కుభీర్ : కార్యకర్తలే పునాదిరాళ్ల వంటి వారని , ప్రతి ఒక్కరూ సైనికుల్లా పనిచేసి పార్టీ ప్రతిష్ట మరింత పెంచాలని ముథోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్రెడ్డి అన్నారు. కష్టపడే ప్రతి కార్యకర్తకు పార్టీలో సముచిత స్థానం దక్కుతుందని వివరించారు. ఆదివారం మండలకేంద్రం కుభీర్లోని ప్రగతి స్కూల్లో మండల స్థాయి కార్యకర్తల సమావేశం, పార్టీ ఆవిర్భావం సందర్భంగా వరంగల్లో విజయ గర్జనకు సన్నాహాక సమావేశం పార్టీ మండల అధ్యక్షుడు ఎన్నీల అనిల్ అధ్యక్షతన జరిగింది. ముఖ్య అథితిగా హాజరైన ఎమ్మెల్యే కార్యకర్తలను ఉద్ధేశించి మాట్లాడారు. కార్యకర్తల పురోగతికి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి కేసీఆర్ దూరదృష్టితో క్రియాశీల కార్యకర్తకు రూ.2లక్షల బీమా కల్పించినట్లు తెలిపారు.
ప్రభుత్వ పథకాలను ఇంటింటికి తీసుకువెళ్లాలని సూచించారు. కార్యకర్తల కష్ట సుఖాల్లో మండల నాయకులు పాల్గొని అండగా నిలవాలని కోరారు. రానున్న రోజుల్లో సీఎం కేసీఆర్ మరెన్నో నూతన పథకాలను అందించనున్నారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో టీఆర్ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి తూం రాజేశ్వర్, మాజీ జడ్పీటీసీ శంకర్ , నాయకులు రేకుల గంగాచరణ్, వైస్ ఎంపీపీ మొహియొద్దీన్, పీరాజీ, కందుర్ సంతోష్, సాయినాథ్, దొంతుల రాములు, దత్తురాం కాక, సర్పంచులు, ఎంపీటీసీలు, రైతుబంధు సమితుల సభ్యులు, ఆయా గ్రామాల టీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.