో మేము సకాలంలో వివిధ రకాల దరఖాస్తులు, పథకాల అర్జీలను ప్రభుత్వాలకు పంపగలుగుతున్నాం. దీంతోనే అర్హులైన లబ్ధిదారులు ప్రయోజనం పొందగలుగుతున్నారు.
– విజయ్, మీ సేవా నిర్వాహకుడు, ఆదిలాబాద్
గతంల ఎప్పుడు కరెంటు వచ్చేదో తెలియపోయేది..
భైంసా, ఆగస్టు 19 : నిరంతర విద్యుత్ సరఫరాతో మాకు ఉపాధి లభించింది. కాంగ్రెస్ హయాంలో కరెంటు పోతే ఎప్పుడు వచ్చేదో తెలియకపోయేది. ఇప్పుడు నిరంతర విద్యుత్తో వెల్డింగ్ పనులు చేసుకుంటూ కిటికీలు, గేట్ల వంటివి చేస్తూ ఉపాధి పొందుతున్నా. భవిష్యత్ తరాలు బాగుపడాల న్న విజన్ ఉన్న నాయకుడు కేసీఆర్. నిరంతర విద్యుత్తో ఫ్రిజ్లు రిపేరు చేయడం వల్ల లాభంతోపాటు జీవితం హాయిగా ఉంది.
– ఆళా, ఫ్రిజ్ మెకానిక్, భైంసా
కరెంటు బిల్లు సర్కారు కడుతున్నది..
దహెగాం, ఆగస్టు 19 : మా ఇంటి కరెంటు బిల్లు సర్కారు కడుతున్నది. మాది ఎస్టీ కుటుంబం. సర్కారు ఎస్సీ, ఎస్టీ కులాల్లో నిరుపేదలకు 100 యూనిట్ల వరకు కరెంటు బిల్లు ఉచితమన్నది. దాని కోసం నేను దరఖాస్తు చేసుకున్న. అప్పటి నుంచి కరంటు బిల్లు కడుతలేను. మా ఇంట్లో రెండు కరెంట్ బుగ్గలు ఉన్నయ్. రోజూ సాయంత్రం లైట్ వేసుకొని రాత్రి 9 గంటల వరకు ఉంచుకుంటం. కరెంట్ పొదుపుగా వాడుకుంటం. అందుకే మాకు 100 యూనిట్లలోపే కరెంట్ కాలుతది. పేదలకు ఇంత మంచిగా న్యాయం జేసుడు కేసీఆర్ సారుతోనే సాధ్యమైతది. ఆయన నమ్మితే ఎవ్వరికీ అన్యాయం జరగదు. నా కరెంటు సర్వీనంబర్ 291 కాగా, ఇప్పటి వరకు రూ.4,907 బిల్లును సర్కారు కట్టినట్లు అధికారులు చెబుతున్నరు. గతంలో కరెంట్ బిల్లు కట్టాలంటే ఇబ్బంది పడేటోళ్లం. గిప్పుడు సర్కారే మా ఇంటి బిల్లు కడుతున్నది. ఇగ కరెంట్ కోతలైతే అస్సలు లేవు. గతంలో అసలు కరెంటే ఉండేది కాదు. గంటనో, రెండు గంటలో ఉండి పోయేది. ఇప్పుడా పరిస్థితి లేదు.
– నళ్లి భీంమయ్య, దహెగాం.
వ్యాపారాలు బాగా సాగుతున్నాయి..
ఉట్నూర్ , ఆగస్టు 19 : నేను గిరిజన తెగకు చెందిన వ్యక్తిని. మాది ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ డివిజన్ కేంద్రం. నేను 25 ఏండ్లుగా స్వర్ణకారుడిగా పనిచేస్తున్నా. కానీ.. ఇప్పటిలాగా ఏ ప్రభుత్వం కరెంట్ సరఫరా చేయలే. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక 24 గంటల కరెంట్ ఇవ్వడం మన అదృష్టం. కరెంట్ మీద ఆధారపడి ముఖ్యంగా రైతులు పంటలు పండిస్తున్నారు. ఇక చాలా మంది నిరుద్యోగులు చిన్న, చితక వ్యాపారాలు చేస్తున్నారు. ఎప్పుడు కరెంట్ ఉండడంలో వ్యాపారాలు బాగా సాగుతున్నాయి. కేసీఆర్ చాలా ముందు చూపున్న నేత. ఆయనకు రైతుల కష్టాలు చాలా తెలుసు. అందుకే రాష్ట్రంలో ఎక్కడా లేని పథకాలు తీసుకొచ్చారు. రాష్ట్రం, దేశంలో మంచి ఆదరణ ఉన్న నేత. అందుకే కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు మహారాష్ట్రలో ఖ్యాతిగాంచాయి. రాష్ట్ర సరిహద్దులలో ఉన్న మహారాష్ట్ర ప్రజలు కూడా తెలంగాణలో లాగా పథకాలు కావాలని కోరుకుంటున్నారు.
– చౌహన్ చందర్, స్వర్ణకారుడు, ఉట్నూర్.