దశాబ్దాలుగా పేరుకుపోయిన అపరిష్కృత సమస్యలకు పరిష్కారం లభించనుంది. ఉమ్మడి రాష్ట్రంలో పాలకులు పట్టించుకోక పోవడంతో పోడు సమస్య కొనసాగుతూ వచ్చింది. అర్హులకు హక్కుపత్రాలు అందకపోవడంతో సాగు చేసుకుంటున్న గిరిజనులు, గిరిజనేతరులు అవస్థలు పడాల్సి వచ్చింది. స్వరాష్ట్రం ఆవిర్భవిం చడం, కేసీఆర్ సీఎం కావడంతో పోడు సమస్యపై ప్రత్యేక నజర్ పెట్టారు. 20 రోజుల నుంచి అధికారులు సర్వే నిర్వహిస్తున్నారు. మొదటగా అటవీశాఖ అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, వీఆర్ఏలు ఫారెస్ట్ రైట్స్ కమిటీ సభ్యుల సమక్షంలో 1,08,959 ఎకరాల అటవీ భూములు సాగవుతున్నట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. అనంతరం అధికారులు రైతులకు అవగాహన కార్యక్రమాలు చేపట్టి.. దరఖాస్తులు స్వీకరించారు. ఇప్పటివరకు 66 వేల మంది రైతులు 2.27 లక్షల ఎకరాల్లో సాగు చేస్తున్నట్లు తేలింది. కాగా.. ఇంకా సర్వే వేగంగా కొనసాగుతున్నది.
ఆదిలాబాద్, అక్టోబరు 13(నమస్తే తెలంగాణ) : ఉమ్మడి రాష్ట్రంలో గిరిజనులు, గిరిజనేతరులు సాగు చేసుకుంటున్న భూములకు హక్కు పత్రాలు పొందడానికి ఉద్యమాలే చేయాల్సి వచ్చింది. చివరకు కొందరికి హక్కు పత్రాలు పంపిణీ చేసినా.. అర్హులకు మాత్రం అందలేదు. ఫలితంగా అటవీ భూములు సాగు చేస్తున్న రైతులు అవస్థలు పడాల్సి వచ్చింది. ఇలా ఏండ్ల కాలంగా సాగు చేస్తూ ఇబ్బందులు పడ్డారు. కానీ.. దశాబ్దాలుగా పరిష్కారానికి నోచుకోని అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారానికి రాష్ట్ర సర్కారు చర్యలు తీసుకున్నది. ఇందులో భాగంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పోడు వ్యవసాయం చేస్తున్న గిరిజనులు, గిరిజనేతరుల నుంచి గతేడాది నవంబర్ మాసంలో దరఖాస్తులు స్వీకరించారు. బీట్ అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, వీఆర్ఏలు ఫారెస్ట్ రైట్స్ కమిటీ సభ్యుల సమక్షంలో దరఖాస్తులు తీసుకున్నారు. ఉమ్మడి జిల్లాలో 1,08,959 ఎకరాల అటవీ భూముల్లో వ్యవసాయం జరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఆదిలాబాద్ జిల్లాలో 56,140 ఎకరాలు, నిర్మల్లో 19,543, మంచిర్యాలలో 8,276, కుమ్రం భీం ఆసిఫాబాద్లో 25 వేల ఎకరాల్లో పోడు సాగవుతున్నట్లు ప్రాథమికంగా నిర్ధారించి.. దరఖాస్తుల స్వీకరణను పకడ్బందీగా చేపట్టారు.
కొనసాగుతున్న సర్వే
పోడు భూముల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటున్నది. పక్షం రోజులుగా సర్వే నిర్వహిస్తున్నది. ఇందులో భాగంగా అటవీ హక్కు పత్రాల పంపిణీలో భాగంగా జిల్లాలవారీగా కమిటీలను ఏర్పాటు చేసి అధ్యయనం చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. జిల్లా కమిటీలో జిల్లా ఇన్చార్జి మంత్రి చైర్మన్గా, కలెక్టర్ కన్వీనర్గా, జిల్లా ఉన్నతాధికారులు అధికారిక సభ్యులుగా, ప్రజాప్రతినిధులు ప్రత్యేక ఆహ్వానితులుగా ఉంటారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా 38 మండలాల పరిధిలో గల 248 పంచాయతీల్లోని 711 గ్రామాల్లో పోడు భూములను గిరిజనులు, ఇతర రైతులు సాగు చేస్తున్నారు. 66 వేల మంది 2.27 లక్షల ఎకరాల భూమి హక్కు పత్రాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో 18,884 మంది రైతులు 72,592 ఎకరాలు, నిర్మల్లో 8,666 మంది 24,992, మంచిర్యాలలో 11,774 మంది 33,418, కుమ్రం భీం ఆసిఫాబాద్లో 26,680 మంది రైతులు 96,126 ఎకరాల కోసం దరఖాస్తులు అందజేశారు. సర్వేలో భాగంగా సాగు విస్తీర్ణం, నాలుగు వైపుల ఏ రైతులు ఉన్నారనే విషయాలను తెలుసుకుంటున్నారు. అటవీశాఖ అధికారులు సర్వేలో భాగంగా యాప్ను ఉపయోగిస్తున్నారు. సెల్ఫోన్లో భూమి విస్తీర్ణాన్ని కొలిచే యాప్ను ఓపెన్ చేసి భూమి చుట్టూ నడుస్తున్నారు. దీంతో చుట్టూ కొలత నమోదవుతుండగా విస్తీర్ణం తెలుస్తున్నది. అనంతరం దరఖాస్తులో ఉన్న కోడ్ నంబరు, రైతు పేరు, నమోదు చేసి ఫొటో తీసుకుని ఆన్లైన్లో పొందుపరుస్తున్నారు.
క్షేత్రస్థాయిలో వివరాల సేకరణ
పోడు భూముల సర్వేలో భాగంగా క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటిస్తున్నాం. అటవీ, రెవెన్యూ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు, ఎఫ్ఆర్సీ సభ్యులు, స్థానికులతో కలిసి సర్వే నిర్వహిస్తున్నాం. దరఖాస్తు చేసుకున్న రైతుల భూమి విస్తీర్ణం పక్కాగా తెలుసుకునేందుకు యాప్ను వినియోగిస్తున్నాం. మ్యాప్లు కూడా తయారు చేస్తున్నాం. భూములు సాగు చేస్తున్న వారి వివరాలను నమోదు నమోదు చేసుకుంటున్నాం.
– ప్రశాంత్, ఎఫ్బీవో, ఆదిలాబాద్