కుభీర్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత శాసనసభ ఎన్నికల్లో ఇచ్చిన పించన్ డబ్బుల పెంపు హామీని వెంటనే అమలు చేయాలని కోరుతూ.. నిర్మల్ జిల్లా కుభీర్ మండల కేంద్రంలోని రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్ శివరాజ్కు వీహెచ్పీఎస్ ( వికలాంగ హక్కుల పోరాట సమితి) ఆధ్వర్యంలో సోమవారం నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నందకుమార్ మాదిగ మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వికలాంగులకు రూ.6 వేలు, మిగతా పించన్ దారులకు రూ.4 వేలు పెంచి అందజేస్తామని ఇచ్చిన హామీ మర్చిపోయారా సీఎం గారూ..? అంటూ నిలదీశారు.
అన్ని వర్గాల ప్రజలను మోసం చేసి, ఇచ్చిన హామీలను నెరవేర్చుకోలేని దుస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం కొట్టుమిట్టాడుతోందని పేర్కొన్నారు. ఏది ఏమైనప్పటికీ పించన్ దారులకు పించన్ డబ్బులను పెంచి అందజేయాలని, లేని పక్షంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని వర్గాల ప్రజలు తగిన బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బాబు, గోనె విట్టల్ తదితరులు పాల్గొన్నారు.