ఎదులాపురం, జనవరి 27 : జపాన్ దేశంలో పనిచేసేందుకు అర్హత కలిగిన నర్సింగ్ విద్యార్థులకు ఆరు నెలల పాటు జపనీస్ భాషలో శిక్షణనిచ్చి ఉద్యోగం కల్పిస్తామని తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్పవర్ కంపెనీ లిమిటెడ్ (టామ్కమ్) మేనేజర్ షబ్నా అన్నారు. జిల్లా ఉపాధి శాఖ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ మెడికల్ కళాశాలో నర్సింగ్ విద్యార్థులకు శుక్రవారం స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించారు. ముందుగా టామ్కమ్ ద్వారా కల్పిస్తున్న సౌకర్యాలను ఆమె పవర్ పాయింట్ ద్వారా అవగాహన కల్పించారు. జపాన్లో పని చేసేవారు మాట్లాడే విధానం, తదితర అంశాలపై టామ్కమ్ హెచ్ఆర్ మేనేజర్ శ్రావణి క్లుప్తంగా అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా షబ్నా మాట్లాడుతూ.. తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్పవర్ కంపెనీ లిమిటెడ్(టామ్కమ్), కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగారాల శాఖ కింద రిజిస్టర్డ్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ ద్వారా స్పెసిఫైడ్ స్కిల్డ్ వర్కర్స్ కింద జపాన్లో పనిచేసేందుకు అర్హత కలిగిన వారిని ఎంపిక చేయనున్నట్లు చెప్పారు. 94 మంది అభ్యర్థులకు స్క్రీనింగ్ నిర్వహించారు. పరీక్షలో ప్రతిభ కనబరిచిన వారికి ఫోన్, ఇ-మెయిల్ ద్వారా తెలియజేస్తామని తెలిపారు. ఎంపికైన అభ్యర్థులకు జపనీస్ భాషపై ఆరునెలల పాటు రెసిడెన్షియల్ శిక్షణ, జపాన్లో పని చేయడానికి అవసరమైన అదనపు వృత్తిపరమైన నైపుణ్యాలు నేర్పిస్తామని పేర్కొన్నారు. ఎంపికైన వారికి పూర్తి స్థాయి భద్రత టామ్కమ్ ఇస్తుందని భరోసానిచ్చారు. జపాన్లో ప్రతినెలా రూ.1.20 లక్షల నుంచి రూ.1.50 లక్షల వరకు సంపాదించుకోవచ్చని పేర్కొన్నారు. అనంతరం జిల్లా ఉపాధి శాఖ అధికారి కిరణ్ కుమార్ మాట్లాడుతూ.. ప్రభుత్వం కల్పిస్తున్న ఇలాంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జూనియర్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ విజయలక్ష్మి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.