నిర్మల్: పల్లె ప్రగతితో గ్రామాలు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నాయని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. జిల్లాలోని మామడ మండలం గాయిద్పల్లిలో ఐదో విడుత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా మంత్రి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీలకు నెలకు రూ.256 కోట్ల రూపాయలు మంజూరు చేస్తుందన్నారు.
కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని విమర్శించారు. పంచాయతీలకు రావాల్సిన రూ.14 వందల కోట్లను మంజూరు చేయడం లేదని మండిపడ్డారు. పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా పంచాయతీలకు ఆదాయం సమకూరుతుంది. గ్రామంలో మిషన్ భగీరథ ప్రజలకు సురక్షితమైన నీటిని ప్రభుత్వం సరఫరా చేస్తుందని మంత్రి పేర్కొన్నారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.