అగ్రవర్ణాల్లోని పేదలకు కూడా గురుకులాలను ఏర్పాటు చేస్తామని బీఆర్ఎస్ ప్రకటించింది. తాజాగా ప్రకటించిన మ్యానిఫెస్టోలో ఈ అంశం చేర్చగా, మరికొంతమంది విద్యార్థులకు లబ్ధి చేకూరనున్నది. రాష్ట్రంలో పేదింటి పిల్లల చదువులకు ప్రభుత్వం ఇప్పటికే చేయూతనందిస్తున్నది. రెసిడెన్షియల్ స్కూళ్లను ఏర్పాటు చేసి వారి విద్యాభ్యాసానికి అన్ని వసతులు కల్పిస్తున్నది. ఆదిలాబాద్ జిల్లాలో ఆరు మహాత్మా జ్యోతిబాపూలే బీసీ రెసిడెన్షియల్ విద్యాలయాలు ఉండగా, వీటిల్లో 3320 మంది చదువుతున్నారు. ఇప్పుడు అగ్రవర్ణాల్లోని పేదలకు కూడా అవకాశం దక్కనుండగా, మరికొన్ని పాఠశాలలు ఏర్పాటయ్యే చాన్స్ ఉంది.
– ఆదిలాబాద్, అక్టోబర్ 20 ( నమస్తే తెలంగాణ)
ఆదిలాబాద్, అక్టోబర్ 20 ( నమస్తే తెలంగాణ): ఉమ్మడి రాష్ట్రంలో పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఆదిలాబాద్ జిల్లాలో విద్యారంగం అస్తవ్యస్తంగా ఉండేది. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో సరైన వసతుల లేక విద్యార్థుల చదువులు ముందుకు సాగేవి కావు. పేద విద్యార్థులకు చదువుకోవాలనే ఆసక్తి ఉన్నా గత ప్రభుత్వాల ప్రోత్సాహం కరువైంది. దీంతో ప్రతిభగల విద్యార్థులు మధ్యలోనే చదువులు ఆపేయాల్సిన పరిస్థితి ఉండేది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం విద్యారంగంపై ప్రత్యేక ధృష్టి సారించింది.
కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యను అందించేందుకు ప్రణాళికతో ముందుకెళ్లింది. అన్ని వర్గాలకు చెందిన పిల్లలు ఉచితంగా విద్యను అభ్యసించేలా రెసిడెన్షియల్ స్కూళ్లను ఏర్పాటు చేసింది. ఇందులో విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి వసతులు కల్పించింది. ఇక ఈ రెసిడెన్షియల్ స్కూళ్లలో ఇంటర్ విద్యను కూడా ప్రవేశపెట్టింది. జిల్లాలో ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ రెసిడెన్షియల్ స్కూళ్లు, కళాశాలల్లో వేలాది మంది పేద విద్యార్థులు చదువుకుంటున్నారు. సర్కారు అందిస్తున్న సాయంతో వారు బాగా చదువుకొని తమ బంగారు భవిష్యత్కు బాటలు వేసుకుంటున్నారు. ఐఐటీ, జేఈఈ, నీట్, ఎంసెట్ లాంటి పరీక్షల్లో ప్రతిభ చూపుతున్నారు.
అగ్రవర్ణాల్లోని పేదలకు కూడా గురుకులాలు ఏర్పాటు చేయనున్నట్లు బీఆర్ఎస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించింది. అగ్రవర్ణాల్లోని పేదలు తమ పిల్లలను ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదివిస్తున్నారు. ప్రైవేటు స్కూళ్లలో ఫీజులు ఎక్కువగా ఉండడంతో వారు ఆర్థికంగా ఇబ్బందులు పడాల్సి వస్తున్నది. ఇక నుంచి వీరికి ఈ సమస్య లేకుండా బీఆర్ఎస్ అండగా నిలవబోతున్నది. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే నియోజకవర్గాలకు ఒక రెసిడెన్షియల్ స్కూల్ను ప్రారంభించే అవకాశాలున్నాయి. గురుకులాల్లో కార్పొరేట్ విద్య, పౌష్టికాహారం, ఇతర సౌకర్యాలు ఉండడంతో విద్యార్థులు బాగా చదువుకొని వారి బంగారు భవిష్యత్ను తీర్చుదిద్దుకోనున్నారు. అగ్రవర్ణాల్లోని పేదలకు రెసిడెన్షియల్ స్కూళ్లను ప్రారంభిస్తామని హామీనివ్వడంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.