నిర్మల్ టౌన్, ఫిబ్రవరి 15 : నిర్మల్ జిల్లాలోని కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా కాలువల నిర్మాణానికి కావాల్సిన భూసేకరణ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో భూ సేకరణపై సంబంధిత అధికారులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 27 ప్యాకేజీలో భాగంగా కాలువల నిర్మాణం, లిఫ్ట్ ఇరిగేషన్ పనులు పూర్తయ్యేలా చూడాలని పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా జిల్లాలో 50 వేల ఎకరాల్లో సాగునీరు అందుతుందని తెలిపారు. భూ సేకరణ కోసం మామడ మండలంలో 19 కి.మీ. నోటిఫికేషన్ ఇచ్చినట్లు చెప్పారు. జీవో నంబర్ 123 ప్రకారం రైతులకు పరిహారం ఇస్తామని తెలిపారు. రైతుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, ఈఈ రామారావు, డీఈ జగదీశ్, ప్రత్యేకాధికారి స్రవంతి పాల్గొన్నారు.
నిర్మల్ అర్బన్, ఫిబ్రవరి 15 : క్రీడా పాఠశాలలో ప్రవేశాలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో క్రీడా పాఠశాలలో ప్రవేశాలకు సంబంధించిన పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ స్కూల్ హకీంపేట్ ఆదేశాల మేరకు హకీంపేట్, ఆదిలాబాద్, కరీంనగర్లలో 4, 5వ తరగతుల్లో అడ్మిషన్ కోసం ఈ నెల 24న ఉదయం 9 గంటలకు ఎన్టీఆర్ మినీ స్టేడియంలో జిల్లా స్థాయి ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో ప్రతిభ చూపిన వారిని రాష్ట్ర స్థాయికి పంపుతామని చెప్పారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి ముత్తన్న, మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్ ఉన్నారు.