నిర్మల్, ఆగస్టు 28(నమస్తే తెలంగాణ) : బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం కారణంగా నిర్మల్ జిల్లాలో రెండు రోజులుగా అతి భారీ వర్షాలు కురిశాయి. బుధవారం మధ్యాహ్నం ప్రారంభమైన వర్షం ఆకాశానికి చిల్లు పండిందా అన్నట్లు కురిసింది. జిల్లా సగటు వర్షపాతం 13 సెంటీమీటర్లు కాగా, నిర్మల్ పట్టణంతోపాటు నిర్మల్ మండలంలో అత్యధికంగా 33 సెంటీమీటర్ల రికార్డుస్థాయి వర్షపాతం నమోదైంది. అలాగే జిల్లాలోని అన్ని మండలాల్లో 10 నుంచి 20 సెంటీమీటర్ల వర్షం పడింది. గురువారం తెల్లవారుజాము నుంచి కూడా నిర్మల్ నియోజకవర్గంలో దాదాపు మూడు గంటలపాటు ఏకదాటిగా మళ్లీ వర్షం కురిసింది. చెరువులు, కుంటలు, ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి.
లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నిర్మల్ నుంచి ఆదిలాబాద్ వెళ్లే పాత జాతీయ రహదారి నిర్మల్ శివారులో పూర్తిగా కొట్టుకుపోవడంతో మార్గాన్ని మూసివేశారు. బాసర మండలంలోని బిద్రెల్లి గ్రామం వద్ద వాగు ఉధృతంగా ప్రవహించడంతో భైంసా నుంచి నిజామాబాద్ వైపు రాకపోకలు నిలిచిపోయాయి. సారంగాపూర్ మండలంలోని జాం గ్రామం వద్ద నిర్మల్-సారంగాపూర్ ప్రధాన రహదారిపై నుంచి వరదనీరు ప్రవహించడంతో రాకపోకలు స్తంభించాయి. సోన్ మండలంలోని మాదాపూర్ వద్ద స్వర్ణ వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో మాదాపూర్, పాక్పట్ల, గాంధీనగర్, వెల్మల్ గ్రామలకు రాకపోకలు నిలిచిపోయాయి.
నిర్మల్ శివారులోని సిద్ధాపూర్ వాగు ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో నిర్మల్ నుంచి కౌట్ల(కే), ముజ్గి, తాంశ, సిద్దులకుంట గ్రామాలకు రాకపోకలు నిలిచాయి. కుంటాల మండలంలోని కల్లూర్ నుంచి అందకూర్ గ్రామాల మధ్య ప్రధాన రహదారి కోతకు గురై ప్రమాదకరంగా మారింది. ఇదే మండలంలో కుంటాల నుంచి అంబకంటి వెళ్లే రోడ్డు కోతకు గురైంది. సారంగాపూర్ మండలంలోని జాం గ్రామ సమీపంలో హైలెవెల్ కాలువకు గండి పడడంతో కాలువ సమీపంలోని పొలాలన్నీ నీట మునిగాయి. లక్ష్మణచాంద మండలంలోని మునిపెల్లి గ్రామానికి చెందిన పశువుల కాపరి శంకర్నాయక్ బుధవారం నుంచి గోదావరి మధ్యలో గల ఓ పాయలో(కుర్రు) చిక్కుకుపోయాడు. ఎస్పీ జానకి షర్మిల ఆధ్వర్యంలో దాదాపు 24 గంటల రెస్క్యూ తర్వాత ఎట్టకేలకు ఎన్డీఆర్ఎఫ్ బృందం గురువారం మధ్యాహ్నం పశువుల కాపరి శంకర్ను పడవలో బయటకు తీసుకొచ్చారు.
ఖానాపూర్ పట్టణంలోని హైటెక్ సిటీ కాలనీకి వెళ్లే మార్గంలో ఏర్పాటు చేసిన తాత్కలిక రోడ్డు కోతకు గురికావడంతో రాకపోకలు నిలిచిపోయాయి. దస్తురాబాద్ మండలంలోని గొడిసేర్యాల గొండు గూడెం, మున్యాలలో వాగులు ఉధృతంగా ప్రవహించడంతో ఇం డ్లు, గుడిసెల్లోకి వరద నీరు వచ్చి చేరింది. గొ డిసేర్యాల శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం సైతం వరద నీటిలో మునిగిపోయింది. ముథోల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వర్షపు నీరు భారీగా నీరు చేరింది. ఎంజీబీ పాఠశాలలో భారీగా నీరు చేరడంతో విద్యార్థులకు మూడు రోజులు సెలవులు ఇచ్చి ఇంటికి పంపించారు. కుంటాల నుంచి అంబకంటి, కల్లూరు నుంచి అందకూర్ మధ్య రోడ్డు కోతకు గురై ప్రమాదకరంగా మారాయి.
నిర్మల్ పట్టణంలోని చాలా కాలనీలు నీట మునగడంతో స్థానికులు ఇళ్ల నుంచి బయటకు రాలేదు. జీఎన్ఆర్ కాలనీలోకి వరద రానున్నదని అధికారులు ముందే హెచ్చరించడంతో కాలనీవాసులు తమ ఇండ్లను ఖాళీ చేసి ఇతర ప్రాంతాలకు తరలివెళ్లారు. జీఎన్ఆర్ కాలనీతోపాటు, విశ్వనాథ్పేట్, సోఫీనగర్, ఇంద్రానగర్, ప్రియదర్శిని నగర్, నటరాజ్నగర్ కాలనీలు పూర్తిగా జలమయమయ్యాయి. కుంటాల మండల కేంద్రంతోపాటు ఓలా, అందకూర్ గ్రామాల్లో ఇండ్లల్లోకి వర్షపు నీరు చేరడంతో ఆయా గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వాతావరణ శాఖ అధికారులు జిల్లాను ఆరేంజ్ జోన్గా అలర్ట్ చేయడంతో కలెక్టర్ అభిలాష అభినవ్ పాఠశాలలకు సెలవు ప్రకటించారు.
మరో రెండు మూడు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ ప్రకటించడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇండ్లకే పరిమితం కావాలని అధికారులు సూచిస్తున్నారు. భారీ వర్షాలతో జిల్లా వ్యాప్తంగా ఆస్తినష్టంతోపాటు పంటలకు నష్టం వాటిల్లినట్లు చెబుతున్నారు. నిర్మల్ మండలం ముజ్గి, తాంశ, చిట్యాల్ మంజులాపూర్ శివారులో దాదాపు 100 ఎకరాల వరకు వరిపంట నీట మునిగినట్లు రైతులు చెబుతున్నారు. అలాగే సోన్ మండలం కడ్తాల్లో స్వర్ణ వాగు ఉప్పొంగడంతో పొలాల్లోకి భారీగా వరద నీరు చేరుకున్నది. భారీ వర్షాలతో కడెం, గడ్డెన్న, స్వర్ణ ప్రాజెక్టులకు ఎగువ నుంచి భారీగా ఇన్ఫ్లో వస్తున్నది. వరదల్లో చిక్కుకుంటే అత్యవసర సమయంలో 9100577132 నంబరుకు ఫోన్ చేయాలని అధికారులు సూచిస్తున్నారు.
ముంపునకు గురైన పలు ప్రాంతాల్లో బీఆర్ఎస్ నియోజకవర్గ నాయకులు రాంకిషన్రెడ్డి, పార్టీ పట్టణ అధ్యక్షుడు మారుగొండ రాము, జిల్లా కార్యదర్శి గండ్రత్ రమేశ్ పర్యటించి బాధితులకు భరోసా కల్పించారు. నిర్మల్ పట్టణంలోని జొహ్రానగర్ కాలనీకి చెందిన మహ్మద్ ఫయీం ఇల్లు పాక్షికంగా దెబ్బతినడంతో ఆయనను పరామర్శించారు. అనంతరం నీట మునిగిన జీఎన్ఆర్ కాలనీ, ప్రియదర్శినీనగర్, కమలానగర్, శాంతినగర్, మంజులాపూర్ ప్రాంతాలకు వెళ్లి సహాయక చర్యల్లో పాల్గొన్నా రు. నిర్మల్ శివారులోని సిద్దాపూర్ వాగు రోడ్డుపై నుంచి పొంగి పొర్లుతుండడంతో అక్కడికి వెళ్లి వాగు ఉధృతిని పరిశీలించారు. నిర్మల్ పట్టణ శివారులోని బంగల్పేట్ చెరువు కట్ట తెగిపోయే ప్రమాదం ఉందని ప్రచారం జరగడంతో చెరువు కట్టను పరిశీలించి, చెరువు కింది గల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఆదిలాబాద్, ఆగస్టు 28(నమస్తే తెలంగాణ) : ఆదిలాబాద్ జిల్లాలో రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం జైనథ్లో 111 మిల్లీమీటర్ల వర్షం పడగా.. గురువారం తలమడుగలో 78.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షాల కారణంగా గురువారం కలెక్టర్ రాజర్షి షా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ఎగువ ప్రాంతాల నుంచి మత్తడి వాగు, సాత్నాల ప్రాజెక్టుల్లోకి భారీగా వర ద రావడంతో అధికారులు పరీవాహక ప్రాంతా ల ప్రజలను అప్రమత్తం చేశారు. జైనథ్ మండలంలోని తర్నం వాగు పొంగడంతో ఆదిలాబాద్-జైనథ్, బేల మండలాలకు రాకపోకలకు అం తరాయం కలిగింది. భీంపూర్ వద్ద నిపాని వాగు రోడ్డుపై నుంచి ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. నేరడిగొండ, బజార్హత్నూర్ మండల కేంద్రాలను వరద నీరు ముంచెత్తింది.
జిల్లా వ్యాప్తంగా వరదనీరు నీరు ప్రవహించడంతో రైతులు పంటలు నష్టపోయారు. నేరడిగొండలో వరద ప్రభావిత ప్రాంతాల్లో బోథ్ ఎమ్మెల్యే అనిల్జాదవ్ పర్యటించారు. భారీ వర్షాల కారణంగా కామారెడ్డి జిల్లాలో ఎన్హెచ్-44 తెగిపోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. దీంతో పోలీసులు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఆదిలాబాద్ జిల్లాలోని భోరజ్ వద్ద గల ఎన్హెచ్-44పై వాహనాలను నిలిపివేశారు. మహారాష్ట్ర నుంచి హైదరాబాద్కు వెళ్తున్న వాహనాలను నిలిపివేయడంతో కిలోమీటర్ల మేర వాహనాలు ఆగిపోయాయి. గురువారం 10 గంటల తర్వాత వాహనాలను అనుమతించడంతో రాకపోకలు కొనసాగాయి.