నిర్మల్ టౌన్, ఫిబ్రవరి 26 : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా 1,507 గ్రామ పంచాయతీ(జీపీ)లు ఉన్నాయి. ఇందులో నిర్మల్ జిల్లాలో పాతవి 240 జీపీలు.. కొత్తవి 153.. ఆదిలాబాద్ జిల్లాలో పాతవి 224, కొత్తవి 244.. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పాతవి 175, కొత్తవి 160.. మంచిర్యాల జిల్లాలో 311 గ్రామ పంచాయతీలున్నాయి. పాత పంచాయతీల్లో కొన్ని భవనాలు శిథిలావస్థలో ఉండగా.. కొత్త పంచాయతీలకు భవనాలు లేవు. రెండు నెలల క్రితం పంచాయతీ రాజ్ కమిషనర్ నిర్మల్, ఆదిలాబాద్, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లో ప్రస్తుతం శిథిలావస్థలో ఉన్నవి, అద్దె భవనాల్లో కొనసాగుతున్నవి, పాఠశాలల్లో నిర్వహిస్తున్న జీపీల జాబితా కావాలని జిల్లా పంచాయతీ అధికారులను ప్రతిపాదనలు కోరారు. జనాభా, మండలం, ఊరు, బడ్జెట్ అన్ని వివరాలను ఆన్లైన్లో నివేదిక రూపంలో రాష్ట్ర ప్రభుత్వానికి పంపాలని సూచించారు. ఈ మేరకు అధికారులు కొత్త, పాతవి కలిపి 612 పంచాయతీలకు నూతన భవనాలు కావాలని, ఒక్కో భవనానికి రూ.25 లక్షల వరకు నిధులు మంజూరు చేయాలని ప్రతిపాదనలు పంపించారు. వీటి నిర్మాణం కోసం ఎన్ఆర్ఈజీఎస్, రాష్ట్రీయ గ్రామీణ స్వరాజ్ యోజన, ఎంపీ, ఎమ్మెల్యేల నిధులు ఉపయోగించుకునే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సొంత భవనాలు లేని, శిథిలావస్థలో ఉన్న గ్రామ పంచాయతీల జాబితాను ప్రభుత్వానికి పంపించాం. మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి సహకారంతో ఒక్కొక్క భవనానికి రూ.25 లక్షల చొప్పున నిధులు మంజూరు చేయాలని ప్రభుత్వానికి విన్నవించాం. ఈ ఆర్థిక సంవత్సరం నుంచే కొత్త భవనాలకు నిధులు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం కొత్త గ్రామ పంచాయతీ భవనాలు లేకపోవడంతో పరిపాలన ఇబ్బందిగా ఉండడంతో ప్రభుత్వం కొత్త గ్రామ పంచాయతీలు నిర్మిస్తే ప్రజలకు ప్రయోజనం ఉంటుంది.
– వెంకటేశ్వర్రావు, జిల్లా పంచాయతీ అధికారి, నిర్మల్.
తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తండాలను జీపీలుగా మార్చింది. అప్పట్లో గ్రామ పంచాయతీకి అనుబం ధంగా తండాలు ఉండడంతో ఇబ్బందులు పడ్డాం. 500 జనాభా ఉన్న తండాను కొత్త గ్రామ పంచాయతీగా మార్చడంతో తమ తండాల్లోనే తమ పరిపాలన నిర్వహించుకునే అవకాశం తెలంగాణ ప్రభుత్వం కల్పించింది. కొత్తగా ఏర్పడ్డ జీపీల్లో సొంత భవనాలు నిర్మిస్తే ప్రజలకు సేవ చేస్తాం. ప్రభుత్వంపై విశ్వాసం ఉంది. ఈ ఏడాదే జీపీలకు నిధులు మంజూరవుతాయని ఆశిస్తున్నాం.
– జాదవ్ శంకర్, సర్పంచ్, డొడర్నా, కుభీర్ మండలం.