మెట్పల్లి, ఆగస్టు4: అధికారుల సమన్యయలోపంతోనే పెద్ద చెరువుకు గండిపడి చేపలు కొట్టుకుపోయాయని, నష్టపోయిన మత్స్యకారులకు పరిహారం చెల్లించాలని కోరుట్ల ఎమ్మెల్యే డా సంజయ్ కల్వకుంట్ల డిమాండ్ చేశారు. ఇటీవల కురిసిన వర్షాలతో నిండిన పెద్దచెరువుకు గండి పెట్టడంతో నీరు వృథాగా పోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే మంగళవారం నీటిపారుదలశాఖ, మున్సిపల్ శాఖ ఇంజినీర్ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి గండి పడిన ప్రాంతాన్ని పరిశీలించారు. సంబంధిత అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆ శాఖ ఉన్నతాధికారులతో ఎమ్మెల్యే ఫోన్లో మాట్లాడారు. అవగాహన లోపంతో చేసిన పని వల్లే మత్స్యకారులకు తీవ్ర నష్టం జరిగిందని, వెంటనే ప్రభుత్వం పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. చెరువు కట్ట (ట్యాంక్ బండ్)ను యుద్ధప్రాతిపదికన పునరుద్ధరించాలని, అవసరమైన శాశ్వత రక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పట్టణ ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు.
పెద్దచెరువును యథావిధిగా నీటితో నింపి, పట్టణ ప్రజలను కాపాడాలని సూచించారు. ఇక్కడ మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్గౌడ్, మున్సిపల్, నీటి పారుదల శాఖ అధికారులు, బీఆర్ఎస్ నాయకులు పూదరి సుధాకర్గౌడ్, మారు సాయిరెడ్డి, అంగడి పురుషోత్తం, ఎండీ జావీద్, ఆకుల ప్రవీణ్, మత్స్యకార సంఘం నాయకులు పాల్గొన్నారు.