నిర్మల్, జనవరి 23(నమస్తే తెలంగాణ) : నిర్మల్ జిల్లాలో యథేచ్ఛగా ఇసుక దందా కొనసాగుతున్నది. భవన నిర్మాణాలు భారీ సంఖ్యలో జరుగుతుండడంతో విపరీతంగా డిమాండ్ ఉంది. నిర్మల్ పట్టణంతోపాటు, భైంసా, ఖానాపూర్ ప్రాంతాల్లో ఇసుక డంపులే దర్శనమిస్తున్నాయి. ప్రధానంగా రాజకీయ నాయకులు, గ్రామాల అభివృద్ధి కమిటీ(వీడీసీ)లకు ఆదాయ వనరుగా మారింది. వీడీసీలు తమ పరిధిలోని వాగులకు వేలం నిర్వహించి, అనధికారికంగా తవ్వుకునేందుకు అనుమతులు ఇస్తున్నాయి. భూగర్భ గనుల శాఖ, రెవెన్యూ, పోలీసు యంత్రాంగం పట్టించుకోక పోవడంతో దందా నిరంతరాయంగా కొనసాగుతున్నదనే విమర్శలున్నాయి.
నిర్మల్ జిల్లాలోని గోదావరి పరీవాహక ప్రాంతమంతా ఇసుకకు కేంద్ర బిందువుగా మారింది. కడెం, పెంబి, ఖానాపూర్ మండలాల పరిధిలో ప్రవహించే పల్కేరి వాగు దందాకు అడ్డాగా మారింది. అలాగే భైంసా సమీపంలో గల సుద్దవాగు, దాని ఉప వాగుల నుంచి కూడా తరలిస్తున్నారు. చిట్యాల, స్వర్ణ వాగు పరీవాహక ప్రాంతంలోని ఆలూరు, బోరిగాం, కౌట్ల, వెంగ్వాపేట్ గ్రామాలను కేంద్రంగా చేసుకుని పెద్ద మొత్తంలో తీసుకెళ్తున్నారు. చాలా చోట్ల ఇసుక డంపులు కనిపిస్తున్నప్పటికీ అధికారులు చూసి చూడనట్లుగా వదిలేయడం అనుమానాలకు తావిస్తున్నది. ఫలితంగా.. ప్రభుత్వం కోట్లాది రూపాయల రాయల్టీని కోల్పోతున్నది. కాగా.. ఇసుక తరలింపు భూగర్భ జలాలపై కూడా పడనున్నది.
అంతా వీడీసీల కనుసన్నల్లోనే..
గ్రామాల సరిహద్దు గుండా ప్రవహిస్తున్న వాగులపై అక్కడి వీడీసీలు గుత్తాధిపత్యాన్ని చ లాయిస్తున్నాయి. ఇసుకను తరలించేందుకు వేలం పాటలు నిర్వహించి అనధికారిక హక్కు లు కల్పిస్తున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. కొన్ని గ్రామాల్లో రశీదులను ముద్రించి అనుమతులను జారీ చేస్తున్నాయని సమాచారం. సర్పంచ్లు, ప్రజా ప్రతినిధులు వీడీసీ మాట కు ఎదురు చెప్పలేని పరిస్థితులు కొనసాగుతున్న కారణంగా ఇసుక దందా దర్జాగా సాగుతున్నది. వీడీసీలు ఇసుకకే కాకుండా బెల్టు షాపులు, కూల్డ్రింక్ షాపులు, చికెన్ దుకాణాలకు కూడా వేలం పాటలు నిర్వహించడం పరిపాటిగా మారింది. ఈ నిధులను అభివృద్ధికి ఖర్చు చేస్తున్నట్లు చెబుతున్నా.. ఆశించిన అభివృద్ధి కనిపించడం లేదన్న ఫిర్యాదులున్నాయి.
రాజకీయ నేతల హస్తం
ఇసుక దందా వెనుక రాజకీయ నేతల హస్తం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. పలుకుబడి, పరపతితో అధికారులను మచ్చిక చేసుకుని దందా కొనసాగిస్తున్నారు. ద్వితీయ శ్రేణి నాయకులు కూడా అధికారులను పక్కదోవ పట్టిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అధికారులు కూడా కొన్నిచోట్ల ఇసుక డంప్లను స్వాధీనం చేసుకుంటున్నారు. ఆ తర్వాత సీజ్ చేసిన ఇసుకకు రహస్యంగా వేలం నిర్వహించడంతో తమ అనుయాయులే తక్కువ ధరకే దక్కించుకుంటున్నారు. ఇలా అంతా ఒక కనికట్టును తలపించే విధంగా కొనసాగుతున్నది. అధికారులు స్పందించి అక్రమంగా సాగుతున్న ఇసుక వ్యాపారాన్ని కట్టడి చేయాలని ప్రజలు కోరుతున్నారు.