కుభీర్, డిసెంబర్ 26 : గ్రామాల అభివృద్ధిలో సర్పంచ్ల పాత్ర వెల కట్టలేనిదని ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ పేర్కొన్నారు. నిర్మల్ జిల్లా కుభీర్ మండలంలోని శివుని తండాలో శుక్రవారం నూతనంగా ఎన్నికైన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యుల విజయోత్సవ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఉపాధి హామీ పథకం ద్వారా సీసీ రోడ్లు, మురికి కాలువల నిర్మాణం, పల్లె బాటలు, జీపీ బిల్డింగులు, వ్యవసాయ క్షేత్రాలకు మట్టి రోడ్లు తదితర పనులను చేపట్టి గ్రామ అభివృద్ధిలో తమ వంతు పాత్రను పోషించాలని సూచించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధి కోసం జీపీ లకు ఇచ్చే నిధులు శూన్యమన్నారు. శివుని తండా గిరిజన ప్రజల సౌకర్యార్థం తారు రోడ్డు నిర్మాణం, తదితర పనులు చేయిస్తానని హామీ ఇచ్చారు. అంతకుముందు జగదంబా, సేవాలాల్ ఆలయాల్లో ఆయన పాలకవర్గ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ రాథోడ్ దేవుకాబాయి విశాల్, బీజెపి మండల అధ్యక్షుడు ఏశాల దత్తాత్రి, వడ్డం నాగేశ్వర్, సాంవ్లీ రమేష్, రాథోడ్ శంకర్, గులాబ్ నాయక్, జాదవ్ గణపతి, వెంకట్రావు పటేల్ పాల్గొన్నారు.