నేరడిగొండ, ఫిబ్రవరి 4 : ప్రతి విద్యార్థి ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని, వాటి సాధనకు కృషి చేయాలని బోథ్ సివిల్కోర్టు జడ్జి హుస్సేన్ అన్నారు. నేరడిగొండ కేజీబీవీ పాఠశాలలో శనివారం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడారు. లక్ష్య సాధనకు సమయపాలన, పట్టుదల, సాధన అవసరమని పేర్కొన్నారు. చదువుతో పాటు ఆరోగ్యం, ఆహారంపై జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను వినియోగించుకోవాలని సూచించారు. ఉన్నతంగా ఎదిగి తల్లిదండ్రులు, గురువులకు మంచిపేరు తీసుకురావాలన్నారు. బాల కార్మిక నిర్మూలన, విద్యాహక్కు చట్టం, లైంగిక వేధింపులు తదితర విషయాలపై అవగాహన కల్పించారు. అనంతరం పాఠశాలలో సమస్యలు తెలుసుకున్నారు. మైక్సెట్ కావాలని కోరగా తన వంతుగా రూ.5వేలు, ఎస్ఐ సాయన్న రూ. 5 వేలు అందజేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పంద్రం శంకర్, నేరడిగొండ ఎస్ఐ సాయన్న, పాఠశాల ఇన్చార్జి ఎస్వోలు మమత, షాహీన్, న్యాయవాదులు విజయ్, హరీశ్, సీడీవో రాథోడ్ మోహన్, కోర్టు సిబ్బంది స్రవంతి, సంగీత, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి
చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని న్యాయసేవాధికార సంస్థ చైర్మన్, జూనియర్ సివిల్ కోర్డు జడ్జి దుర్గారాణి అన్నారు. అంతర్జాతీయ కేన్సర్ డేను పురస్కరించుకొని మండలంలోని శ్యాంపూర్ ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో శనివారం వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడారు. కేన్సర్ నివారణకు ఆరోగ్య సూత్రాలు పాటిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అనంతరం మండల న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఉచిత న్యాయ సహాయం, గృహింస చట్టం, మెయింటెనెన్స్, న్యాయ సేవా సంస్థ అందించే సేవలతో పాటు పలు చట్టాలపై అవగాహన కల్పించారు. బీర్సాయిపేట్ రాయిసెంటర్లో న్యాయ విజ్ఞాన సదస్సు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బాపురెడ్డి, న్యాయవాదులు జమీర్ ఖాన్, పెందూర్ ప్రభాకర్, జైవంత్రావు, వైద్యులు సందీప్ రాథోడ్, విజయలక్ష్మి, వైద్య సిబ్బంది, ఆశ కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.