TSPSC | టీఎస్పీఎస్సీ నిర్వహించిన డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ (డీఏవో) రాత పరీక్ష సమయంలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. నిజామాబాద్ జిల్లా బోర్గాం (పీ) ఉన్నత పాఠశాల పరీక్షాకేంద్రంలో అబ్దుల్ ముఖీద్ అనే అభ్యర్థి ఓఎంఆర్ షీట్ను మింగేశాడు. అతడు తన ఓఎంఆర్ షీట్లో వివరాలు తప్పుగా నమోదు చేశాడు. ఆ తర్వాత తప్పును గుర్తించిన అతడు తన ఓఎంఆర్ షీట్ను మింగేశాడు. ఎగ్జామినేషన్ సెంటర్ ఇన్చార్జితో పాటు పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.
నిజామాబాద్ మండలం బోర్గాం(పీ) గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆదివారం ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రానికి నిర్మల్ జిల్లాకు చెందిన అబ్దుల్ ముఖీద్ అనే అభ్యర్థి పరీక్ష రాసేందుకు హాజరయ్యాడు. పరీక్ష సెంటర్కు వచ్చిన ముఖీద్కు ఇన్విజిలేట్ ఆఫీసర్ ఓఎంఆర్ షీట్ను ఇచ్చాడు. ముఖీద్ పక్కన రావాల్సిన ఓ అభ్యర్థి పరీక్షకు గైర్హాజరయ్యాడు. దీంతో ఇన్విజిలేటర్ అతని స్థానంలో ఓఎంఆర్ షీట్ ఉంచాడు. అయితే పరీక్ష మొదలైన కాసేపటి తర్వాత ముఖీద్ పక్కన పెట్టిన ఓఎంఆర్ షీట్ కనిపించలేదు. ఓఎంఆర్ షీట్ ఏమైందని ఇన్విజిలేటర్ అడగ్గా.. దానికి తనకేమీ తెలియదని ముఖీద్ సమాధానం ఇచ్చాడు. అనుమానం వచ్చిన ఇన్విజిలేటర్ ముఖీద్ను నిలదీయడంతో తన ఓఎంఆర్ షీట్ను ముక్కలు ముక్కలుగా చించి నమిలి మింగేశాడు. మింగిన పేపర్ ముక్కల్లో కొన్నింటిని బయటకు తీయించడంతో పాటు ముఖీద్ను ఎగ్జామ్ సెంటర్ నుంచి ప్రిన్సిపల్ ఆఫీసుకి తీసుకెళ్లారు.
ఎగ్జామ్ హాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించగా అబ్దుల్ ముఖీద్.. పక్కన ఉన్న ఓఎంఆర్ షీట్ తీసుకోవడం కనిపించింది. దీంతో ముఖీద్ను గట్టిగా నిలదీయగా.. తనకు కేటాయించిన ఓఎంఆర్ షీట్లో హాల్ టికెట్ నంబర్ తప్పుగా రాశానని అందుకోసమే మరో అభ్యర్థి షీట్ను తీసుకున్నట్లు అంగీకరించాడు. ఈ ఘటనపై పరీక్షా కేంద్రం సూపరింటెండెంట్ ఫిర్యాదు మేరకు అబ్దుల్ ముఖీద్పై చీటింగ్, మాల్ ప్రాక్టీస్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అతడి నోట్లో నుంచి స్వాధీనం చేసుకొన్న ఓఎంఆర్ షీట్ ముక్కలను కోర్టులో సమర్పించనున్నట్లు ఎస్సై వెల్లడించారు. నిర్మల్ జిల్లాకు చెందిన అబ్దుల్ ముఖీద్ నిజామాబాద్ కో- ఆపరేటివ్ బ్యాంకులో క్లర్క్గా ఉద్యోగం చేస్తున్నాడు. ఇటీవల అతని తండ్రి మరణించడంతో తన ఉద్యోగం ముఖీద్కు ఇచ్చారు.