కుభీర్, నవంబర్ 10 : నిర్మల్ జిల్లా కుభీర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో స్వచ్ఛత లోపించి పరిసరాలన్నీ కంపు కొడుతున్నాయి. దవాఖాన మెయిన్ డోర్ ముందు పిచ్చి మొక్కలు పెరిగి బంజరు దొడ్డిలా దర్శనమిస్తోంది. దవాఖాన ముందు ఏర్పాటు చేసిన బోర్డు వంగి పోయినా పట్టించుకున్న వారు లేరు. దవాఖానకు ప్రతి రోజు వచ్చే రోగులు, నెలకోసారి వచ్చే గర్భిణిలు, బాలింతలు ముక్కుమూసుకుని రావాల్సిన దుస్థితి నెలకొంది. రోగాలకు చికిత్స ఏమోగానీ ప్రజలకు రోగాలు ప్రబలేటట్టు ఉన్నాయని పేర్కొంటున్నారు. దవాఖానలో కనీస సౌకర్యాలు కూడా కరువయ్యాయి.
పేరుకే ‘రౌండ్ ది క్లాక్ హాస్పిటల్’ ఏనాడూ 24 గంటలు సేవలు అందించిన దాఖలాలు లేవనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మండలంలో 30 వరకు గిరిజన తండాలు ఉన్నాయి. ఇక్కడ సేవలందక ప్రైవేటు ఆర్ఎంపీ, పీఎంల లను ఆశ్రయించి నష్ట పోతున్నారు. ఇక్కడ ఇద్దరు వైద్యులు, ముగ్గురు స్టాఫ్ నర్సులు, ఉండాల్సి ఉండగా ఒక వైద్యుడు, ఒక మేల్ స్టాఫ్ నర్సు మాత్రమే ఉన్నారు. ప్రభుత్వ దవాఖాన ఉన్నా పేదవారికి కనీస వైద్యం అందక పోవడం పట్ల ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు దృష్టి సారించక పోవడం మండల ప్రజలకు శాపంగా మారింది. జిల్లా కలెక్టర్ దృష్టి సారించి మండలంలోని పేద ప్రజలకు ప్రభుత్వ వైద్యం అందేలా చర్యలు చేపట్టాలని మండలవాసులు డిమాండ్ చేస్తున్నారు.
