దిలావర్పూర్ : త్వరలోనే అర్హులైన పేదలందరికీ సొంతింటి కలను నెరవేరుస్తామని రాష్ట్ర దేవాదాయ, న్యాయ, అటవీ శాఖ మంత్రి అల్లోల్ల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. దిలావర్పూర్ తహసీల్ కార్యాలయంలో నర్సాపూర్(జీ), దిలావర్పూర్, మండలాలకు చెందిన లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని అన్నారు. త్వరలోనే అర్హులైన పేదలందరికీ సొంత ఇంటి స్థలం కలిగిన వారికి డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించి ఇస్తామని వెల్లడించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 57 సంవత్సరాలు నిండిన వారికి ఆసరా పింఛన్లు, రైతులకు రుణమాఫీ వంటి హామీలను త్వరలోనే అమలు చేస్తున్నామని అన్నారు.
తాను దేవాదాయ శాఖ మంత్రి నిర్మల్ నియోజక వర్గంలో 5వందల ఆలయాలకు నిధులు ఇచ్చి నిర్మిస్తున్నామని చెప్పారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ వీరేశ్కుమార్, తాసీల్ధార్ హిమబిందు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కొమ్ముల దేవేందర్రెడ్డి, ఎంపీపీ బాబురావు, సహకార సంఘం చైర్మన్ పీవీ రమణరెడ్డి, జిల్లా రైతుబంధు సమితీ సభ్యులు ఏలాల చిన్నరెడ్డి, ఎంపీటీసీలు పాల్ధే అక్షర అనీల్, జిల్లా పరిషత్ కోఆప్షన్ సభ్యులు డాక్టర్ సుభాష్రావు, ఆర్ఐ సంతోష్ తదితరులు పాల్గొన్నారు.