నిర్మల్, జూన్ 2 : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు వచ్చాయని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని దివ్యనగర్లో కోటి నిధులతో నిర్మించిన జిల్లా మత్స్య భవన్,శిక్షణ కేంద్రాన్ని గురువారం మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు.
అంతకుముందు గంగ పుత్రులు మంత్రికి సాంప్రదాయ వలలు, డప్పు వాయిద్యాలతో స్వాగతం పలికారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. మత్స్యకారుల అభివృద్ధి కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందన్నారు. నిర్మల్ జిల్లాలో చాలా చెరువులు, కుంటలు, వాగులు ఉన్నాయని శ్రీ రాం సాగర్ ప్రాజెక్టు, స్వర్ణ, కడెం, ప్రాజెక్టుల పై ఆధారపడి మత్స్యకారులు జీవనం సాగిస్తున్నారని అన్నారు.
వారి కోసం ప్రతి సంవత్సరం ప్రభుత్వం ఉచితంగా చేప పిల్లలు, రొయ్య పిల్లలను 100 శాతం సబ్సిడీపై పంపిణీ చేస్తుందని పేర్కొన్నారు. అలాగే వలలు ఐస్ బాక్స్ లు, మోపేడ్లు, నాలుగు చక్రాల వాహనాలను ఉచితంగా అందజేస్తున్నట్లు తెలిపారు ముఖ్యమంత్రి కేసీఆర్ తెచ్చిన నీలి విప్లవం వల్ల మత్స్య సంపద బాగా పెరిగి గంగ పుత్రులకు ఏడాది పొడవున ఉపాధి దొరుకుతుందన్నారు.
కార్యక్రమంలో జెడ్పీ చైర్ పర్సన్ కె విజయ లక్ష్మి, ముధోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, కలెక్టర్, ముషారఫ్ ఫారూఖీ, అదనపు కలెక్టర్లు హేమంత్, రాంబాబు, మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, ఎంపీపీ రామేశ్వర్ రెడ్డి, జడ్పీటీసీ జీవన్ రెడ్డి, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు మారుగొండ రాము, పారిశ్రామిక వేత్త అల్లోల మురళీధర్ రెడ్డి, స్థానిక కౌన్సిలర్ కొండ సబిత, మార్కెట్ చైర్మన్ నర్మద, తదితరులు హాజరయ్యారు.