కుంటాల, ఫిబ్రవరి 2 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మన ఊరు-మన బడి’తో పాఠశాలల రూపురేఖలు మారిపోయాయని నిర్మల్ కలెక్టర్ వరుణ్ రెడ్డి అన్నారు. కుంటాల మండలంలోని కల్లూరు ఉన్నత పాఠశాలను గురువారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ‘మన ఊరు-మన బడి’ కింద చేసిన అభివృద్ధి పనుల వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మార్పులకు అనుగుణంగా విద్యావ్యవస్థలో మార్పు తీసుకొచ్చి, ప్రతీ విద్యార్థి నాణ్యమైన విద్య అందించాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. తరగతి గదికి వెళ్లి స్వయంగా విద్యార్థులతో మాట్లాడారు. కాసేపు విద్యార్థులకు పాఠాలు బోధించారు. కలెక్టర్ వెంట డీఈవో రవీందర్రెడ్డి, డీఎంహెచ్వో ధన్రాజ్, నాయకులు నర్సింగ్రావు, దశరథ్ తదితరులు పాల్గొన్నారు.
‘మన ఊరు-మన బడి’పై సమీక్ష
నిర్మల్ టౌన్, ఫిబ్రవరి 2 : నిర్మల్ జిల్లాలో ‘మన ఊరు-మన బడి’ కింద చేపట్టిన అభివృద్ధి పనులపై కలెక్టరేట్లో అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. 38 పాఠశాలల్లో పనులు పూర్తయ్యాయని, బడులను కూడా ప్రారంభించామన్నారు. మొదటి విడుత కింద మొత్తం తీసుకున్న పనులు, వచ్చిన బడ్జెట్, చేపట్టిన, కొనసాగుతున్న పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.
పెండింగ్ పనులు ఈ నెల చివరి వరకు పూర్తి చేయాలన్నారు. ప్రతి తరగతి గదిని అందంగా తీర్చిదిద్ది విద్యార్థులను ఆకట్టుకునేలా రంగులు వేయాలని తెలిపారు. ఇంకా ప్రారంభం కాని పాఠశాలల పనులకు సంబంధించిన టెండర్లు నిర్వహించి, పనులు జరిగేలా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ ఏడాది పదో తరగతి ఫలితాల్లో మంచి ఫలితాలు వచ్చేందుకు ఇప్పటి నుంచే ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్లాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో డీఈవో రవీందర్రెడ్డి, పంచాయతీరాజ్ ఈఈ శంకరయ్య, ఆర్అండ్బీ అశోక్, విద్యాశాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
‘కంటి వెలుగు’ శిబిరం పరిశీలన..
లోకేశ్వరం, ఫిబ్రవరి 2 : మండలంలోని హవర్గ గ్రామంలో ఏర్పాటు చేసిన ‘కంటి వెలుగు’ శిబిరాన్ని కలెక్టర్ వరుణ్ రెడ్డి సందర్శించారు. నిర్వహణ ఎలా సాగుతున్నదని సంబంధిత అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. తహసీల్దార్ సరిత, డిప్యూటీ తహసీల్దార్ సర్పంచ్ భుజంగ్రావు తదితరులున్నారు.